కధలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కధలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2012, శుక్రవారం

వేప... కరివేప... ఒక కథ

అహంకారం నెత్తికెక్కితే నాలుక చిమచిమమంటుంది. మాటలు జర్రున జారుతాయి. గొప్పకు పోతే తిక్క కుదురుతుంది.
అనగనగా ఒక వేపచెట్టు.
దాని పక్కనే ఒక కరివేపాకు చెట్టు.
రెండూ ఫ్రెండ్సు.
కాని కాలం కలకాలం ఎవర్నీ ఒకలా ఉంచదు.
రాను రాను కరివేపాకుకు అహంకారం పెరిగింది. పొగరు చిటారుకొమ్మకు ఎగబాకింది.
ఒకరోజు అది వేపచెట్టుతో ఇలా అంది- గురువా వేపచెట్టూ. నీకు నా సంగతి తెలుసునా? నేను నీకంటే గొప్ప. ఎలా అంటావేమో.... నా పేరు ముందు కరి ఉంది. కరి అంటే ఏనుగు. జంతువుల్లోకెల్లా ఏనుగు ఎలా గొప్పో అలా చెట్లలోకెల్లా నేనే గొప్ప. వేప కంటే కరివేపాకు గొప్ప. అందుకే నా కోసం అందరూ ఆత్రపడతారు. కూరల్లో వేయడానికి తహతహలాడతారు. నీదగ్గర ఏముంది... మొత్తం చేదు... యాక్ అంది.
ఆ మాటలకు వేప చిన్నబుచ్చుకుంది.
చల్లటి నీడనిచ్చే నన్ను ఇంతలేసి మాట అంటుందా అని వనదేవతను ప్రార్థించింది.
రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. తపస్సు వీడని వేప పట్టుదలను చూసి వనదేవత ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలి నీకు అని వేపను అడిగింది. ‘తల్లీ... నా కంటే తనే గొప్పనని కరివేపాకు అంటోంది. దాని పొగరు అణుచు’ అంది. వనదేవత అందుకు సమ్మతించింది.

‘‘మూడొందల అరవై రోజులూ కరివేపను వాడినా... అన్ని రోజులకూ ప్రారంభదినం లాంటి ఉగాది రోజున అందరూ నీకోసం వెతుక్కుంటారు. నీ ప్రమేయం లేకుండా ఉగాదిని జరుపుకోరు. అంతేకాదు ఇన్నాళ్లూ కూరతోపాటు కరివేపను కూడా తినేవారు. ఇకమీదట కరివేపను వాడినా దాన్ని తీసిపారేస్తారు. ఇక మీదట అది వాడుకుని పారేయడానికి అది ఒక గుర్తుగా మారుతుంది... దాని పొగరు అలా అణుగుతుంది’’ అని వనదేవత మాయమైంది.
అప్పట్నించి కరివేపాకు బతుకు అలా అయ్యింది.
వేప ఇలా వెలుగుతోంది.
 
- కల్పన

19, మార్చి 2012, సోమవారం

తెలివి తక్కువ తోడేలు! (కధ)



ఒక సముద్రతీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది. ఒకరోజు అది మాంసం కోసం అడవిలోకి వెళ్లింది. అక్కడ ఓ తోడేలు ఎదురుపడింది.
‘‘నక్కా నువ్వు ఎక్కడ ఉంటున్నావు?’’ అని అడిగింది తోడేలు.

‘‘నేను ఇక్కడికి దగ్గర్లో ఉన్న సముద్రతీరాన ఉంటున్నాను’’ అని జవాబిచ్చింది నక్క.
‘‘ఏంటీ? సముద్రమా? ఆ మాటే నేనిప్పటిదాకా వినలేదు’’ అని తోడేలు ఆశ్చర్యంగా చూసింది.
‘‘నా ముందంతా నీళ్లే. మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో. నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను’’ అని నక్క తోడేలును తన వెంట సముద్రతీరానికి తీసుకుపోయింది.

అవి రెండూ సముద్ర తీరం చేరాయి. అప్పుడు ఒక అల తీరంకేసి వ స్తోంది. ఆ కెరటాన్ని చూసిన నక్క ‘‘రా, కెరటమా రా, నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. వాడికోసారి కనిపించి మళ్లీ వెనక్కి వె ళ్లిపోవాలి’’ అంది. అల వచ్చి వెళ్లిపోయింది. తోడేలు విస్తుపోయింది.

‘‘కె రటమా... నువ్వు వచ్చిపోతుండు. నేనూ నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం’’ అని నక్క తోడేలుతో మాటల్లో పడింది. అలలు వస్తున్నాయి. పోతున్నాయి.
‘‘నీ అధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది. వెళ్లొచ్చా?’’ అనడిగింది తోడేలు. వెళ్లమంది నక్క.

సముద్రంలోకి అడుగుపెట్టిన తోడేలు కొంచెం దూరం వెళ్లిందో లేదో పెద్ద అలొచ్చింది. ఆ అల తాకిడికి తట్టుకోలేక పల్టీకొట్టింది. దాంతో ఊపిరాడక చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చింది.
నీతి: ఎవరైనా ఏదైనా చెప్పింది వినడం తప్పుకాదు. కానీ ఆ మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ముందు వెనుకలు ఆలోచించడం అవసరం.

యామిజాల జగదీశ్

పేద - గొప్ప(చిట్టి కథ)


అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు. పెద్ద భవనం... బోలెడంత మంది పనివాళ్లు... ఇంటినిండా బంధుమిత్రులతో వైభవంగా జీవించేవాడు.
ఆ భవనానికి కొద్దిదూరంలో ఓ పేదవాడు. చిన్న పూరిగుడిసె... వారసత్వంగా వచ్చిన తోట... అందులో పండ్లచెట్లు, పూల మొక్కలు పెంచుతూ వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి ఫలసాయంతో పొట్టపోసుకునేవాడు.

ధనికుడికి ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోవడంతో కడుపునిండా తినడానికి, కంటినిండా నిద్రపోవడానికి నోచుకోలేదు. దాంతో అసంతృప్తితో బాధపడేవాడు. పేదవాడు మాత్రం ఎంతో హాయిగా, ఆనందంగా జీవించేవాడు. అన్నీ ఉన్న తనకు లేని సంతోషం ఏమీలేని ఆ పేదవాడికి ఎలా దక్కుతోందో తెలుసుకోవాలనుకున్నాడు ధనికుడు.

దాంతో ఓ రోజు పేదవాడి దగ్గరకెళ్లి, అతడి సంతోషానికి కారణమేంటో చెప్పమన్నాడు. కష్టపడి పని చేయటం, ఉన్నదానితో తృప్తి పడటమే తన ఆనందానికి కారణాలని చెప్పాడు పేదవాడు. ధనికుడు ఎంతో సంతోషంతో అతణ్ని తన ఇంటికి పిలుచుకెళ్లి, విందుభోజనం పెట్టి, వెయ్యి బంగారునాణాలు కానుకగా ఇచ్చాడు.

ఆ రోజు రాత్రి ధనికుడికి కంటినిండా నిద్రపడితే, తన దగ్గరున్న డబ్బును ఎవరైనా దోచుకుపోతారేమోనన్న భయంతో పేదవాడికి కునుకే కరువైంది. దాంతో అతడు మర్నాడు ఆ డబ్బు మూటను తిరిగి ధనికుడికిచ్చేసి వ చ్చేశాడు. ఆ రోజు యథాప్రకారం హాయిగా నిద్రపోయాడు.

నీతి: కష్టార్జితం వల్ల కలిగే ఆనందం, తృప్తి అప్పనంగా లభించిన ధనంతో కలగవు.
-బాచి

18, మార్చి 2012, ఆదివారం

సోమరి పని


- పుప్పాల కృష్ణమూర్తి 

సభలో కొలువుతీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి ''అయ్యా, మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్తవయసు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాడ్ని పోషించాల్సి వస్తోంది. ఏ పనికి వెళ్లమన్నా వెళ్లడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటివాళ్ళంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి, దారిలో పెట్టాలి'' అని వేడుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు.
''ఏంటి పాండయ్యా! ఏ పనీ చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా?'' అడిగారు రాయలువారు.
''అయ్యా! నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పట్నించీ పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పనిరాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు'' చెప్పాడు పాండయ్య.
''నేను నిన్ను పనిలో పెట్టుకుంటా'' అని చెప్పి...
భటులతో ''వీడ్ని తీసుకెళ్లి గుర్రపు శాలలో లద్దె ఎత్తించండి'' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు.
భటులు పాండయ్యని తీసుకెళ్లారు.
''మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనిమంతుడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్లండి'' అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు.
దండంపెట్టి వెళ్లిపోయారా దంపతులు.
లలల
తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య. ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు. తీరా చూస్తే అదంతా చిందర వందరగా, అసహ్యంగా ఉంది. ''నేనీ పని చెయ్యను. వెళ్లిపోతాను'' అని పేచీ పెట్టాడు.
''లద్దె ఎత్తి, పెంటదిబ్బ మీద పడేసి, గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో, పనిచేయకుండా రోజుకో వంద కొరడాదెబ్బలు తింటావో నీ ఇష్టం. నిర్ణయించుకో... ఇది రాజుగారి ఆజ్ఞ'' అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య.
''లద్దే ఎత్తుతాను. కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది. అసలే గారబంగా పెరిగాను'' అని తట్ట తీసుకుని లద్దె ఎత్తడం మొదలు పెట్టాడు పాండయ్య.
ఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహా కనిపించింది. చప్పుడు చేయకుండా, ఎవరికీ కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య. ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. కాని దొరకలేదు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిడండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహా ఇచ్చాడు. పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది.
మరుసటి రోజు తెల్లవారు జామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహా కనిపించింది. దాన్నీ జేబులో వేసుకుని, గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు. అక్కడ దొరికే వరహాల కోసం, జ్వరం వచ్చినా, నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్లేవాడు. ఆ వరహా మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు. ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది. ఖాళీగా ఉండాలన్నా ఉండలేక పోతున్నాడు. వరహా దొరక్కపోయినా సరే ఎప్పటిలాగే పనిచేయసాగాడు. అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు.
ఆ రోజు పనికెళ్లిన పాండయ్యతో ''ఇంక నువ్విక్కడ పని చేయనవసరం లేదు. ఇంటికెళ్లి పోవచ్చు'' అన్నాడు గుర్రపుశాల కాపలా దారు కాంతయ్య.
పాండయ్య బేర్‌మన్నాడు. ఇంటికెళ్లి జరిగిన విషయమంతా చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడు. రాజుగారిని అడుగుదామని ముగ్గురూ సభకు వెళ్లారు.
''అయ్యా! మావాడు పనిచేసిన ప్రతిరోజూ గుర్రపుశాలలో ఒక వరహా దొరికింది. వరహా కోసం వాడు రోజూ పనికి వెళ్లాడు. ఈ వరహాలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి. కాబట్టి అవన్నీ మీకే చెందాలి. మొదటి రోజే ఇద్దామనుకున్నాను. కాని మావాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు'' అని మూడు వందల అరవై ఐదు వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు.
రాయలు చిన్నగా నవ్వాడు.
''తమరివల్ల మావాడి సోమరితనం పోయింది. పని లేకపోతే, పిచ్చివాడై పోతున్నాడు. ఇలా అర్థాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు. దయచేసి, ఏదో ఒక పని ఇప్పించి, మా కుటుంబాన్ని ఆదుకోండి'' అని వినయంగా నమస్కరించారా దంపతులు.
శ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి ''మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు. ఆ వరహాలన్నీ మీవే. పాండయ్య ఇంతకాలం పని చేసినందుకు ప్రతిఫలం. వాటితో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ బతకండి. చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు. కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను'' అని చెప్పాడు.
- పుప్పాల కృష్ణమూర్తి

