చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2012, శుక్రవారం

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు పాకిస్థాన్‌లో గౌరవం!

http://www.hindustantimes.com/Punjab/Chandigarh/Honour-Bhagat-Singh-in-Pak-civil-group/SP-Article1-829701.aspx

Bhagat Singh
భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్ పాత్ర, మనదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకు సైతం ఉపయోగపడింది. 

ఉగ్రవాదం, నియంత, సర్వాధికారాలపై పోరాటం చేసిన భగత్ సింగ్‌ను పాకిస్థాన్‌లోని సివిల్ సొసైటీ గ్రూప్ గౌరవించింది. భగత్ సింగ్ వర్థంతి (శుక్రవారం మార్చి 23)ను పురస్కరించుకుని ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడింది. 

మార్చి 23వ తేదీ, 1931వ సంవత్సరం ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భగత్ సింగ్ ఉరిశిక్షకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి వేసిన గడ్డపైనే భగత్ సింగ్‌కు గౌరవం దక్కడం గమనార్హం. భగత్ సింగ్ వర్థంతిని పురస్కరించుకుని వరల్డ్ పంజాబ్ కాంగ్రెస్ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జమాన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలచే గౌరవించబడాల్సిన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్ అని కొనియాడారు.

ఇంకా తమ గ్రూప్ పాకిస్థాన్‌లో ఉన్న లాహోర్‌లో భగత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భగత్ సింగ్‌ ఉరిశిక్షకు గురైన ప్రాంతం ప్రస్తుతం షట్మన్ చౌక్ అని పిలువబడుతోంది. దీనిని భగత్ సింగ్ చౌక్‌గా పేరు మార్చాలని జమాన్ డిమాండ్ చేశారు.

News Summary: Legendary freedom fighter Bhagat Singh should be honoured in Pakistan as heroes are not limited to one country or religion and they transcend all borders in their fight against oppression, extremism and dictatorship, head of a leading civil society group said today.

27, జనవరి 2012, శుక్రవారం

గుర్తుచేసుకుందాం... ఇప్పుడైనా!


వీరులు, ధీరుల త్యాగఫలం మన రిపబ్లిక్!
ఈ గణతంత్ర వ్యవస్థలో నియంతలుండరు... రాజులుండరు... ప్రజలే ప్రభువులు!
ఠాకూర్ రోషన్ సింగ్ లాంటి ఎందరో ప్రజాఉద్యమకారులు అధికారాన్ని దేవిడీలనుంచి చేజిక్కించుకునే క్రమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ వీరులను స్మరించుకోవడం మనందరి కనీస కర్తవ్యం...

18 నవంబర్ 1921.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరుగుతోంది. షాజహాన్‌పూర్ నుంచి బరేలీ వరకు 80 కిలోమీటర్ల మేర సాగుతున్న ఊరేగింపు అది. సుమారు వెయ్యిమంది స్వదేశీ వస్త్రధారులై సైనికుల్లా కదం తొక్కుతున్నారు. విదేశీ వస్తువుల్ని నడిరోడ్లపై కాల్చేస్తున్నారు. భారత్‌మాతా కీ జై అనే నినాదంతో భూమ్యాకాశాలు బద్దలైపోతున్నాయి. ఆ వందల మందినీ ఉత్తేజితుల్ని చేస్తూ, ముందుకు నడిపిస్తున్న నాయకుడు- 29 ఏళ్ల రోషన్‌సింగ్.

దేశం కోసం మరణించడానికే పుట్టానన్నట్లు ఉన్నాడు రోషన్. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత బలమైన ఠాకూర్ వంశంలో జన్మించాడు. చిన్నప్పటినుంచి భయం అంటే ఏమిటో తెలీకుండా పెరిగాడు. తుపాకీని గురిపెట్టి కాల్చడంలో అతడికి సాటి అతడే! కుస్తీ పట్టు పడితే భీమసేనుడైనా రోషన్ ముందు దిగదుడుపే!

ఎలాగైనా ఆ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలి. అదీ రోషన్ పట్టుదల. మార్గమధ్యంలో పదులమంది గ్రామస్థులు కూడా పదం కలిపేలా చేస్తున్నాడు రోషన్. ఎక్కడికక్కడ పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అయినా జనసంద్రం సాగుతూనే ఉంది. ర్యాలీ ఇంకో పది నిమిషాల్లో బరేలీ చేరుతుందనగా పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేశారు. రోషన్‌ని కోర్టులో హాజరుపరిచారు. బరేలీ జైలుకి తరలించారు- రెండేళ్ల కారాగారవాసానికి!

జైలు నుంచి విడుదలయ్యాక రోషన్‌లో మునుపటికన్నా ఆవేశం హెచ్చింది. నిరంతరం ఒకటే ధ్యాస- దేశానికి స్వతంత్రం రావాలి; బ్రిటిష్‌వారిని తరిమేయాలి. అంతే! కుంగిపోతున్న దేశమాతను తలచుకుని ఎన్ని కన్నీళ్లు కార్చాడో! గోమతీ నదీ తీరంలోనో, గోధుమ పంట చేలల్లోనో తిరుగుతూ మిత్రుడు హుకాంసింగ్‌కు తన ఆవేదన చెప్పుకునేవాడు. తల్లి భారతి కోసం ఉరికంబమైనా ఎక్కుతానని ఆవేశంగా అంటుండేవాడు. ‘‘పిచ్చిగా వాగకు. నీవొక్కడివి మరణిస్తే - స్వాతంత్య్రం వచ్చేస్తుందా?’’

విసుక్కునేవాడు హుకాం. ‘‘ఎవడికి వాడు ఇలాగే అనుకుంటే వస్తుందా?’’ ఎదురు ప్రశ్నించేవాడు రోషన్. ‘‘చూడు మిత్రమా! జంతువులు పుడతాయి కానీ తమకోసమే చస్తాయి. మనమూ అంతేనా?’’ సూటిగా అడిగేవాడు రోషన్. పెళ్లయి పిల్లలున్న రోషన్ కుటుంబం, ఆస్తిపాస్తులకోసం పడి చచ్చిపోకుండా దేశం కోసం చచ్చిపోవాలనుకోవడం హుకాంని కదిలించింది. ‘నీ కల నెరవేరాలంటే రాంప్రసాద్ బిస్మిల్‌ని కలవమని’ రోషన్‌కి సలహా ఇచ్చాడు హుకాం.