16, మార్చి 2012, శుక్రవారం

మన్యాల నుండి వచ్చిన మనిషి (కధ)--శ్రీశ్రీ



అప్పుడు నాకు బాగా చిన్నతనం. ఇంకా ఆరోయేడు రాలేదు. ఆ రోజుల్లో ఒక ముసలి అబ్బి తంబూరా పాడుతూ వచ్చి మా ఇంటిముందు నిలబడ్డాడు. ఇంట్లోంచి నేను పరుగెత్తుకుని వచ్చి మళ్లీ పాడుతాడేమో అని నిల్చున్నాను. పాడలేదు. 'మానేశావేం? పాడవూ?' అన్నాను. 'అబ్బాయీ! కాసిన్ని మంచినీళ్లిప్పిస్తావా? నీకు పుణ్యం వుంటుంది. అలసిపోయిన ఈ ముసిలిప్రాణిని కాపాడు. మన్యాలనుంచి వొస్తున్నాను' అన్నాడు ముసిలి.

'మన్యాలా? ఏం మన్యాలు?' అన్నాను. 'గుణుపురం మన్యాలనుంచి' అన్నాడు ముసలాయన.
'గుణుపురం మన్యాల నుంచి ఎందుకొస్తున్నావ్‌?'
'అక్కడే నేను పుట్టాను. నా మనస్సును అక్కడే దిగవిడిచాను'
'అయితే నీ మనస్సు మన్యాల్లో ఏం చేస్తోంది?'
'విచారంతో ఏడుస్తోంది. అబ్బాయీ కొంచెం మంచి తీర్థం తీసుకొద్దూ. నాలిక ఆర్చుకుపోతోంది'
'మీ అమ్మ ఎక్కడుంది?'
'ఈ వూళ్లోనే. కానీ ఆవిడ మనస్సు మాత్రం ఇక్కడ లేదు'
'మరైతే ఎక్కడుంది?'
'గుణుపురం మన్యాల్లో. మంచి నీళ్లు తీసుకురావా చిట్టీ?'
'మీ వాళ్లంతా మన్యాల్లో మనస్సు వదిలిపెట్టేస్తారేం?'
'అది మా కుటుంబం ఆనవాయితీ. ఇవాళ ఇక్కడ, రేపు ఎక్కడో'
'అంటే?'
'ఇవాళ బతుకు, రేపు చావు'
'మీ అమ్మమ్మ ఎక్కడుంది?'
'యలమంచిలిలో'
'ఆవిడ మనస్సు కూడా మన్యాల్లోనే ఉండిపోయింది కదూ?'
'తప్పకుండా. కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి.
ఇంతట్లో మా నాన్న వచ్చి గడపమీద నిలబడ్డాడు. పడుకుని మేలుకున్న సింహంలాగ బొబ్బరించాడు. 'ఒరే, నీకు బుద్ధిలేదూ? పెద్ద మనిషి మంచినీళ్లు కావాలంటూవుంటే పెత్తనాలు చేస్తున్నావ్‌? వెళ్లి చెంబెడు నీళ్లు పట్రా, పాపం సొమ్మసిల్లి పడిపోకముందే. ఏమయిందిరా నీ మర్యాదా, మప్పితం?'
'ఎట్టకేలకెవరైనా మనింటికొస్తే లోకం భోగట్టా కనుక్కుంటాను. అదీ తప్పేనా?'
'వెళ్లి ముందు నీళ్లు తీసుకురారా. బెల్లం కొట్టిన రాయిలా కదలవేం? చస్తాడు బ్రాహ్మడు. వెళ్లరా వేగం'
'నువ్వెందుకు వెళ్లకూడదూ! వొచ్చేటప్పుడు మంచినీళ్లు తీసుకురాలేక పోయావూ? నువ్వేం పని చేస్తున్నావు నాన్నా?'
'మరేం? నేనేపనీ చెయ్యలేదట? నీకు తెలియదూ గొప్ప ప్రబంధం రాస్తున్నానని? పద్యాలు మనస్సులో ఆలోచిస్తున్నాను'
'అది నాకేం తెలుసు? తల చేత్తో పట్టుకుని నిలబడతావు? పద్యాలు రాస్తున్నట్లు నాకెలా తెలుస్తుంది?' తెలియకపోతే తెలుసుకోవాలి అన్నాడు మా నాన్న.
'నమస్కారం బాబూ' అన్నాడు ముసిలాయన.
'మీ కుర్రాడూ నేనూ మాట్లాడుతున్నాం. ఈ ప్రాంతాల్లో వానలు పడ్డాయనీ, ఈ యేడు చక్కగా పంటలు పండుతాయనీ చెబుతున్నాడు మీ వాడు'
(శ్రీరామ రామ! ఈ ముసిలాడితో ఇవన్నీ చెప్పలేదే నేను. పంటల మాట ఎప్పుడొచ్చిందసలు?)
'నమస్కారం' అన్నాడు మా నాన్న. 'లోపలికి దయ చెయ్యరూ. కాళ్లు కడుక్కుంటారా? వంట అయిపోవచ్చింది'
'ఆకలితో కడుపు దహించుకుపోతోంది. ఈ క్షణమే వస్తున్నాను'
'నేరంగ మెల్లిపోతానే' అన్న పాట వొచ్చునా?' అని ముసిలాయన్ని అడిగాను. తంబురా మీద పలికిస్తావ్‌ ఆ పాట. అదంటే నాకెంతో ఇష్టం. ఏమో మరి. ప్రపంచంలో అన్ని పాటలకన్నా అదే నాకు చాలా ఇష్టం'
'నా తండ్రే' అన్నాడు ముసిలాయన, నీ క్కూడా నాకొచ్చినన్నేళ్లు వస్తే ఈ ప్రపంచంలో పాటలు ప్రధానం కావని నీకు తెలుస్తుంది. అన్నమే ముఖ్యమని బోధపడుతుంది'
'ఏమైనా ఆ పాట నువ్వు పాడితే వినాలనుంది'
గుమ్మం ఎక్కి ముసిలాయన మా నాన్న చేతులు పట్టుకుని అన్నాడు 'నా పేరు తిరుచూర్ణం చంద్రకాంతయ్య. నాటకాల్లో వేషాలు వేస్తాను'
'మీ దర్శన భాగ్యం వల్ల మా ఇల్లు పావనమయింది' అన్నాడు మా నాన్న. 'అబ్బీ అబ్బీ ఈయన తాగడానికి మంచినీళ్లు తీసుకురా'
వెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చాను. అన్ని నీళ్లూ గుక్క విడవకుండా తాగేశాడు ముసిలాడు. కాస్త సేదతీరి వీధంతా పరకాయించి చూశాడు. దూరంలో పొలాలు, ఇంకా దూరంలో ఆకాశం చూశాడు. సాయంత్రపు సూర్యుడు అస్తమించుతుండడం చూశాడు.
ఇక్కడికి అయిదు వందల మైళ్ల దూరంలో వుంటుందనుకుంటాను మా దేశం అన్నాడు ముసిలాయన. 'ఇవాళ ఏం కూర చేశారు ఈ జీవి ప్రాణం నిలవడానికి?'
'అబ్బీ నువ్వు కోమటికొట్టుకు వెళ్లవలసి వుంటుంది. రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పు తేవాలి' అన్నాడు మా నాన్న.
'డబ్బులు తే'
'అరువిమ్మని అడుగు సెట్టిగారిని. నా దగ్గర దమ్మిడీ కూడా లేదు'
'సెట్టి మనకిక అరువివ్వనన్నాడు. ఇచ్చీ ఇచ్చీ ప్రాణం చాలొచ్చిందన్నాడు. మనమీద కారాలూ మిరియాలూ నూరుతున్నాడు. నీకేమో ఉద్యోగం లేదట. ఎన్నాళ్లయినా అప్పు తీర్చవట. ఇప్పటికే ఇరవై రూపాయలు బాకీ'
'వెళ్లి ఆ మాటా ఈ మాటా చెప్పి సాధించుకురా. ఇది నీ వొంతు పని. నా మాట వినడు. ఓ మంచీ చెడ్డా అఖ్ఖర్లేదు వాడికి. అదంతా నాకేటెరిక అనేస్తాడు'
'ఇరవై రూపాయలూ ఇచ్చాక మాట్లాడమంటాడు'
'వెళ్లరా అట్టే మాట్లాడక. వెళ్లి రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ తీసుకురా, నువ్వు తీసుకురాగలవు. నాకు తెలుసు'
'వెళ్లమ్మా, వెళ్లు... రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ ఇమ్మను సెట్టిగారిని' అన్నాడు ముసిలాయన.
'వెళ్లు మరి ఆలస్యం చెయ్యక. కొట్టుకెళ్లి నువ్వెప్పుడూ ఉత్తచేతుల్తో రాలేదు. నువ్వొచ్చేలోగా అవ్వని పొయ్యిలో నిప్పు రాజెయ్యమంటాను. మహారాజుల్లాగ భోంచేద్దాం' అన్నాడు మా నాన్న.
'నాకేం తెలియదు బాబూ! మనం డబ్బెగెయ్యాలని చూస్తున్నామన్నాడు సెట్టి. నువ్వే ఉద్యోగం చేస్తున్నావో చెప్పమంటాడు'
'అంతేనా? సరే వెళ్లి చెప్పు. ఇందులో దాపరికం ఏముంది? నేను కవిత్వం రాస్తానని చెప్పు. మా నాన్న పగలూ రాత్రీ కవిత్వం అల్లుతూ ఉంటాడని చెప్పు'
'అలాగే చెబుతాను గాని అది సెట్టి మీద పని చేస్తుందని అనుకోను. మీ నాన్న కవిత్వం చెబితే ఎవరికి గొప్ప అంటాడు. అందరు నిరుద్యోగుల్లాగా నువ్వు ఎక్కడకైనా వెళ్లడం, ఎవర్నైనా చూడడం అదేమీ లేదట, ఏ పని చెయ్యవట. ఎందుకూ పనికిరావట'
'సెట్టీ నీకు పిచ్చెత్తి పోయిందని నేనన్నానని అను. నీకు తెలియదేమోగానీ నా అంత గొప్ప కవి లేడని చెప్పు. ప్రపంచంలో ఎవరికీ తెలియని మహా కవుల్లో మొదటివాణ్ణని చెప్పు'