ఎవరీ బిస్మిల్?
5 ఏప్రిల్ 1924.
షాజహాన్ పూర్ ఆర్యసమాజ్.
రాంప్రసాద్ బిస్మిల్‌ని కలవడానికి వెళ్లాడు రోషన్‌సింగ్.

కండలు తిరిగిన దేహంతో మెలితిరిగిన మీసంతో యుద్ధ వీరుడిలా ఉన్నాడు బిస్మిల్. ఆ పక్కనే అష్ఫఖుల్లాఖాన్. ఇద్దరూ ప్రాణస్నేహితులు. అప్పటికి బిస్మిల్ వయసు 27, ఖాన్‌ది ఇరవై నాలుగే! సాధారణంగా అలాంటి నవయువకులు చేసే పని - అందమైన జీవితాన్ని స్వప్నించడం! కాని వారిద్దరూ దుర్మార్గుల చేతినుంచి దేశాన్ని ఎలా రక్షించాలా అని మధన పడుతున్నారు.

బిస్మిల్ చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. కాని ఆర్యసమాజ్‌లో చేరి స్వామి సోమ్‌దేవ్ శిష్యరికంతో గాడిలో పడ్డాడు. ఘోరమైన నియమాలతో బ్రహ్మచర్యం పాటించాడు. ఆవేశాన్ని రగిలించే దేశభక్తి కవితల్ని రచించాడు. అసలు బిస్మల్ అన్నది కలం పేరే! సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు అర్ధంతరంగా ఆపేశారంటూ ఏకంగా గాంధీనే నిలదీసిన ధీరుడు బిస్మిల్. అదీ పాతికేళ్ల వయసులో - బహిరంగంగా 1922 నాటి గయ కాంగ్రెస్ వేదికపై!

ఇక అష్ఫఖుల్లాఖాన్- అందగాడు. ఒడ్డూ పొడుగూ ఉన్నవాడు. బలిష్ఠంగా ఉండేవాడు. నరనరానా దేశభక్తి నింపుకున్నాడు. భారతదేశం బానిస ఖండం కావడం ఖాన్‌ని కలచి వేసింది. స్వరాజ్యం కోసం తానూ సమిధనవ్వాలనుకున్నాడు. బిస్మిల్‌తో స్నేహం చేస్తేనే ఇది సాకారమవుతుందని గ్రహించాడు. కానీ హైందవాన్ని బోధించే ఆర్యసమాజ సభ్యుడు... వేద సంస్కృతిని నిష్ఠతో పాటించే బ్రాహ్మణుడైన బిస్మిల్ తనను చేరదీస్తాడా అని తొలుత సందేహించాడు.

అది భ్రమ అని తర్వాత గ్రహించాడు. వారిద్దరిదీ ఎంత గాఢస్నేహమంటే- ఓసారి ఖాన్‌కి ఒళ్లు తెలీనంత జ్వరమొచ్చింది. రాత్రిళ్లు ‘‘రాం రాం’’ అంటూ పలవరించేవాడు. హిందువుల దైవాన్ని తమ బేటా కలవరించడంతో ఖాన్ తల్లిదండ్రులు పరేషానైపోయారు. కాని తర్వాత తెలిసింది అది ప్రాణమిత్రుడి పేరని!

అలాంటి ఆ ఇద్దరినీ కలిశాడు ఠాకూర్ రోషన్‌సింగ్.
‘‘ఏం కావాలి?’’ అడిగాడు బిస్మిల్.
‘‘భరతమాత కళ్లల్లో ఆనందం’’ అన్నాడు రోషన్.
‘‘ఏమిస్తావ్’’అడిగాడు అష్ఫఖుల్లాఖాన్.

‘‘నా రక్తాన్ని... ప్రాణాన్ని...’’ కసిగా పిడికిలిని ఛాతీపై గట్టిగా కొట్టుకుంటూ చెప్పాడు రోషన్.
అంతే! బలమైన కె రటం కొండను తాకినట్లు- ఒకేసారి రోషన్‌ని కౌగిలించుకున్నారు ఆ ఇద్దరూ!
కాని అప్పటికి ఆ ముగ్గురికీ తెలీదు- షాజహాన్‌పూర్‌లోనే 8 ఏళ్ల వ్యవధిలో పుట్టిన ఆ ముగ్గురూ సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఒకేరోజున ఒకేక్షణాన- వేర్వేరు జైళ్లల్లో- ఉరితీయబడతారని! తెలిసినా - వారు అలాగే తెగించి ఉండేవారు. ఎందుకంటే- వారు నేటికాలపు దొంగదేశభక్తులు కారు.
సంఘటిత శక్తిగా...

అక్టోబర్ 1924.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్.
స్వదేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే యువకులంతా సమావేశమయ్యారు. దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ బలిపీఠం ఎక్కడానికి తెగ ముచ్చటపడిపోతున్న యోధులు వారు. అలాంటి ఆ ఉడుకు రక్తధారల్ని సంఘటితం చేసి ‘హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’(హెచ్‌ఆర్‌ఏ) ని స్థాపించారు రాంప్రసాద్ బిస్మిల్, సచిన్ సన్యాల్, చంద్రశేఖర్ ఆజాద్. పూర్తి భారతీయ విప్లవకారులతో ఏర్పడిన తొలి సామ్యవాద సమాజమది. రోషన్‌సింగ్, అష్ఫఖుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అందులో సభ్యులయ్యారు.

బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్షదాడులకు దిగడం, సైనిక కుట్రలకు పాల్పడటం, విప్లవ సాహిత్య ప్రచారం, ఆయుధాల్ని, మందుగుండు సామగ్రిని సమకూర్చుకునేందుకు సర్కారు ఆయుధాగారాలపై, పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం... మరి ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి కదా... కాబట్టి బ్రిటిష్ బ్యాంకుల్ని, సంపన్నుల్ని, ప్రభుత్వ ఖజానాని లూఠీచేసి నిధుల్ని సమీకరించడం- ఇవీ హెచ్‌ఆర్‌ఏ లక్ష్యాలు.
అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిపోయారు బిస్మిల్ తదితరులు.
రైలుదోపిడీ!
9 ఆగస్టు 1925. రాత్రి ఏడయింది.

నవంబర్ 8 డౌన్ పేరుగల రైలు షాజన్‌పూర్ నుంచి లక్నోకి బయలుదేరింది. ఇంజిన్ వెనుక బోగీలో గార్డ్ ఉన్నాడు. ఆ వెనుక కళ్లు జిగేల్‌మనే నోట్ల కట్టలున్నాయి. ప్రజల్ని పీడించి పన్నుల రూపంలో వసూలు చేసిన సర్కారు సొమ్మది. పోలీసు పహారాలో ఉన్న ఆ డబ్బు మూటలకై మాటు వేసింది బిస్మిల్ సేన. ఏమీ ఎరుగని ప్రయాణికుల్లా రెలైక్కేశారు విప్లవకారులు.

రైలు కాకోరి స్టేషన్‌కి చేరింది. అంతే... ఒక్కసారిగా చెయిన్ లాగారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, కేశవ చక్రవర్తి తదితర వీరులు పోలీసుల్ని చుట్టుముట్టారు. జర్మనీలో తయారైన మాసర్ సి 96 ఆటోమాటిక్ పిస్టళ్లతో దాడి చేశారు. డబ్బుని కాజేసి క్షణంలో చీకట్లో కలిసిపోయారు.

ఇది చిన్న ఘటనే. కాని బ్రిటిష్‌వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దీన్ని ఉపేక్షిస్తే తెల్లారేసరికి ఇది వైరస్‌లా దేశమంతా పాకుతుందని తెల్లవారికి అర్థమైపోయింది. ఈ దోపిడీలో పాల్గొన్నది 10 మందే కాని సర్కారు ఏకంగా 40 మందిపై కేసు పెట్టింది. రెండునెలలు తిరక్కుండా దాదాపు అందర్నీ అరెస్టు చేసింది. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్‌ని మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.

వాస్తవానికి కేశవ్ చక్రవర్తిని కూడా పోలీసులు చేజిక్కించుకోలేకపోయారు. కాకపోతే- రోషన్‌సింగ్ అచ్చం కేశవ్ చక్రవర్తిలాగానే ఉండేవాడు. పైగా ఇద్దరి వయసూ దాదాపు ఒకటే. దాంతో రోషన్‌సింగ్‌ను కుట్రలో ఇరికించారు ఆంగ్లేయులు. వాస్తవానికి కాకోరి రైలు దోపిడీలో రోషన్ నేరుగా పాల్గొనలేదు. అయినా తనపై దొంగకేసు బనాయించినందుకు బాధపడలేదు. పైగా సంబరపడ్డాడు- మాతృదేశ రుణం తీర్చుకునే అవకాశం చిక్కినందుకు!

అలా అప్పుడు త్రుటిలో బయటపడ్డ కేశవ్ చక్రవర్తి అసలు పేరు- కేశవ్ బలిరాం హెగ్డేవార్. 1925లో నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ని స్థాపించింది ఈయనే! రోషన్‌సింగ్ బలిదానం పుణ్యంగా - జాతీయ స్పృహకు అంకితమైన ఓ సంస్థ ఆవిర్భవించిందన్నమాట!
కాకోరి కుట్రకేసు విచారణ ఏడాదిన్నర సాగింది. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రోషన్‌సింగ్, రాజేంద్రలాహిరి- ఈ నలుగురికీ మరణశిక్ష విధిస్తూ లక్నో కోర్టు తీర్పునిచ్చింది.

దీనిని వ్యతిరేకిస్తూ ఆసేతు హిమాచలం నిరసనలు వెల్లువెత్తాయి. మున్షీ ప్రేమ్‌చంద్‌లాంటి రచయితలు, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహ్మదాలీజిన్నా, మదన్ మోహన్ మాలవీయ లాంటి జాతీయ నాయకులు శిక్షను కనీసం యావజ్జీవంగానైనా మార్చమని బ్రిటిష్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయినా శంఖమే అయింది. ఉరిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిస్మిల్‌ను గోరఖ్‌పూర్ జైలుకి, రోషన్‌సింగ్‌ని అలహాబాద్ జైలుకి, అష్ఫఖుల్లాఖాన్‌ని ఫజియాబాద్ జైలుకి, రాజేంద్ర లాహిరిని గోండా జైలుకి తరలించారు.

మరణమంటే భయపడని వారుంటారా? ఉంటారు... ఇదిగో ఈ నలుగురే! మరో ఇరవై రోజుల్లో తమకు ఉరి ఖాయమని తెలుసు. అయినా వారిలో కించిత్ బాధ లేదు. దేశం కోసం, తరతరాల భారతీయుల స్వేచ్ఛకోసం ... బలిపీఠం ఎక్కుతుంటే శోకం దేనికి? ఇదీ వారి అంతరంగం. మరణానికి ముందు హుకాంకి రాసిన ఉత్తరంలో ‘‘నేను ఉదాత్త ఆశయం కోసం మరణిస్తున్నాను. వద్దు... కన్నీరు కార్చొద్దు’’ అని అంటాడు రోషన్ సింగ్.