'చెప్పినా సెట్టికి నచ్చుతుందని తోచదు. అయినా చూస్తాను. ఏమో నాకు చేతనైంది చేస్తాను. ఇంట్లో ప్రస్తుతం ఏమీ లేదూ?'
'ఏ కొంచెమో అటుకులు మాత్రం ఉన్నాయి. నాల్గు రోజుల్నుంచీ వరుసగా అటుకులే తిని బతుకుతున్నామని నీకు తెలియదూ? ఇవాళైనా ఇన్ని బియ్యం తెచ్చి ఇంట్లో పడెయ్యకపోతే నేను రాస్తున్న ప్రంబంధం పూర్తికాదు'
'ఏమో నా చేత నైనదంతా చేసే చూస్తాను'
'మరి ఆలస్యం చెయ్యకు తండ్రీ. మా దేశం అయిదువందల మైళ్ల దూరం అని మరిచిపోకు నాయనా?' అన్నాడు ముసిలాయన.
'పరుగెత్తుకెళ్లి పరుగెత్తుకొస్తాను'
సెట్టి దుకాణం దాకా పరుగెత్తుకు వెళ్లాను. కునికిపాట్లు పడుతున్న సెట్టి కళ్లు తెరిచాడు.
'చూశారా సెట్టిగారూ' అన్నాను నేను. 'మీరు చీనా దేశంలో ఉన్నారనుకోండి. నా అనుకునేవాళ్లెవరూ లేరనుకోండి. ఎర్రని ఏగాణియేనా లేదనుకోండి. అప్పుడెవరైనా గృహస్థు మీకింత బియ్యం వేస్తే బాగుంటుందంటారా లేదా?'
'ఎందుకొచ్చావ్‌' అన్నాడు సెట్టిగారు.
'అబ్బే ఊరికే మాట్లాడిపోదామని. ఎవరైనా సంసారి మీకు సాయం చేస్తే బాగుంటుంది కదూ? ఏమంటారు సెట్టిగారూ?'
'ఎంత డబ్బు తెచ్చావ్‌?'
'డబ్బు గొడవ కాదండీ. చీనాలో చిక్కుకుపోతే ఎవరు సాయం చేస్తారని?'
'అదంతా నాకేటెరిక'
'చీనాలో మీరే అలాంటి అవస్థపడుతున్నారనుకోండి. అప్పుడు మీకెలా వుంటుంది?'
'నాకేటెరిక చీనాలో నాకేం పనుంది?'
'కాదు సెట్టిగారూ? ఏదైనా పనిమీద అలా వెళ్లారనుకోండి. తెలిసిన స్నేహితులెవ్వరూ ఉండరనుకోండి. అంత దేశంలో ఒక్కడూ మీకింత బియ్యం వెయ్యకుండా తరిమేస్తాడంటారా?'
'అబ్బారు మనకి ఆళ్ల సంగతంతా ఎందుకు? మనది చీనాదేశం కాదు. నువ్వో మీ నాన్నో ఎప్పుడో ఒకప్పుడు పాటుపడి డబ్బు సంపాదించాల. ఆ పని ఇప్పుడే మొదలెట్టకూడదూ? మీకరువిస్తే మరి సచ్చినా డబ్బు తిరిగిరాదు'
'సెట్టిగారూ నా మాట మీకు తిన్నగా అర్థం కాలేదు. వెధవ అరువు. అరువు సంగతే నేను మాట్లాడలేదు. చీనాలో కోట్లకొద్దీ జనం. వాళ్ల మధ్య ఒంటిగా మీరు, కడుపు దహించుకుపోయే ఆకలి. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న అవస్థ'
'సీనా వూసు నాకెందుకు. ఇక్కడ ఈ రాజ్యంలో పాటుపడి పని సెయ్యకపోతే కూడు పుట్టదు. అందరూ ఏదో వుద్యోగం సెయ్యాల'
'సెట్టిగారూ ఒకసేరు బియ్యం దొరికితే మీ ప్రాణాలు నిలుస్తాయనుకోండి. ఆ స్థితిలో మీరు నోరు తెరిచి ఎవర్నైనా అడుగుతారా?'
'అడగను. నేనెవర్నీ ముస్టెయ్యండని అడగను. సచ్చినా అడగను'
'తర్వాత సేరుకి రెండు సేర్లబియ్యం తీర్చేస్తానని తెలిసినా అడగరూ? అప్పటికీ అడగరూ? అదుగో. అదే కూడదండీ సెట్టిగారూ. అంత నిరుత్సాహమా? ఇలాంటి మాటలవల్లనే యుద్ధాల్లో ఓడిపోతాం. మరేంవుంది? ఇలా బిగిసి కూర్చుంటే ఏమవుతుంది. చచ్చి ఊరుకుంటాం. చీనాలో ముష్టెత్తుకోకపోతే చచ్చిపోతారు సుమండీ సెట్టిగారూ!'
'ఇదెక్కడ సావొచ్చింది? ఆ ఇరవై రూపాయలూ ఇక్కడ తెచ్చిపెట్టు. మీ నాన్ననేదేనా ఉద్యోగం సెయ్యమను'
'పోనీండి గాని సెట్టిగారూ మీ వొంట్లో ఎలా వుంది?'
'నింపాదిగానే ఉంది. నీ కెలావుంది?'
'దివ్యంగా వుంది. మీ పిల్లలంతా క్షేమమా సెట్టిగారూ?'
'ఓ సేమంగా ఉన్నారు. సిన్నోడు నడుస్తున్నాడు కూడా'
'ప్రశస్తంగా వుంది. మరి మీ అమ్మాయి?'
'సంగీతం నేర్చుకుంటోంది. సిన్న సిన్న పాటలు పాడుతుంది. మీ అవ్వ నింపాదిగా వుందా?'
'భేషుగ్గా ఉంది. ఆవిడా చిన్న చిన్న పాటలు ఇప్పుడిప్పుడే పాడుతోంది. సినిమాలో పాడాలని చూస్తోంది. మీ ఇంటావిడ బాగున్నారా?'
'దానికేం? సుఖంగా ఉంది'
'మీ ఇంటిల్లిపాదీ హాయిగా ఉన్నారంటే నాకెంత సంతోషమో చెప్పలేను సెట్టిగారూ. మీ చిన్నబ్బాయి పెద్దయితే డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటయిపోతాడని నా నమ్మకం'
'నాకూ అదే ఆశ. నాకంటే సదువురాలేదుగానీ అబ్బాయిని సెన్నపట్నం పంపించాలనుకుంటున్నాను. ఆడుకూడా కిరాణా కొట్లో కూసోవడం నాకిష్టం లేదు'
'మీ చిన్నబ్బాయిని చూస్తేనేచాలు ప్రెసిడెంటుగిరీ చలాయిస్తాడని తెలుస్తుంది'
'ఏటికావాలి పంతులూ' అన్నాడు సెట్టిగారు. డబ్బేమైనా తెచ్చావా?
'చూడండి సెట్టిగారూ! ఇక్కడకు నేను రావడం ఏదీ కొందామని కాదు. దారింట పోతూ కాలక్షేపం కోసమని మీ దగ్గరకొచ్చాను. ఏవైనా తత్వాలు మీతో మాట్లాడడం నాకూ సరదా. పోనీ ఏదో మీరే అడిగారు కాబట్టి ఓ రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ కొలిపించండి'
'రొక్కం చెల్లించాల'
'మీ అమ్మాయి రోజమ్మ, అన్నట్లు మరిచిపోయాను. మీ రోజమ్మ బాగుందా? అంత అందమైన పిల్లని నేనెక్కడా చూడలేదు'
'రోజమ్మా... కులాసాగానే ఉంది. పంతులూ ఇక్కడ రొక్కం సెల్లించి తీరాల. నువ్వూ మీ నాన్నా వూరంతట్లోకి ఎందుకూ పనికిరాని యెర్రిమొగాలు'
'రోజమ్మ బాగుంది కదా! సంతోషమైన మాట చెవిన వేశారు. సెట్టిగారూ ఇవాళ మా ఇంటికి మహారాజశ్రీ తిరుచూర్ణం చంద్రకాంతయ్యగారు వచ్చారు. రాజు వేషం వేస్తారు. ఆయన పేరు పేపర్లో పడింది'
'అతగాడిపేరు నేనినలేదు'
'ఓ సేరు నెయ్యికూడా ఇవ్వాలి'
'చంద్రకాంతయ్యగారికి సేరు నెయ్యి నేనియ్యలేను'
'తప్పకుండా ఇవ్వగలరు'
'ఇయ్యలేను. కావలిస్తే బియ్యం పెసరపప్పు తీసికెళ్లు అంతే. మీ నాన్న ఎప్పుడేనా పనిసేస్తే యేం పని సేస్తాడు పంతులూ?'
'మా నాన్న కవిత్వం చెబుతాడు. అదొక్కటే మా నాన్నకి చేతనైనపని. ఈ ప్రపంచంలో అతనికన్న గొప్ప కవిలేడు'
'డబ్బేమైనా పెగుల్తుందా? మీ నాన్న దమ్మిడీ అయినా ఆర్జిస్తాడా?'
'మా నాన్న డబ్బుకోసం ఏ పనీ చెయ్యడు'
'అవ్వా కావాలి బువ్వా కవాలంటే ఎలాగ?'
'అలాంటి వుద్యోగాలంటే మా నాన్నకసయ్యం.
'అందర్లాగా మీ నాన్న పని సెయ్యడేం పంతులూ?'
'అందరికన్నా కష్టపడి పనిచేస్తాడు మానాన్న. మా నాన్న మామూలు మనిషికన్న రెండు రెట్లు ఎక్కువ పనిచేస్తాడు'
'సరే. సరుకు తీసికెళ్లు. ఇరవైరెండు రూపాయలపై సిల్లరయింది. ఇప్పుడంటే అరువిచ్చాను గాని ఇంకెప్పుడూ ఇయ్యను'
'రోజమ్మ నడిగానని చెప్పండి'
'అలాగే'
'వెళ్లొస్తాను'
'సరే వెళ్లు'
బియ్యం, పెసరపప్పు తీసుకుని పరుగెత్తుకుంటూ ఇల్లు చేరాను. తెస్తానో లేదో అని ఇంటిముందే కనిపెట్టుకు కూచున్నారు మా నాన్న, చంద్రకాంతయ్య. అల్లంతదూరాన ఉండగానే ఇద్దరూ నా దగ్గరకు తోసుకొచ్చారు. చేతిలో సరుకు చూడగానే. అవ్వకి చెయ్యి వూపాను. అవ్వ అది చూశాక ఇంట్లోకి వెళ్లింది.