రాజేంద్ర లాహిరి చివరి రోజుల్లో ఉపనిషత్తుల్నీ వివేకానంద సూక్తుల్ని చదువుకుంటూ ఉత్సాహంగా గడిపేవాడు. బిస్మిల్ జైల్లోనే ఉండి తన ఆత్మ కథ ‘సర్ఫరోషీ కీ తమన్నా’ (దేశభక్తుడి కోరిక) రచించాడు. ఉరికి ముందురోజు ఉరకలేసే ఉత్సాహంతో తల్లితో సంభాషించాడు. ఇక అష్ఫఖుల్లాఖాన్ అయితే జైల్లో ఖుషీగా గడిపాడు. చావుకి ముందురోజు ఖాన్‌ని భగత్‌సింగ్ కలిసినప్పుడు ‘రేపే నా పెళ్లి’ అంటూ తుళ్లుతూ మాట్లాడాడు.

17 డిసెంబర్ 1927న రాజేంద్ర లాహిరినీ, 19న మిగిలిన ముగ్గురినీ ఉరితీశారు. భగవద్గీత వల్లెవేస్తూ బిస్మిల్, ఓంకార ప్రార్థన చేస్తూ రోషన్, అల్లాను ప్రార్థిస్తూ ఖాన్ బలిపీఠమెక్కారు. వందేమాతరం అంటూ బిగ్గరగా అరుస్తూ ఉరితాడుని ముద్దుపెట్టుకుని తుదిశ్వాస విడిచారంటే ... తల్లి భారతి అంటే వారికెంత పిచ్చి ప్రేమో తెలుస్తుంది.
అందులో వందోవంతు కూడా మనకు లేకపోతే - వారి త్యాగాలు వృథా! మన బతుకులు వృథాకు మించిన వృథా!!

సరిగ్గా నేటికి 120 ఏళ్ల కిందట- 1892 జనవరి 22న - ఠాకూర్ రోషన్‌సింగ్; ఆపై అయిదేళ్లకు 1897 జూన్ 11న రాంప్రసాద్ బిస్మిల్, ఆపై మూడేళ్లకి 1900 అక్టోబర్ 22న అష్ఫఖుల్లాఖాన్ జన్మించారు. ఈ ముగ్గురూ పుట్టింది ఒకేచోట... మరణించిందీ ఒకేరోజున! వీరికి రాజకీయ లౌక్యాలు, సైద్ధాంతిక చర్చలూ తెలీవు. తెలిసిందల్లా ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టడమే!

ఆకెళ్ల రాఘవేంద్ర

17, జులై 2011, ఆదివారం

జగమెరుగని ఝాన్సీరాణి

జగమెరుగని ఝాన్సీరాణి

కొందరు నేతలు ఆకాశంలో ఉల్కల్లా కాంతివంతంగా ప్రకాశించి నేల రాలిపోతారు. వీరు జీవించేది అతి కొద్ది కాలమే అయినా ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోతారు. చరిత్ర కూడా వీరికి ఒక సుస్థిర స్థానం కల్పిస్తుంది. ఇలాంటి వారిలో ఝాన్సీ లక్ష్మిబాయి ఒకరు. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లక్ష్మీబాయి బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడటం విధి వైచిత్రి అనే చెప్పాలి. 14 ఏళ్లకు పెళ్లి.. 18 ఏళ్లు నిండకుండానే భర్త మరణం.. మధ్యలో అస్వతంత్ర జీవనం.

ఆ తర్వాత బ్రిటిష్‌వారిపై పోరాడుతూ వీరమరణం పొం దటం.. ఇవన్నీ 23 ఏళ్ల జీవితం లోనే ముగిసిపోయాయి. 1857 నాటి పరిస్థితుల గురించి.. లక్ష్మీబాయి జీవితం గురించి విష్ణుభట్ మరాఠీలో రాసిన పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇటీవల ఇంగ్లీషులోకి అనువదించారు. దాని నుంచి- లక్ష్మిబాయి జీవితంలోని ముఖ్య మలుపులు.. ఘట్టాలు మీ కోసం అందిస్తున్నాం..

"ఝాన్సీకి వెళ్లాలనుకున్న తర్వాత నాకు రాము మామ చెప్పిన అనేక విషయాలు గుర్తుకువచ్చాయి. రాము మామ చెప్పిన సమాచారం ప్రకారం- ఝాన్సీ ఉత్తర భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి. జనాభా పదిహేను లక్షల దాకా ఉంటారు. దేశంలోని అతి పటిష్ఠమైన కోటల్లో ఝాన్సీ కోట కూడా ఒకటి. పూణేలో పేష్వాలు బలహీనపడిన తర్వాత గ్వాలియర్ మాదిరిగానే ఝాన్సీ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఝాన్సీని పాలించిన రాజులలో చాలామందికి పిల్లలు లేరు. హిందూ సమాజంలోని ఉన్నత కులాల వారి మాదిరిగానే వారు కూడా మగపిల్లలను దత్తత తీసుకొనేవారు. మహారాజు మరణించిన వెంటనే అతని దత్తత కుమారుడు పరిపాలన చేపట్టేవాడు.

ఝాన్సీ మహారాజు గంగాధరరావు రెండు సార్లు పెళ్లి చేసుకున్నాపిల్లలు పుట్టలేదు. మగపిల్లవాడిని దత్తత తీసుకోవాలనే గంగాధరరావు అభిమతానికి బ్రిటిష్ పాలకులు అడ్డుపుల్ల వేశారు. అతను పెట్టుకున్న దరఖాస్తులకు కలకత్తాలోని గవర్నర్ జనరల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పిల్లలు లేరనే బాధతో గంగాధరరావు మరణించాడు. అతని భార్య లక్ష్మీ బాయి ఒక పన్నెండేళ్ల కుర్రాడిని దత్తత తీసుకుంది. బ్రిటిష్ పాలకులు ఆ దత్తతను కూడా చట్టబద్ధం చేయటానికి అంగీకరించలేదు. ఈ లోపులో సిపాయి తిరుగుబాటు జరిగింది.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీ బాయే పగ్గాలు చేపట్టింది...అసలేం జరిగిందంటే..''

పెరిగింది ఇలా..
రాము మామకు లక్ష్మీబాయి వాళ్ల నాన్న రాజశ్రీ మోరోపంత్ తాంబే బాగా తెలుసు. బిత్‌పూర్‌లో ఒక పెద్ద యాగశాల ఉంది. పిల్లలకు వేదం కూడా నేర్పుతూ ఉంటారు. రాము మామ ఈ యాగశాలకు అధిపతిగా ఉండేవాడు. ఆయన వచ్చేసిన తర్వాత మోరోపంత్ అధిపతి అయ్యాడు. ఆయన భార్య చనిపోయింది. దీనితో ఒకే ఒక బిడ్డ అయిన ఛాబిలీని అల్లారుముద్దుగా పెంచుతూ ఉండేవాడు. ఛాబిలీ చూడటానికి చాలా అందంగా ఉండేది.

తల్లి బతికి ఉంటే- ఛాబిలీని అసలు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదేమో! ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల - ఛాబిలీ కూడా తండ్రిలాగానే ఉదయాన్నే యాగశాలకు వచ్చేసేది. అక్కడే ఆడుకునేది. అక్కడే తినేది. మధ్యాహ్నం నిద్ర వస్తే అక్కడే పడుకొనేది. చుట్టూ ఉన్నది మగపిల్లలే కావటంతో, వారితోనే ఆడేది. చదవటం, రాయటంతో పాటు ఆమె విలువిద్య, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చుకుంది. అలా చూస్తుండగానే- ఛాబిలీకి పన్నెండేళ్లు వచ్చేశాయి. మోరోపంత్ ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఛాబిలీ జాతకం ఎవరికీ నప్పేది కాదు. దీనితో అనేక మంది వెనక్కి వెళ్లిపోయారు. అంతే కాకుండా- బాగా చదువుకున్న తన కూతురును పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయటం అతనికి ఇష్టం లేదు.
సరిగ్గా అదే సమయంలో గంగాధర రావు భార్య చనిపోయింది. అతను మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాని అతనికి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొందరి జాతకం అతనికి నప్పలేదు. మరి కొందరు అతని గురించి వచ్చిన వదంతులకు భయపడ్డారు. ఈ వదంతుల ప్రకారం-

కొన్ని సార్లు గంగాధరరావు తన దర్బారు నుంచి నేరుగా రాణివాసానికి వెళ్తాడు. అక్కడ మగ దుస్తులను వదిలేసి, పట్టుచీర, పావడా కట్టుకుంటాడు. చేతికి గాజులు వేసుకుంటాడు. ముక్కుకు పుడక పెట్టుకుంటాడు. కాళ్లకు పట్టీలు కూడా పెట్టుకుంటాడు. అలాంటి సమయంలో కేవలం ఆడవాళ్లతోనే మాట్లాడతాడు. మగవారితో మాట్లాడడు. అంతే కాకుండా నెలలో నాలుగు రోజులు మైల ఉందని- విడిగా ఒక గదిలోకి వెళ్లిపోతాడు. (మహిళలకు రుతుస్రావం అయినట్లు). ఆ సమయంలో దర్బారుకు రాడు. నాలుగవ రోజు స్నానం చేసి..పూజలు చేసిన తర్వాతే తిరిగి దర్బారుకు వస్తాడు. ఈ సమయంలో గోర్డన్ సాహెబ్ అనే అధికారి బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉండేవాడు. గంగాధరరావు గురించి వచ్చిన వదంతులు ఆయనకు కూడా చేరాయి. గోర్డన్ సాహెబ్ ఒకసారి గంగాధరరావును కలిసాడు. "నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఉంది. మీరు మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.

మీ తాతలు, తండ్రులు చాలా గొప్పవారు. అలాంటి వంశంలో పుట్టిన మీరు సంప్రదాయాలన్నింటిని వదిలేసి- ఆడవాళ్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? నెలకు నాలుగు రోజులు మైలను ఎందుకు పాటిస్తున్నారు. మీకు ఒక అమ్మాయిగా మసలటం ఇష్టమయి ఇలాంటి పని చేస్తున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా?'' అని అడిగాడు. "నేనో చిన్న రాజ్యానికి రాజును కావచ్చు. కాని పెద్ద పెద్ద రాజ్యాలను పాలించే నా సోదర రాజులు సైతం ఏడు సముద్రాల అవతల నుంచి వచ్చిన మ్లేచ్ఛుల నియంత్రణలోకి వెళ్లిపోయారు. వారి రాజ్యంపైన వారికి అధికారం లేదు. ప్రజల దగ్గర నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ణయించే అధికారం లేదు. మేమందరం స్వేచ్ఛను పోగొట్టుకొన్నాం. నిస్సహాయులుగా జీవిస్తున్నాం.

ఒక మహిళ ఎంత భయం భయంగా బతుకుతుందో మేము కూడా అదే విధంగా జీవిస్తున్నాం. అందుకే నేను కూడా ఒక మహిళలా గాజులు వేసుకుంటున్నా..నాలుగు రోజులు విడిగా కూర్చుంటున్నా..'' అని సమాధానమిచ్చాడు. మోరోపంత్ ఈ విషయాలన్నీ ఆ నోట, ఈ నోట విన్నాడు. గంగాధరరావు తొలి భార్యకు ఒక బిడ్డ పుట్టి చిన్నప్పుడే చనిపోయాడు. అందువల్ల గంగాధరరావు మగవాడు కాకపోయే అవకాశం లేదని మోరోపంత్ భావించాడు. గంగాధరరావు ప్రవర్తన ఎలా ఉన్నా రాజ్యపాలన మాత్రం బావుండేది. దీనితో గంగాధరరావుకు ఛాబిలీని ఇచ్చి పెళ్లి చేయటానికి మోరోపంత్‌కు ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. గంగాధరరావుకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారితో ఈ విషయం చెప్పాడు.