'సాధించుకొస్తావని నాకు తెలుసు' అన్నాడు మానాన్న.
'నేనూ అలాగే అనుకున్నాను' అన్నాడు చంద్రకాంతయ్య గారు.
'ఇరవైరెండు రూపాయలపై చిల్లర అయిందని సెట్టిగారన్నారు నాన్నా. ఈ మాటుకి పోనిచ్చాను గాని ఇక మీద అరువుబేరం పనికిరాదన్నాడు' అన్నాను నేను.
'సరే. అది అతని అభిప్రాయం. అయితే అతగాడితో ఏం మాట్లాడావురా?'
'మొట్టమొదట చీనాదేశం, ఆకలి, చావడానికి సిద్ధంగా ఉండడం లాంటివన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ల కుటుంబం యోగక్షేమాలు కనుక్కున్నాను'
'అంతా బాగున్నారా?'
'దేదీప్యమానంగా ఉన్నారు'
తర్వాత ముగ్గురం ఇంట్లోకి వెళ్లాం. అవ్వ నిమిషాల మీద వంట పూర్తిచేసి వడ్డించింది. పప్పూ, మజ్జిగతో అన్నం తిని రెండేసి చెంబులనీళ్లు తాగాం. ఒక్క మెతుక్కూడా లేకుండా విస్తరి ఖాళీచేసి, ముసిలాయన వంటింట్లో గూటివేపు చూశాడు. ఇంకేమైనా తినడానికుంటుందేమో అని.
'అదుగో ఆ సీసా, అందులో ఏవో ఉండలున్నాయే' అన్నాడు ముసిలాయన.
'అవి నా గొట్టికాయలు' అన్నాను నేను.
'ఆ గూట్లో డబ్బీ. అందులో తినబడు సామాగ్రి ఓ పిసరు లేదూ?'
'మిడతల్ని దాచుకున్నాను'
'ఆ మూలని జాడీ చూశావ్‌. దాంట్లోనో?'
'కప్పలు'
'ఇకనేం. కప్పల్ని ఉడకబెట్టుకు తింటే బాగానే ఉంటుంది. నాకలాంటి పట్టింపులు లేవు' అన్నాడు ముసిలాయన.
'కప్పల్ని తింటారా ఎవరేనా?' అన్నాను.
'ఎందుకు తినరూ? మహారాజులాగా తింటారు. చీనావాళ్లు కప్పల్నీ, మిడతల్నీ తింటారు. మనం తింటేనేమో తప్పొచ్చింది? రానియ్యి. ఓ అరడజను కప్పల్ని, మిడతలనెన్ని జాగ్రత్త చేశావ్‌?'
'నాలుగో, అయిదో'
'దించవేం. తియ్యి జాడీలు, డబ్బాలు. కడుపునిండా తిన్నతర్వాత పదవే భద్రాద్రికి అనే పాట పాడుతాను. కావలిస్తే నువ్వడిగిన 'రంగమెల్లి పోతానే' అనే పాటకూడా పాడుతాను. ఇప్పుడు మాత్రం ఇంకా ఆకలి దహించేస్తోంది'
'నాకూ ఆకలిగానే ఉంది. అయినా నా కప్పల్ని చంపేస్తే ఒప్పుకోను'
మా నాన్న చేతులు కడుక్కుని తల రెండు చేతుల్తో పట్టుకుని పగటి కలలు కంటున్నాడు. అవ్వ ఒకచోట నిలవకుండా నడుస్తూ పాడుకుంటోంది. త్యాగరాజు కృతులు ఆవిడకు చాలా ఇష్టమట. తొలినే చేసిన పూజాఫలం అని అరుస్తోంది.
'మీరేదేనా పాడరూ? మా అబ్బాయికి పాటలంటే సరదా' అన్నాడు మా నాన్న.
'ఔనండీ నాకు పాటలంటే ఇష్టం. పాడరూ' అన్నాను నేను.
చంద్రకాంతయ్య లేచి చెయ్యి కడుక్కుని తాంబూలం తీసుకుని ఉరుములాంటి గొంతుతో ఊరంతా దద్దరిల్లిపోయేటట్లు పాట లంకించుకున్నాడు. ఇరుగు పొరుగు వారందరూ మా యింటిముందు పోగయి పాట వింటూ తన్మయులైపోయారు. మా నాన్న చంద్రకాంతయ్యని లోనికి తీసుకొచ్చి వారు ఫలానా అని అందరికీ చెప్పాడు. మైలవరం కంపెనీలో యాక్టు చేశారని, విద్యాధీకులనీ పరిచయం చేశాడు. జనం ఏమీ అనలేదు. చంద్రకాంతయ్యగారు నాటకాల్లో తమ అనుభవాలను గురించి ఉపన్యసించారు. కలకత్తాలో తనకి సువర్ణపతాకం ఇచ్చారనీ, అదంతా నిన్నగాక మొన్న జరిగినట్లు కళ్లకి కనబడుతోందని అన్నాడు.
వీరాచారి మరో పాట సెలవియ్యండని అడిగాడు. ఇంట్లో ఏమైనా బియ్యం వుందా అని చంద్రకాంతయ్య అడిగాడు.
'ఓ ఉన్నది. కావలసినంత ఉన్నది' అన్నాడు వీరాచారి.
'రావడానికి వీలవుతుందా? తిరిగి రాగానే నీ గుండె కరిగించగల పాట పాడతాను' అన్నాడు ముసిలాయన.
'ఇక్కడున్నట్లు వస్తాను' అని వెళ్లాడు వీరాచారి.
అలాగే చంద్రకాంతయ్య రంగశాయిని మీ ఇంట్లో పొట్లపాదు ఉందా అని అడిగి, రంగశాయి 'మా ఇంట్లో పాదు ఉండకేం అంటే, ఇబ్బంది అనుకోక ఇంటికి ఒకటి రెండు పొట్లకాయలు తీసుకురావడానికి వీలవుతుందా? రాగానే నీకళ్లంట నీళ్లు తెప్పించే పాట పాడతానని అనడంతో, రంగశాయి అలాగే ఇంటికి బయలుదేరాడు. చంద్రకాంతయ్య ఇరుగు పొరుగువాళ్లు నొక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరింట్లోనూ ఏదైనా ఓ పిసరు తినగల, రుచిగల పదార్థం ఉన్నదేమో అని వాకబుచేశాడు. వాళ్లంతా ఉన్నట్లు చెప్పగానే ఇబ్బంది అనుకోక ఇళ్లకి వెళ్లి ఆ తినగల, రుచిగల పదార్థాలు తీసుకురావడానికి వీలవుతుందా అని అడిగాడు. వాళ్లంతా వెళ్లి ఎవరింట్లో కలిగినది వాళ్లు తీసుకొచ్చారు. చంద్రకాంతయ్య పాడే, కళ్లంట నీళ్లు తెప్పించే, జీవితాన్నే అట్నుంచి ఇటు మార్చివేసే పాట వినడానికి కూర్చున్నారు. తంబురానీ, గొంతుకనీ సవరించి 'ఇది మాయా సంసారం' అనే పాటని విజృంభించి పాడగా ఇరుగు పొరుగువాళ్లు పరవశులై కళ్లు తుడుచుకుంటూ వెళ్లి పోయారు. చంద్రకాంతయ్యగారు ఇరుగు పొరుగువాళ్లు తెచ్చిన మంచి మంచి పదార్థాలన్నీ వంటింట్లో చేరవేసి ఆ వంకాయలూ, పొట్లకాయలూ, బియ్యం, పంచదార, సెనగపప్పు... అవన్నీ వండుకున్నాక మేమందరమూ హాయిగా భోజనం చేసి ఆకలి తీర్చుకున్న పిమ్మట చంద్రకాంతయ్యగారు మీ అభ్యంతరం లేకపోతే ఇలాగే మరికొన్నాళ్లు మీ ఇంట్లోనే ఉంటానన్నారు. దీన్ని స్వగృహంగా భావించుకొండని మా నాన్న అనగా, అలాగే అని చంద్రకాంతయ్యగారు మా ఇంట్లో పదిహేడు పగళ్లూ పదిహేడు రాత్రుళ్లూ గడిపారు. మీదట పద్దెనిమిదో రోజు మధ్యాహ్నం చంద్రకాంతయ్యగారున్నారా అని ఎవరో వచ్చి అడిగితే మా నాన్న 'ఎవరు నువ్వు' అని అడిగారు.
'మాది మైలవరం, మళ్లీ నాటకాలు వేస్తున్నాం. చంద్రకాతయ్యగారికి తెలుసు. రెండు వారాల్లో నాటకం' అని ఆ వచ్చిన మనిషి అనగానే పరధ్యానంగా కూర్చున్న చంద్రకాంతయ్యగారు దిగ్గున లేచి అతనితో కలిసి వెళ్లిపోయాడు.
ఆ మర్నాడు మధ్యాహ్నం మళ్లీ మాకు ఆకలి మండుకొస్తే మా నాన్న నన్ను పిలిచి సెట్టిగారి దగ్గరకు ఎళ్లి ఏమిస్తే అది తీసుకురా, ఎలాగైనా తీసుకురావాలన్నాడు.
'ఇరవై రెండు రూపాయలపై చిల్లరబాకీ తీర్చనిదే ఏమీ ఇవ్వడతను' అన్నాను నేను.
'వెళ్లరా మరిన్నీ. నంగిరితనం వోడకు. అతనెంత యోగ్యుడు. నువ్వడిగితే లేదంటాడా?'
చచ్చినట్టు సెట్టి కొట్టుకు వెళ్లి ఇదివరకు చీనా సమస్యను వదలి పెట్టిన చోట మళ్లీ ఎత్తుకుని ఎలాగైతేనేం ఒక సేరు అటుకులు సంపాదించేసరికి నాకు తలప్రాణం తోకకొచ్చింది. అటుకులు తీసుకుని మా నాన్న ఇవి తింటే ముసిల్దానికి తంటా వొస్తుందని అన్నాడు. అలాగే అవ్వ మర్నాడు పాడుతూ దగ్గుతూ, దగ్గుతూ పాడింది.
ఇలా అటుకులమీద బతికితే ఎంతకాలానికి నా మహాకావ్యం పూర్తి అవుతుందన్నాడు మా నాన్న.
(విలియమ్‌ సారోయన్‌ కథకు అనుకరణ)
ముద్రణ : రూపవాణి మాసపత్రిక, జనవరి 1945. 

4, మార్చి 2012, ఆదివారం

వద్దంటే సంపద


వలీదాద్‌ వడ్రంగి పని చేసేవాడు. అతనికి నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. అతను సంపాదించిన దాన్లో ఎక్కువ ఖర్చయ్యేది కాదు. మిగిలిన డబ్బంతా ఒక పాత్రలో వేసి దాచిపెట్టేవాడు. ఎవరికే సహాయం కావాలన్నా చేసేవాడు. ఊళ్లో అందరికీ తల్లో నాలుకలా మెలిగేవాడు. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు.
అదే వూరి వాడైన సాహెబ్‌కి వలీ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందరూ వలీనే పొగుడుతున్నారని అసూయపడేవాడు. ఎలాగైనా ఊరందరి ముందు వలీని చెడ్డవాడిగా చిత్రించాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలేవీ ఊరి ప్రజలు నమ్మేవాళ్లు కాదు.
కొన్ని రోజులకు వలీ దాచుకున్న డబ్బుతో పాత్ర నిండిపోయింది. 'వెంటనే దీన్ని ఖాళీ చెయ్యాలి. లేకపోతే ఇకపై సంపాదించేది దాచడానికి వేరే పాత్ర లేదు' అనుకున్నాడు వలీ.
ఆ పాత్రను ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లి అతని ముందు కుమ్మరించాడు. 'ఆ డబ్బుకు సరిపడా ఒక బంగారు కంకణం ఇవ్వమని కోరాడు.
అందంగా నగిషీలు చెక్కిన బంగారు కంకణం వలీకి ఇచ్చాడు నగల వ్యాపారి.
అయితే ఆ కంకణాన్ని ఏం చెయ్యాలో వలీకి అర్థం కాలేదు. తనెటూ పెట్టుకోడు కనుక ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఓ చెట్టుకింద కూర్చున్నాడు. అంతలో అతనికి ఒంటెల బారు, వీటిమీద సరుకులు, ఒక వర్తకుడు కనిపించాడు.
''అయ్యా! తమరెక్కడికి వెళ్తున్నారు?'' అడిగాడు వలీ.
''రాజమందిరానికి. యువరాజుగారు కొన్ని కొత్త దుస్తులు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అవి తీసుకెళ్తున్నా'' అన్నాడు వర్తకుడు.
''దయచేసి ఈ కంకణం అతనికి ఇవ్వండి. ఇది వలీ కానుక అని చెప్పండి'' అని ఆ కంకణాన్ని వర్తకుడికి అందజేశాడు.
వలీ పంపిన కంకణం యువరాజుకి ఎంతో నచ్చింది. ప్రతిగా అతను కొన్ని అందమైన సిల్కు వస్త్రాలు అదే వర్తకునితో పంపాడు.
వీటిని తీసుకుని తిరుగు ప్రయాణంలో వలీకి అందజేశాడు వర్తకుడు.
''వీటిని నేనేం చేసుకోను?'' అన్నాడు వలీదాద్‌.
''నీకు అవసరం లేకపోతే ఎవరికన్నా ఇవ్వు. యువరాజుగారు పంపించారు. నీను ఇస్తున్నాను. అంతే. ఇక వాటిని ఏమైనా చేసుకో'' అన్నాడు వర్తకుడు.
''ఎవరికి ఇవ్వను? నాకెవరూ లేరు. ఇటువంటి సిల్కు దుస్తులు నేనెప్పుడూ వేసుకోలేదు. వీటిని ఎవరికి ఇస్తే బాగుంటుందో నువ్వే చెప్పు?'' అన్నాడు వలీ.
''పక్కరాజ్యంలోని సుల్తాన్‌ మహారాజుకు ఇవ్వు. ఆయనికి ఇటువంటి సిల్కు దుస్తులంటే చాలా ఇష్టం. వీటిని తప్పక తీసుకుంటారు. నీకు మంచి బహుమానం ఇస్తారు'' చెప్పాడు వర్తకుడు.
బహుమానం అవసరం లేదు. వీటిని తీసుకుంటే చాలనుకుని, వర్తకుడు చెప్పిన ప్రకారమే వాటిని సుల్తాన్‌ మహారాజుకి పంపించాడు వలీ.
వాటిని చూసి సుల్తాన్‌ చాలా సంతోషించాడు. వాటికి బదులుగా ఆరు మేలుజాతి గుర్రాలను వలీకి కానుకగా పంపించాడు.
వాటిని ఏం చేసుకోవాలో తెలీక తిరిగి యువరాజుకి పంపించాడు వలీ.
''ఈ వలీ ఎవరు? నాకెందుకు కానుకలు పంపిస్తున్నాడు?'' యువరాజు తన స్నేహితులను అడిగాడు.
''ఇతనెవరో తన సంపదతో మీ మనసు చూరగొనాలని ఇలా విలువైన కానుకలు పంపుతున్నాడు. ఈ సారి అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప కానుక పంపించండి. దాంతో అతని గర్వం అణుగుతుంది'' అన్నారు వాళ్లు.
వెంటనే వలీకి 20 గుండిగల నిండా వెండి నాణేలు పంపాడు యువరాజు.
''ఒంటరిగా ఉండేవాణ్ణి. ఇంత సంపద నేనేం చేసుకోను'' అనుకున్న వలీ దాన్ని సుల్తాన్‌ మహారాజుకు పంపించాడు. అంత సంపదను చూసి సుల్తాన్‌ ఆశ్చర్యపడ్డాడు.
''ఈ వలీ ఎవరు? నాకెందుకు ఇన్ని కానుకలు పంపిస్తున్నాడు? అని సుల్తాన్‌ తన సలహాదారుణ్ణి అడిగాడు.
ఇతనెవరో చాలా గొప్ప ధనవంతుడిలా ఉన్నాడు. తన సంపదతో మీ మనసును ఆకట్టుకోవాలని, తన గొప్పను ప్రదర్శించుకోవాలని ఇంత విలువైన సంపదను పంపిస్తున్నాడు మహారాజా. అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప బహుమతిని పంపించండి. అప్పుడు మీరంటే ఏంటో అతనికి తెలుస్తుంది'' అన్నారు వాళ్లు.
20 గంగాళాల నిండా విలువైన రత్నాలు పంపించాడు సుల్తాన్‌.
ఇంత సంపద నేనేం చేసుకోను? అనుకున్న వలీ వాటిని తిరిగి యువరాజుకి పంపాడు.
ఇంత విలువైన రత్నాలు పంపించాడు... అసలు ఎవరితను? ఎలాగైనా అతన్నొక సారి చూడాలనుకున్న యువరాజు తన స్నేహితులను వెంటబెట్టుకుని వలీ ఉన్న ఊరికి వచ్చాడు. అలాగే సుల్తాన్‌ మహారాజు కూడా వలీని చూద్దామన్న కుతూహలం కొద్దీ తన అనుచరులతో బయల్దేరాడు.
ఎలాగో కష్టపడి వలీ ఇంటిదగ్గరికి చేరుకున్నారు యువరాజు, సుల్తాన్‌ మహారాజులు. కానీ అతను ఇంటిదగ్గర లేడు. అటుగా వెళ్తున్న సాహెబ్‌ని వలీ అంటే ఎవరని అడిగారు.
జరిగిందంతా తెలుసుకున్న సాహెబ్‌ తానే వలీనని చెప్పి వారి దగ్గర్నుండి విలువైన కానుకలు పొందాలనుకున్నాడు. వారి దగ్గరికి వెళ్లి తనే వలీనని చెప్పాడు కూడా. అది నిజమేనని నమ్మిన సుల్తాన్‌ మహారాజు, యువరాజులు అతనికి విలువైన కానుకలు ఇవ్వబోయారు.
అంతలోనే వలీ వచ్చి తన ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన సుల్తాన్‌, యువరాజులు నిజమైన వలీ ఎవరో తెలుసుకోవాలనుకున్నారు.
వెంటనే ఆ ఊరిపెద్దలను పిలిపించారు. వారు సాహెబ్‌ ఎటువంటి వాడో, వలీ ఎంత మంచివాడో చెప్పారు. నిజం తెలుసుకున్న మహారాజు, యువరాజు సాహెబ్‌ని వంద కొరడా దెబ్బలతో శిక్షించారు. వలీని తమ రాజ్యంలో కోశాధికారిగా నియమించాడు సుల్తాన్‌.
వలీ నిజాయితీ, నిస్వార్థం యువరాజుకి ఎంతగానో నచ్చాయి. అతణ్ణి తన స్నేహితుడిగా చేసుకున్నాడు.
- మేకల మదన్‌మోహన్‌ రావు

3, మార్చి 2012, శనివారం

కాకి- ఎద్దు (పిల్లలకు)

చిట్టి కథ
అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు గడ్డిని నెమరేస్తుండే ది. రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి

‘‘మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు, కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్లంతా హూనం చేసుకుంటున్నావు.

నీ గిట్టలన్నీ అరిగిపోయాయి. మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు! నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్కపెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు తెంచుకో! పచ్చికబయళ్లలో హాయిగా స్వేచ్ఛగా విహరించు’’ అంటూ హితబోధ చేసింది.