అనుమానపు మొగుడు..
మోరోపంత్ అనే పురోహితుడి కుమార్తె చాలా అందంగా ఉంటుందని..ఆమెకు పెళ్లి చేయటానికి సంబంధాలు వెతుకుతున్నారని కొందరు మధ్యవర్తులు గంగాధరరావుకు చెప్పారు. వెంటనే గంగాధరరావు తన మనుషులను మోరోపంత్ దగ్గరకు పంపాడు. తనకు కన్యాశుల్కం అక్కరలేదని.. అయితే పెళ్లి ఖర్చులన్నీ గంగాధరరావే పెట్టుకోవాలని మోరోపంత్ షరతు విధించాడు. దీనికి గంగాధరరావు అంగీకరించాడు. గంగాధరరావు, ఛాబిలీల పెళ్లి ఝాన్సీలో ఘనంగా జరిగింది. అప్పుడే ఛాబిలీలి పేరు లక్ష్మిబాయిగా మారింది.

లక్ష్మిబాయి సంసారం మొదటి నుంచి అంత ఆనందంగా గడవలేదు. గంగాధరరావుకు తన కన్నా చాలా చిన్నదైన లక్ష్మిబాయిపై అనుమానం ఎక్కువ. దీనితో ఆమెను రాణివాసం నుంచి కూడా బయటకు రానిచ్చేవాడు కాడు. పడకగదిలోనే ఉంచి తాళం పెట్టేవాడు. మగవాళ్లు ఎవరూ ఆమె మహలు వైపు కూడా చూడటానికి వీలులేకుండా కొందరు మహిళా సైనికులను కాపలా పెట్టాడు. ఇంత కట్టుదిట్టం చేయటం వల్ల లక్ష్మిబాయి మనస్తత్వంలో అనేక మార్పులు వచ్చాయి. అమ్మాయిగా ఉండటం కన్నా అబ్బాయిగా పుడితేనే మేలని భావించేది. చిన్నప్పుడు స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగిన రోజులు ఆమెకు గుర్తుకువస్తూ ఉండేవి. దీనితో ఆమె కొన్ని సార్లు మగవాళ్ల బట్టలు వేసుకుంటూ ఉండేది. పెళ్లి అయిన కొద్ది రోజులకే గంగాధరరావు అనారోగ్యం పాలయ్యాడు. మరణశయ్యపై నుంచి గోర్డన్ సాహెబ్‌కు కబురుపెట్టాడు. "నా భార్య ఇంకా యుక్తవయస్సులో ఉంది. పిల్లలు లేరు.

అందువల్ల మా బంధువుల పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవటానికి అంగీకరించండి..'' అని అడిగాడు. గంగాధరరావు అంటే గోర్డన్ సాహెబ్‌కు కొంత సానుభూతి ఉంది. దీనితో అతను కలకత్తాలో ఉన్న తనపై అధికారులకు విషయాన్ని వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. కానీ కలకత్తాలో అధికారుల వ్యూహం మరోలా ఉంది. "గంగాధరరావుకు పిల్లలు లేరు. అందువల్ల ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాధ్యతలు చేపట్టండి'' అని కలకత్తా నుంచి సమాధానమొచ్చింది. ఇక చేసేదేమీ లేక- గోర్డన్ సాహెబ్ ఝాన్సీ సామ్రాజ్యాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. ఇంతలో గంగాధరరావు మరణించాడు. గోర్డన్ సాహెబ్ మాత్రం లక్ష్మిబాయి పట్ల సానుభూతితోనే వ్యవహరించాడు. కోటలో కొద్ది భాగాన్ని ఆమెకు ఇచ్చాడు. గంగాధరరావు వదిలి వెళ్లిన సంపదను కూడా ఆమెకే వదిలేసాడు.

అన్నీ అడ్డంకులే..
భర్త చనిపోయిన కొద్ది కాలానికి లక్ష్మిబాయి-తాను ఒక బ్రాహ్మణ వితంతువులా జీవితాన్ని సాగించాలనుకుంది. గుండు చేయించుకొని వితంతువుగా మారటానికి కాశీ, ప్రయాగ పుణ్యక్షేత్రాలకు వెళ్లటానికి అనుమతి ఇవ్వమని గోర్డన్ సాహెబ్‌కు అర్జీ పెట్టుకుంది. దీనిని కూడా బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. స్వతహాగా లక్ష్మిబాయి చాలా తెలివైంది. బ్రిటిష్‌వారి నుంచి తనకు వారసత్వంగా వచ్చిన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలంటే మగపిల్లవాడిని దత్తత చేసుకోవటం తప్పనిసరని గ్రహించింది. ఒక పిల్లవాడిని దత్తత తీసుకొనే విషయమై బ్రిటిష్ అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. 1857 మే నాటికి దేశ పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయి.

బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేస్తారనే వార్తలు దావానలంలా వ్యాపించటం మొదలుపెట్టాయి. దీనితో బ్రిటిష్ పాలకులు- సంస్థానాధీశులపై పట్టుబిగించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లక్ష్మిబాయి పెట్టుకున్న దత్తత అర్జీలకు సమాధానాలు ఇవ్వలేదు. ఆమెకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా నిలుపుచేశారు. ఈ పరిస్థితుల్లో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. కొందరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. దీనితో ఝాన్సీ కంటోన్మెంట్‌లో నివసించే అనేక మంది బ్రిటిష్ అధికారులకు వణుకుపుట్టింది. ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని బ్రిటిష్ అధికారులు గమనించారు. తమకు సాయం చేయమని లక్ష్మిబాయిని కోరారు.

జూన్ 8, 1857..
ఝాన్సీ కంటోన్మెంట్ అంతా చాలా ఉద్రిక్తంగా ఉంది. బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. అప్పటికే మీరట్‌కు చెందిన సైనికులు క్రమంగా అన్ని ప్రాంతాలకు వస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల అభిమానాన్ని పొందటానికి బ్రిటిష్ వారికున్న ఏకైక మార్గం సంస్థానాధీశులను మంచి చేసుకోవటం. ఝాన్సీ సంస్థానంలో ఉన్న ప్రాంతాలన్నిటి పరిపాలనను లక్ష్మిబాయికి అప్పచెబుతున్నామని.. ఈ ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది వచ్చే 25 లక్షల రూపాయల ఆదాయాన్ని ఇకనుంచి ఆమే అనుభవించవచ్చంటూ గోర్డన్ సాహెబ్ లక్ష్మిబాయికి ఒక వర్తమానాన్ని పంపాడు.