అంతా విన్న ఎద్దు ‘‘మిత్రమా! నీవ నుకుంటున్నట్లు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు’’ అని తాపీగా చెప్పింది.

ఆ మాటలతో కాకికి కళ్లు తెరుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
నీతి: ఇతరుల దగ్గర్నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండికన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్న.

శాఖమూరి శ్రీనివాస్

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సహచరుడు (కధ) -మల్లాది వెంకట కృష్ణమూర్తి



బస్‌స్టేషన్ వెయిటింగ్ రూంలోని టెలిఫోన్ బూత్‌లలో ఓ దాంట్లో జెఫ్ క్రేన్‌స్టన్ మోకాళ్ల మీద కూర్చుని, దానికి ఉన్న మట్టి పట్టిన అద్దంలోంచి బయటికి భయంగా చూస్తున్నాడు. కిరాయి హంతకుడు తనని హతమారుస్తాడనే భయం జెఫ్ క్రేన్‌స్టన్‌లో లేదు. ఇప్పుడు విల్లీ ది ఫింగర్‌ని చూశాక తొలిసారిగా అది కలిగింది.
విల్లీని తను చూసేలోగా అతను తనని చూసి ఉండకపోతే తను బతికిపోయినట్లే. వెయిటింగ్ రూంలో కూర్చుని బస్ కోసం వేచి ఉన్నవాళ్లని చూస్తున్న విల్లీ తన కంట పడగానే క్రేన్‌స్టన్ తక్షణం లేచి టెలిఫోన్ బూత్‌లోకి వచ్చి దాక్కున్నాడు. అదృష్టం! లేదా విల్లీ అక్కడికక్కడే తనని కాల్చేసినా ఆశ్చర్యం లేదు. నిజంగా ఆ పని మీదే వస్తే మాత్రం విల్లీ తనని ఒకటి, రెండు రోజుల్లో చంపుతాడు. అసలు తను ఈ ఊళ్లో ఉన్నట్లు ఎలా గ్రహించాడు? విల్లీ అక్కడ ఉన్న ఆరు బెంచీల్లో కూర్చున్న వారిని పరిశీలించి చూడటం క్రేన్‌స్టన్ గమనించాడు.
నిక్ ఫోలే ఎవర్ని చంపాలన్నా విల్లీని నియమిస్తాడని క్రేన్‌స్టన్‌కి తెలుసు. విల్లీ తనకి అప్పజెప్పిన పనిని చేసి తీరతాడని కూడా క్రేన్‌స్టన్‌కి తెలుసు. తనేం తప్పు చేయకుండానే తను ఇలా వేటాడబడటం అతనికి బాధగా ఉంది.
నిక్ ఫోలే చేసే అన్ని రకాల చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి క్రేన్‌స్టన్ కొంత మొత్తానికి ధన సహాయాన్ని అందిస్తాడు. నెల క్రితం క్రేన్‌స్టన్‌ని పిలిచి దాదాపు పాతిక కిలోల బరువుగల ఓ పెద్ద సూట్‌కేస్‌ని ఇచ్చి దాన్ని మిడ్ వెస్ట్‌లో ఓ ఊళ్లోని ఒకరికి డెలివరీ చేయమని నిక్ కోరాడు. అందుకు ఐదు వందల డాలర్లు ఇచ్చాడు. అందులో ఏం ఉందని జెఫ్ అడగలేదు. ఊహించాడు. డ్రగ్స్ కాదు. అది అంత బరువు ఉండదు. ఆయుధాలు కాని, బంగారం లాంటి ఖరీదైన లోహం కాని అయి ఉంటుందని అనుకున్నాడు. చిన్నపిల్లల శవం ఉండచ్చని కూడా జెఫ్ ఊహించాడు. తన కార్లో రెండు పగళ్లు ప్రయాణించి దాన్ని షార్లెట్‌లోని నిక్ చెప్పిన వ్యక్తికి డెలివరీ చేసి, అతనికి అందినట్లుగా నిక్‌కి ఫోన్ చేయించాడు.
ఆ తర్వాత నిక్ అమెరికాలోని దాదాపు పాతిక ఊళ్లకి జెఫ్ క్రేన్‌స్టన్‌ని పంపి అలాంటి పెట్టెలని డెలివరీ చేయించాడు. నెల తర్వాత ఓ రోజు జెఫ్ దినపత్రిక లన్నింటిలో ప్రముఖంగా వచ్చిన ఓ వార్తని చూశాడు. ఇరవై డాలర్ల నోట్లని ముద్రించిన ఓ దొంగల ముఠా కోసం పోలీసులు వెతుకుతున్నారన్న హెడ్డింగ్‌ని చూసి దాన్ని ఆసక్తిగా చదివాడు. గత నాలుగు వారాలుగా అమెరికాలోని అనేక బేంకులకి కొత్త ఇరవై డాలర్ల నోట్లు వచ్చాయని, అవన్నీ ఒకే సీరియల్ నంబర్ని కలిగి ఉండటం సిబ్బంది గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేశారని, ట్రెషరీ డిపార్ట్‌మెంట్ ఆ నోట్లన్నిటినీ పరిశీలించి, అవి సర్క్యులేషన్‌లో ఉన్న ఓ నోటు సీరియల్ నంబర్ అని గుర్తించారని, దాని ప్రింటింగ్‌లో వాడిన కాగితం, అచ్చు పని అత్యంత క్వాలిటీతో ఉన్నదని, ఆ నంబర్ గల నోట్లని తీసుకోవద్దని ట్రెషరీ శాఖ మీడియా ద్వారా ప్రచారం ఆరంభించిందని ఆ వార్తలో ఉంది. ఆ నోట్లన్నీ మిడ్ వెస్ట్ నించి సరఫరా చేయబడ్డాయని పట్టుబడ్డ ఇద్దరు నిందితులు చెప్పారని, వాటిని డెలివరీ చేసిన వ్యక్తిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని, విచారణ కొనసాగుతోందని ఆ వార్తలో ఉంది.
ఆ వార్త చదివాక జెఫ్ క్రేన్‌స్టన్ క్షణం ఆలస్యం చేయలేదు. తను పోలీసులకి పట్టుబడక మునుపే నిక్ ఫోలే తనని మట్టుపెడతాడని అతనికి తెలుసు. అవసరం వస్తే నిక్ నిర్దయగా తన తల్లినైనా చంపే కరకు వ్యక్తి అని జెఫ్‌కి తెలుసు. వెంటనే చెక్‌బుక్, కొద్ది దుస్తులు, ఇతర అవసరాలు సర్ది ఎప్పుడూ సిద్ధంగా ఉంచే చిన్న సూట్‌కేస్‌ని తీసుకుని కార్లో ఆ ఊరి నించి బయలుదేరాడు. అప్పట్నించి జెఫ్ ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు.
పారిపోయాక జెఫ్ రెండు వందల మైళ్ల దూరంలోని ఓ ఊళ్లో తన బేంకులోని డబ్బంతా డ్రా చేశాడు. ఆ రాత్రి మరో రెండు వందల మైళ్ల దూరంలోని ఇంకో ఊళ్లో తన స్పోర్ట్స్ కారుని అమ్మేశాడు. అది తన వెంట ఉంటే తనని పట్టిస్తుందని తెలుసు.
నెవేడాలోని ఓ చిన్న ఊరికి జెఫ్ రెండు రోజుల క్రితం చేరుకున్నాడు. నిజానికి అతను తర్వాతి ఊరుకి ఎక్కడికి వెళ్తాడో అతనికే తెలీదు. తను ఇంకో కారు కొని దాంట్లో వెళ్తాడని విల్లీ భావిస్తాడని, తను దొరక్కుండా ఉండటానికి జెఫ్ బస్‌లలో ప్రయాణిస్తున్నాడు. గత పదేళ్లుగా నిక్‌కి కిరాయి హంతకుడిగా పనిచేసే విల్లీ ది ఫింగర్‌కి ఇంతదాకా తనని చంపమని చెప్పిన ఏ ఒక్కర్ని విడకుండా చంపిన రికార్డ్ ఉంది అని జెఫ్‌కి తెలుసు. విల్లీకి చంపడమే కాక, పారిపోయే మనుషుల్ని వేటాడి పట్టుకునే నేర్పు కూడా ఉంది.
అన్ని సందర్భాల్లో అతను పాయింట్ 45 కేలిబర్ హేండ్ గన్‌నే వాడాడు. కొన్ని సందర్భాల్లో అతను చంపే పనిని పేరు గోప్యంగా ఉన్న ఓ సహచరుడికి ఇచ్చాడనే వదంతి కూడా ఉంది. అతనెవరో నిక్‌కి కూడా తెలీదు. నిక్ హత్య చేయమని విల్లీని కోరితే ఒకోసారి అంగీకరించేవాడు. ఒకోసారి తిరస్కరించేవాడు. అంగీకరిస్తే ఎంతటి గాఢ మిత్రుడ్ని అయినా తుద ముట్టిస్తాడని హతుల జాబితాని చూసిన వారికి అర్థమవుతుంది.