రాజ్యంలో ప్రశాంతత ఏర్పడేవరకూ ఆమే సర్వాధికారిణి అని..అయితే బ్రిటిష్‌వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఆమె గోర్డన్ సాహెబ్, ఇతర బ్రిటిష్ అధికారులకు రక్షణ కల్పించాలనే షరతు కూడా ఆ వర్తమానంలో ఉన్నాయి. దాన్ని చదివిన లక్ష్మిబాయికి విపరీతమైన కోపం వచ్చింది. "నన్ను ఒక రాణిగానే మీరు గుర్తించలేదు. కలకత్తాలో జరిగిన రాజ్యాధీశుల సమావేశానికి పిలవలేదు. నా భర్త చివరి కోరికగా- ఒక బిడ్డను దత్తత తీసుకుంటానంటే అంగీకరించలేదు. నేను కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు వెళ్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టి, ఇవన్నీ ఇస్తున్నారా? మిమల్ని దయతో మా దగ్గర ఉంచుకోవాలా? బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన సైనికులు దీనికి అంగీకరిస్తారా? మీరు మా దగ్గర రక్షణ పొందుతున్నారని తెలిసిన తర్వాత వాళ్లు మమ్మల్ని వదులుతారా? '' అని అవేశంగా మధ్యవర్తిని ప్రశ్నించింది. బ్రిటిష్ వారి ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది..

అర్థరాత్రి అయింది. అందరూ ఉద్విగ్నంగా ఉన్నారు. చీకటి మాటున గోర్డన్ సాహెబ్ ఒంటరిగా రాణిమహల్‌కు వచ్చాడు. "నా భార్యకు ఏడోనెల. బయట పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. బ్రిటిష్ ప్రజలు కనిపిస్తే చంపేస్తున్నారు. కంటోన్మెంట్‌లో సిపాయిలు రేపు తిరుగుబాటు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మీరు రక్షణ ఇవ్వకపోతే- మా ప్రాణాలకు ముప్పు తప్పదు. నా భార్యను, పుట్టబోయే బిడ్డను కాపాడండి..'' అని లక్ష్మిబాయిని వేడుకున్నాడు. లక్ష్మిబాయి మనసు కరిగింది. మహిళలకు, పిల్లలకు రక్షణ ఇవ్వటానికి అంగీకరించింది. మర్నాడు ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ అధికారుల భార్యలు, పిల్లలు రాణివాసానికి రహస్యంగా వచ్చేశారు.

జూన్ 9, 1857..
ఉదయం పది అయింది. ఒక్క సారి పెద్ద అల వచ్చినట్లు.. సైనికులందరూ రోడ్ల మీదకు వచ్చారు. సైనిక క్యాంపును కాపలా కాస్తున్న బ్రిటిష్ అధికారులను విచక్షణారహితంగా చంపేశారు. క్యాంపుకు నిప్పు అంటించారు. ఆ తర్వాత సైనికులందరూ రాణివాసం దగ్గరకు వచ్చారు. "మీరే మాకు సర్వ సైన్యా«ధ్యక్షురాలు. మీ ఆదేశాలు మేం పాటిస్తాం..'' అని పెద్దగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. సైనిక దుస్తుల్లో రాణి లక్ష్మిబాయి వారి ముందుకు వచ్చింది. "పెద్ద యుద్ధం ఇంకా ముందు ఉంది. మనందరం కలిసికట్టుగా పోరాడితేనే శత్రువును తరిమి తరిమి కొట్టగలుగుతాం..'' అంటూ ప్రసంగించింది లక్ష్మీబాయి. ఝాన్సీ ప్రాంతానికి తాను రాణిగా పాలనాబాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది. ఆయుధాల కర్మాగాలన్నింటిలోను ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సైనికులకు బ్రిటిష్‌వారు తగ్గించిన వేతనాలను తిరిగి పెంచుతున్నట్లు ప్రకటించింది.

పరిపాలన షురూ..
రాణి లక్ష్మిబాయి చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేది. వ్యాయామం పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. పెళ్లి అయిన తర్వాత భర్త పెట్టిన నిబంధనల వల్ల వ్యాయామం మానేసినా భర్త చనిపోయిన తర్వాత మళ్లీ వ్యాయామం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి కొద్ది సేపు కుస్తీ పట్టేది. ఆ తర్వాత బరువులు ఎత్తేది. ఈ రెండూ పూర్తయిన తర్వాత గుర్రపు స్వారీ చేసేది. గుర్రపు స్వారీలో అనేక రకాల విన్యాసాలు ప్రదర్శించేది. వేగంగా వెళ్తున్న గుర్రం మీద నుంచి గోడల మీదకు దూకేది. అక్కడ నుంచి కందకం సైతం దాటి బయటకు దూకేది. ఒక్కోసారి సుగంధద్రవ్యాలతో రెండు మూడు గంటలు స్నానం చేసేది.

ఆమె స్నానం కోసం పదిహేను నుంచి ఇరవై పెద్ద పెద్ద గుండిగలతో నీళ్లను కాచేవారు. స్నానం తర్వాత తెల్లని చందేరీ పట్టు చీరను కట్టుకొనేది. కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు బ్రిటిష్ పాలకులు అంగీకరించకపోవటంతో- లక్ష్మిబాయి తన శిరోజాలు తీయించుకోలేదు. శాస్త్ర ప్రకారం- శిరోజాలు తీయించుకోని విధవరాలు - కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే తప్ప భగవంతుడిని పూజించకూడదు. అందువల్ల ప్రతి రోజు లక్ష్మిబాయి తులసి మొక్కకు పూజ చేసేది. ఆ తర్వాత శివప్రార్థనకు ఉపక్రమించేది. మధ్యాహ్న భోజనం తర్వాత ఆమె కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనేది. కొన్నిసార్లు ఆమె దర్బారుకు మగదుస్తులలో వచ్చేది. పంచె, పైన కోటు, కుచ్చుతలపాగా పెట్టుకొనేది. నడుముకు బంగారు ఎంబ్రైడరీ చేసిన గుడ్డ కట్టుకొనేది. దానికే కత్తి వేళ్లాడుతూ ఉండేది. కొన్ని సార్లు ఆమె ఆడవేషంలో కూడా దర్భారుకు వచ్చేది. భర్త మరణం తర్వాత లక్ష్మిబాయి ముక్కుపుడక పెట్టుకోవటం మానేసింది.

మట్టి గాజులు వేసుకోవటం మానేసి- బంగారు గాజులు మాత్రమే ధరించేది. మెడచుట్టూ ఒకే వరస ఉన్న ముత్యాలు, చేతికి వజ్రాల ఉంగరం పెట్టుకొనేది. నాకు తెలుసున్నంత వరకూ ఆమె ఎప్పుడూ ఇతర ఆభరణాలు ఏమీ ధరించలేదు. ఆమె జుట్టును గుండ్రంగా చుట్టుకొనేది. కొన్ని సార్లు జడ కూడా వేసుకొనేది. ఆమె దర్బార్ హాలులో కూర్చున్నప్పుడు తెల్ల శాలువాను నెత్తి మీద నుంచి కప్పుకొనేది. రాజ ప్రధాని లక్ష్మణ రావు ఆమె ముందు నిలబడి ఉండేవాడు. ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది ఆమె జారీ చేసిన ఆదేశాలను నమోదు చేస్తూ ఉండేవారు. లక్ష్మిబాయి ఏ వివాదాన్నయినా చాలా సులువుగా పరిష్కరించేది. కొన్నిసార్లు నేరస్తులను ఆమే స్వయంగా కర్రతో కొట్టేది.

చూడటమే వేడుక..
లక్ష్మిబాయి గుర్రపు స్వారీని గాని, రథయాత్రను గాని చూడడం ఒక వేడుక. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉండేది. ఆమె ర«థాన్ని రెండు వైపులా బంగారు జరీతో ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ కర్టెన్లతో మూసేసేవారు. మెరిసిపోయే ముత్యాల సెట్‌తో పాటు అందమైన పట్టుచీర కట్టుకొనేది. మగబట్టలు కట్టుకున్నప్పుడు తలపాగ తప్పనిసరిగా ఉండేది. ఆమె రథంతో పాటు నలుగురు అందమైన అమ్మాయిలు పక్కన పరిగెడుతూ ఉండేవారు. వీరికి చిన్నతనం నుంచి రాణి పక్కన రథంతో పాటు పరిగెత్తటాన్ని శిక్షణ ఇచ్చేవారు. సాధారణంగా వీరు దక్షిణభారతదేశానికి చెందినవారై ఉండేవారు.

అందమైన ఈ అమ్మాయిలు ఒక చేతిలో బంగారపు కర్రలు, మరో చేతిలో బంగారపు విసనకర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉంటే- వారిని చూడటానికి వందలమంది గుమిగూడుతూ ఉండేవారు. రథం ముందు కొందరు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉండేవారు. వెనక దాదాపు రెండు వందల మంది సైనికులు నడుస్తూ ఉండేవారు. వీరందరితో పాటు - రథం వెనక ప్రధానితో సహా అనేక మంది ముఖ్యాధికారులు కూడా ఉండేవారు. లక్ష్మిబాయి గుర్రం స్వారీ చేసేటపుడు ఇంత ఆర్భాటం ఉండేది కాదు. కొద్దిమంది అధికారులు, సైనికులు మాత్రమే ఆమె వెంట ఉండేవారు. రాత్రి అయితే ఆమెకు దారి చూపించటానికి కాగడాలను మోసేవారు కూడా ఉండేవారు. కాని చాలాసార్లు లక్ష్మిబాయి వారిని దాటి చీకట్లోనే కోటలోకి వెళ్లిపోయేది.

వందేళ్లకు ఇంగ్లీషులోకి...
విష్ణుభట్ గాడ్సే అనే చిత్‌పవన్ బ్రాహ్మణుడు బొంబాయి సమీపంలోని వార్సాయ్‌లో నివసిస్తూ ఉండేవాడు. కడు పేదవాడు. ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద యాగం జరుగుతోందని తెలిసి కొంతమందితో కలిసి అక్కడికి బయలుదేరి వెళతాడు. ఇంతలో సిపాయి తిరుగుబాటు మొదలవుతుంది. విష్ణుభట్ బృందం ఆ జ్వాలల్లో చిక్కుకుపోతుంది. ఒక పక్క బ్రిటిష్ సేనలు మరోపక్క భారతీయ సైనికులు వాళ్లందరిని తప్పించుకుంటూ ఆయన మో నుంచి ఢిల్లీ దాకా అనేక ప్రాంతాలు తిరిగాడు. 1857-58 మధ్య కొన్ని నెలల పాటు ఝాన్సీ కోటలో పురోహితుడిగా ఉన్నాడు.

లక్ష్మీబాయిని బ్రిటిష్ వాళ్లు చంపేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా బతుకుతెరువు కోసం ప్రయత్నించి చివరికి నిరాశతో స్వగ్రామం చేరుకున్నాడు. తాను ఉత్తరభారత దేశంలో చూసిన సంఘటనలన్నిటితోను మరాఠీలో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మజాప్రవాస్: 1857 చా బండాసి హకీకత్ (నా ప్రయాణాలు: 1857 తిరుగుబాటు కథ). ఈ పుస్తకాన్ని ఆయన దాదాపు 30 ఏళ్ల తర్వాత రాస్తే అది అచ్చయి బయటికి వచ్చింది. 1907లో దానిలో ఝాన్సీ సంస్థానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు- విష్ణుభట్ స్వయంగా చూసినవి. మరికొన్ని వాళ్లు వీళ్లు చెప్పగా విన్నవి. దాదాపు వందేళ్ల తర్వాత ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇంగ్లీషులోకి అనువదించారు.

అనువాదం : సివిఎల్ఎన్ ప్రసాద్