తను ఈ ఊరికి వచ్చినట్లు అసలు విల్లీ ఎలా కనుక్కోగలిగాడు? తను ప్రయాణించిన పద్ధతిని అతను ఎలా ఊహించి ఉంటాడు?
అతను తన కోసం కాక మరొకరి కోసం వెదుకుతున్నాడనే ఆశ జెఫ్‌లో ఓ మూల మిణుకు మిణుకుమంటోంది.
విల్లీ అకస్మాత్తుగా టెలిఫోన్ బూత్‌ల వైపు చూసి, జెఫ్ దాక్కున్న బూత్ వైపే రాసాగాడు. వెంటనే జెఫ్ తన హోల్‌స్టర్ లోంచి గొట్టం కోసేసిన పిస్తోలుని తీసి సిద్ధంగా పట్టుకున్నాడు. ఆ ఫోన్ బూత్‌లో ఎవరైనా ఉన్నారని తెలిస్తే విల్లీ వచ్చి చూడచ్చని జెఫ్ అప్పటికే దాని తలుపుని కొద్దిగా తెరచి ఉంచాడు. విల్లీ ఒకవేళ తన బూత్ తలుపు తెరిస్తే అతని తలకి గురి పెట్టి కాల్చాలని జెఫ్ నిర్ణయించుకున్నాడు. కాని విల్లీ జెఫ్ పక్క బూత్ తలుపు తెరుచుకుని వెళ్లాడు. నాణెం వేసిన శబ్దం, డయల్ చేస్తున్న శబ్దం వినిపించింది.
‘నేను, విల్లీని. బస్ స్టాండ్‌లో ఉన్నాను. మొత్తం వెదికాను కాని వాడు ఎక్కడా కనపడలేదు.. నిజమే. నా లెక్క ప్రకారం వాడి దగ్గర డబ్బుతో ఈ రోజుకి ఇక్కడికి చేరుకోవాలి. లేదా వాడికి ఎలాగో డబ్బు దొరికి విమానంలో ఏ సేన్ ఫ్రాన్సిస్కోకో వెళ్లాడేమో? ఇక్కడ నా అసోసియేట్‌కి కూడా ప్రస్తుతం ఇదే పని. వాడ్ని వర్ణించాను. ఒంటరి. ఫ్రెంచ్ కట్ మీసం. ఒత్తు క్రాఫ్. ఐదడుగుల ఆరంగుళాలు. ఎనభై కిలోల బరువు.. కళ్లజోడు...’
క్రేన్‌స్టన్ తన తలని తడుముకున్నాడు. బోడిగుండు. మీసం లేదు. కాని మిగిలిన విషయాల్లో తనలో మార్పు లేదు.
‘నేను వెనక్కి తిరిగి వస్తున్నాను. వాడు ఇక్కడే కనుక ఉంటే నా సహచరుడు వాడి సంగతి చూస్తాడని గేరంటీ, బై..’
విల్లీ వెళ్లిపోవడం చూశాడు. విల్లి సహచరుడు ఎవరైనా ఉండచ్చు? అక్కడ కూర్చున్న వాళ్లందర్నీ చూశాడు. అతను ఎవరైనా సరే, తనెవరో బయట పడకుండా వాళ్లల్లో ఒకడిగా కలిసిపోయాడు.
అకస్మాత్తుగా ఓ పోలీస్ లోపలికి వచ్చి అందరి టిక్కెట్లని చెక్ చేయసాగాడు. టిక్కెట్స్ లేకుండా ఆ ఏసి గది సుఖాన్ని అనుభవించడానికి వచ్చిన కొందరు పోలీసులను చూసి బయటికి వెళ్లిపోయారు. ఫోన్ బూత్ ఎదురుగా ఉన్న బెంచీలో కూర్చున్న ఒకామె పోలీస్‌ని చూసి కంగారు పడటం జెఫ్ గమనించాడు. ఆమె పక్కన చిన్న సూట్‌కేస్, ఓ పెద్ద హేండ్‌బేగ్. ఆమె ప్రవర్తనని బట్టి ఆమె దగ్గర టిక్కెట్ లేదని జెఫ్ గమనించాడు. పోలీస్ వంక భయంగా చూసి, అటు ఇటు దిక్కు తోచనట్లు చూడసాగింది. ఆ పోలీస్ ఆమె దగ్గరికి వచ్చేసరికి జెఫ్ బూత్‌లోంచి బయటికి వచ్చి, తన చేతిని ఆమె భుజం మీద వేసి చెప్పాడు.
‘సారీ హానీ! ఆలస్యం అయింది పద. వెళదాం’
ఆమె అతని వంక, పోలీస్ వంక, మళ్లీ అతని వంకా చూసి లేచింది. ఆమె సూట్‌కేస్‌ని అందుకుని జెఫ్ బయటికి నడిచాడు. ఇప్పుడు తన వర్ణనలో అతనికి క్రాఫ్, మీసాలతోపాటు ‘ఒంటరి’ కూడా రద్దయింది. తన ఎత్తు ఇప్పుడు విల్లీ సహచరుడికి పట్టించదు.
‘ఆకలిగా ఉందా?’ ఆమెని అడిగాడు.
* * *
ఆమె చాలా ఆకలిగా ఉందని ఆమె తిన్నదాన్ని బట్టి జెఫ్ గ్రహించాడు.
‘టిక్కెట్ లేకుండా అక్కడ ఉన్నందుకు ఆ పోలీస్ నన్ను అరెస్ట్ చేశాడని భయపడ్డాను. నన్ను కాపాడినందుకు థాంక్స్. నన్ను మీతో తీసుకెళ్లండి’ కోరింది.
‘కాని నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు’
‘ఎక్కడికైనా సరే. నా దగ్గర అయిదు డాలర్లు మించి లేదు. ఇంటి అద్దె చెల్లించనందుకు నా ఇంటి తలుపు తాళం వేసేశారు. రెండు రోజుల నించి తిండి లేదు. ఉద్యోగం లేదు. మీ పేరు నాకు తెలీకపోయినా ఫర్వాలేదు. మీతో నన్ను తీసుకెళ్లండి’ అర్థించింది.
‘అలాగే. ఇద్దరం ఓ గదిని అద్దెకి తీసుకుందాం. నా దగ్గర కూడా ఉన్నవి రెండు వందల డాలర్లే. కాని నీకన్నా ధనవంతుణ్ణి’ నవ్వాడు.
విల్లీ సహచరుడు తనని అక్కడ కనుక్కోలేకపోతే ఇక ఆ ఊళ్లో ఉండడు. ఇంకో ఊరుకి తనని వెదుకుతూ వెళ్తాడు. ఆమెతో ఆ ఊళ్లోనే ఉండటం శ్రేయస్కరం. ఓ నెల తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. యూరప్‌కి వెళ్తే ఇక తనని ఎవరూ పట్టుకోలేరు. అందుకు పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉంది. టిక్కెట్‌కి డబ్బే కావాలి. క్రెడిట్ కార్డుతో కొంటే నిక్‌కి తెలుస్తుంది. కాబట్టి దాన్ని వాడకూడదు. అందుకే ఇంత దాకా తను నగదే వాడుతున్నాడు. ఐనా విల్లీ తను ఈ ఊరికి వచ్చినట్లు ఎలా కనుక్కోగలిగాడో ఆశ్చర్యం!
ఇద్దరూ లేచి రోడ్ మీద నడవసాగారు. కొద్ది దూరం వెళ్లాక ఆమె చెప్పింది.
‘నీరసంగా ఉంది. కొద్దిసేపు అలా కూర్చుందాం’
ఇద్దరూ ఓ చిన్న సందులోని ఓపెన్ మార్కెట్ వారు వదిలి వెళ్లిన చెక్క కార్టన్స్ మీద కూర్చున్నారు. ఆమె కొద్దిసేపు కళ్లు మూసుకుని కూర్చుంది. తర్వాత చెప్పింది.
‘నా పేరు మెరోని. నేను డయాబెటిక్. అన్నం తినగానే మాత్ర వేసుకోవాలి’
తన హేండ్ బేగ్ జిప్‌ని లాగింది. తక్షణం జెఫ్ చేతిలోకి అతని పిస్తోలు ప్రత్యక్షం అయింది.
‘నువ్వు, విల్లీ పార్ట్‌నర్స్ అని నాకు తెలుసు’ ఆమెకి చెప్పాడు.
ఆమె అతని వంక చూడకుండానే ‘ఏమిటి మీరనేది?’ అంటూ జిప్‌ని పూర్తిగా తెరచి వేళ్లని బేగ్ లోపలికి జొప్పించింది. తక్షణం జెఫ్ పిస్తోలు బారెల్‌ని ఆమె తలకి ఆనించి ట్రిగ్గర్ నొక్కాడు. గొట్టం కోయడంతో అది పేలినా పెద్ద శబ్దం రాలేదు. ఆమె గొంతులోంచి వింత ధ్వని వెలువడి తలని పక్కకి వాల్చేసింది.
జెఫ్ ఆలోచిస్తున్నాడు. ఆమె విల్లీ సహచరుడు అయి ఉండచ్చు. అంత పెద్ద హేండ్‌బేగ్‌లో పాయింట్ 45 కోల్ట్ హేండ్‌గన్ పడుతుంది. బహుశా ఆ తుపాకీని తీసి తనని ఇక్కడ కాల్చి చంపచ్చు. ఇక్కడ కాల్చినా మెయిన్ రోడ్‌లోని ఎవరికీ కనపడదు. అందుకే ఇక్కడ కూర్చుందామని అడిగి ఉంటుంది.
జెఫ్ తన ఊహ నిజమో, తప్పో తెలుసుకోవడానికి ఆమె హేండ్ బేగ్‌లోని వస్తువులని బోర్లించి చూశాడు.
*
(అల్‌నుస్ బౌమ్ కథకి స్వేచ్ఛానువాదం)

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

అట్లపిండి (కధ)- చలం


నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ ఉండేది. ఆమె పేరు వెర్రిబామ్మ. కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంతవరకు ఒక్కసారిగా, పాతికట్లకంటే తక్కువ తిన్నవాడు లేడు. అందుకనే ఆమెని అట్లబామ్మ అనేవాళ్లం. ఎల్లా చేసేదో ఆ పిండిలో 'ఏం కలిపేదో' ఎవరికీ తెలియదు. ఒకసారి నేను మా చెల్లెలుగారి ఊరు వెళుతున్నా. మా చెల్లెలు గర్భంతో ఉండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరం రాసింది. బామ్మ ఏం చేసిందంటే, పిండి కలిపి ఒక పెద్ద సత్తెప్పాలలో వేసి, సిబ్బి బోర్లించి, గుడ్డ వాసిన కట్టి, నన్ను ముందు తీసుకెళ్లమంది. మర్నాడు తను బయలుదేరి వస్తానంది. చేబ్రోల్లో మధ్య ఒక రోజు దిగాను. మర్నాడు తెల్లవారి రైలుకొచ్చి, మూటా గిన్నె పెట్టుకుని, ప్లాటుఫారం మీద నుంచున్నా. దగ్గిర వున్న వాళ్లందరూ మూటలూ ట్రంకులూ మోసుకుని దూరంగా పోతున్నారు. కారణం తెలియక ఎందుకన్నా మంచిది పోనీ అని, నా మూటా గిన్నా తీసుకుని నేనూ వాళ్ల వెనకాల వెళ్లి నుంచున్నా. వాళ్లు నాకేసి కోపంతో చూసి వెనక వొదిలిన చోటికే వెళ్లి మళ్లీ నుంచున్నారు. ఆలోచించా ఎందుకట్లా ఏడిపిస్తున్నారని. ఒకవేళ ఈ అట్లపిండి వాసనేమో. కాని మా ఇంట్లో వాళ్లందరికి చాలా అలవాటే. అదిగాక ఆ వాసన తగిలేటప్పటికి సంతోషం కూడాను. ఈ కాస్త భాగ్యానికే ఇంత హడావుడా? ఎంత సుకుమారం అబ్బా అనుకున్నా.
రైలంతా కిక్కిరిసి ఉంది. నేనెక్కిన పెట్టెలో ఆ వూరి వాళ్లెవరూ ఎక్కలేదు. వాళ్లు కనిపెట్టే ఉన్నారు నేనెక్కడ ఎక్కుతానో చూస్తా.
నేనెక్కిన చోట ఇది వరకే పదిమంది ఉన్నారు. చోటు లేదన్నారు. కాని నా తప్పాల ముందు తోసి, వెనకాల నేనూ ఎక్కాను. తప్పాల పైన బల్లమీద పెట్టి, ఇద్దరు లావాటివాళ్ల మధ్య ఇరికి, చాలా వుక్కగా ఉందండీ ఇవాళ అన్నాను. రెండు నిమిషాలయింది ఒక ముసలాయన ఇటు అటు కదలడం మొదలుపెట్టాడు. ''చాలా ఉక్కగా ఉందండీ ఇక్కడ'' అని పెద్ద ట్రంకోటి మోసుకుని బయటికి బయలుదేరాడు. ''ఇంకోచోట అసలు ఒకరిమీద ఒకరు నుంచున్నారండి'' అన్నా ఆగలా. రెండో లావాటాయన కూడా లేచి వెనకాల వెళ్లాడు. ఒకర్ని ఒదిలి ఒకరు ఉండలేరు గాబోలు అనుకుని హాయిగా సర్దుకున్నాము.
ఇంతలో తక్కిన వారందరూ ''హూ...హూ...'' అని ముక్కుల్తో అనడం మొదలుపెట్టారు. ఒకాయన మీద తెల్లని బొట్టు పడ్డది. పైకి చూస్తే తాప్పాల్లో పిండి కారుతోంది. బండి అంతా పరిమళం. హఠాత్తుగా ఒకమాటైనా ఆడకుండా, పలుగురు లేచి బస్తాలు, ట్రంకులు దింపుకుని బయిటికి నడిచారు. మిగిలిన వాళ్లం హాయిగా కాళ్లు జాచుకున్నాం. మిగిలిన వాళ్లల్లో ఒక బ్రాహ్మడు, శవం వాసన'' అన్నాడు. ఆ మాటల్తో అదిరిపడి, ఇంకా ముగ్గురు లేచి, ఒకళ్ల కాళ్లకి ఒకళ్లు అడ్డం పడుతూ, బండిలోనుంచి కిందికి దొర్లారు. రైలు కదులుతోంది. ఆఖరికి ఆ బండికల్లా నేనూ పచ్చకోటాయనా మిగిలాం. ''ఏమిటండీ ఈ కొంచానికి ఇంత హడావిడి చేస్తారు వీళ్లు. అంతా వేషం!'' అన్నాడు. ఆయనకి చాలా జలుబు చేసింది. కాని రైలు బయలుదేరిన కాసేపటికల్లా, ఒక్కసారి గాలి రివ్వున కొట్టేప్పటికి చాలా బాధపడడం మొదలుపెట్టాడు. ఆ జలుబూ గిలుబూ వొదిలిపోయింది. తరవాత స్టేషనులో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు. చాలా నీచమైన పని చేశాడనుకున్నా.
తరవాత బండి అంతా నాదే. ప్రతి స్టేషనులో మనుషులు అటూ ఇటూ చూచి, హాయిగా ఒక్కణ్ణి నిశ్చింతగా కూచున్న నన్ను నా బండిని చూసి, కళ్లు కుట్టి, ''ఒరేరు శంకరయ్యా! ఖాళీ బండిరా. ఇట్లారా! అని ట్రంకులూ, సంచులూ మోసుకొచ్చి తలుపు తెరచి మెట్లెక్కి ముక్కుతో ఇటూ ఇటూ వూది, బండికేసి నా మొహంకేసి, చూసి అమాంతం వెనకాల వాళ్లమీద విరుచుకుపడేది. అందరూ అంతే. ప్రతి స్టేషను దగ్గరా అంతే. ఏమెరగనట్టు అటుకేసి మొహం తిప్పేసి కూచున్నా. రయిలు కదులుతున్నా, అట్టే వుండిపోయినారు గాని, నా బండిలో మాత్రం ఎక్కలేదు.

గిన్నె దించుకుని, హాయిగా గోదావరి స్టేషన్లో దిగాను. కూలీ మా ఇంటిదాకా ఒక అణాకి గిన్నె మోసుకొస్తానన్నాడు. గిన్నె నెత్తిమీద పెట్టాను. దించాడు. ''రానండి'' అని వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న ఇంకోడు ఆలోచించి రెండణాలకొస్తానన్నాడు. గిన్నె నెత్తిన పెట్టుకున్నాడు. కష్టంతో బళ్లదాకా నడిచాడు. దింపాడు. ''నా చాతకాదండి బాబూ'' అని వెళ్లాడు. పావలా ఇస్తానని కేకేశా. మాట్లాడకుండా నెత్తిమీద గుడ్డ తీసుకుని, వాసన చూసుకుంటూ పోతున్నాడు.
ఆఖరికి అర్థరూపాయికి బండి మాట్లాడుకున్నాను. వాడు మాత్రం వొదలదలచుకోలా. అసలు రెండణాల మామూలు మా చెల్లెలుగారింటికి. ఒక నిముషం తరువాత ''బాబూ కేవుచాలదు. ముప్పావలా ఇప్పించాలి'' అన్నాడు. కొంచెం దూరం తోలాడు. ''ఒక రూపాయి ఇచ్చినా కష్టం చాలదు'' అని ఆపాడు. ఏం కష్టం అది అతనికే తెలియాలి. ఎంత కష్టంగా లేకపోతే, అంత నశ్యం పీలుస్తాడు? సరేనన్నా. ఏం చెయ్యను? అంతకంటే మళ్లీ రూపాయిన్నర కావాలి అనబోతున్నాడు. ఇంతలో గోదావరి మీదనుంచి గాలి విసిరింది ఎద్దు వైపు. ఎద్దు పరుగు మొదలుపెట్టింది. గుర్రం పనికిరాదు. వెనకనుంచి ఏం వస్తూందనుకున్నదో, ఏమిటో. బండి ఎవరి మీదనుంచన్న పోతుందనుకున్నా. కాని బండి రాకముందే, గాలి తగలగానే ఎక్కడున్న వాళ్లు అక్కడే ఇళ్లల్లోకి, దుకాణాల్లోకి, పక్క సందుల్లోకి తప్పుకున్నారు. ఇంటి దగ్గర బండి ఆగితేనా? నలుగురు ఎద్దుని పట్టుకున్నారు. ముక్కులవతలకి తిప్పేసి. అప్పటికీ ఆగకపొయ్యేదే. బండివాడు దూకి ఎద్దు ముక్కుకి గుడ్డ కప్పేసి, నశ్యం వాసన చూపించకపోతే. ఇంటి లోపలికి వెళ్లాము గిన్నా నేను. చెల్లెలూ పిల్లలూ పరిగెత్తుకుంటూ ఒచ్చారు. ''అన్నయ్యా'' అనీ, ''మామయ్యొచ్చాడు, మామయ్యొచ్చాడ''నీ గదిలోకి. గుమ్మం దగ్గర అందరూ తటాలున ఆగారు. కష్టంమీద మా చెల్లెలు మాత్రం మొహం మీద పమిటకొంగు కప్పుకుని వచ్చి, యేడుస్తా నన్ను కావలించుకుని, ''అన్నయ్యా! యెందుకు దాస్తావు చెప్పు నాతో. యేం ఘోరం జరిగిందో'' అంది. ఏం లేదమ్మా బామ్మ ఇచ్చిన అట్లపిండి'' అన్నాను.
బామ్మ రాత్రి కూడా రాలేదు. మూడు రోజులు చూశాం. రాలేదు. ఏం కదిపితే ఏమవుతుందో అని ఆ గిన్నెని అట్లానే ఉంచాం. ఆ తలుపు మాత్రం గొళ్లెం వేసి, తాళం వేసి, శీలు చేసి, చిల్లుల్లో గుడ్డపేలికలూ అవీ కుక్కాము. ఎవరం ఆ వేపు పోలేదు. నేను స్నానం చేసి, సబ్బుతో కడుక్కున్నాను. కాని ఇంకా బజార్లో నా గాలి తగలగానే మనుషులు, కలెక్టరు మోటారు ముందు తప్పుకునేట్టు తప్పుకోవడం మానలేదు. రెండు రోజులుండి మా చెల్లెలు, అట్ల ఆశ వదులుకుని ఇంక వూరుకోలేక ''ఈ పిండిని బామ్మ ఏం చెయ్యమంది'' అని అడిగింది. ''ఒచ్చిందాక ముట్టుకోకుండా అట్లానే ఉంచమంద''న్నాను. చెప్పడమెందుకు, దాన్నెవరు కదిలిస్తారంది. మూడు రోజులూ అయింది. పిల్లలు కొంచెం నలతగా కనపడ్డారు. ఆడుకోరు. అక్కడక్కడ దిగాలుగా చతికిలపడతారు. చంటిపిల్ల కారణం లేకుండా మారంపట్టి యేడుపు. బామ్మకి ఉత్తరాలు రాశాం. రిప్లయి ప్రీపెయిడు టెలిగ్రాములిచ్చాం! జవాబు రాలేదు.
నాలుగో రోజున మా చెల్లెలంది ''ఒక్క రూపాయి ఇచ్చి, దీన్ని అవతల పారేయిస్తే బామ్మ కోప్పడుతుందా?''
''ఆ. తప్పకుండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంక అట్లు చెయ్యదు. నవ్వదు. మాట్లాడదు. మన మొహం చూడదు. అయినా రూపాయికి ఎవడు పారేస్తాడు. ఒట్టి పీనిక్కి పది రూపాయలు తీసుకుంటాడే'' అన్నాను.
వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు, అబ్బాయికి జ్వరం, చిన్న పిల్లకి పొంగు, మా చెల్లెలికి ఆరో నెల నొప్పులు. ఏం చెయ్యం. ఎవరితో చెప్పకుండా ఇల్లు తాళం వేసి, సత్రానికి పోయాము.
ఇన్నాళ్లు మా బావ వూళ్లో లేడు. మేం సత్రానికెళ్లిన మర్నాడు ఊళ్లో దిగి ఇల్లు తాళం వేసుంటే మమ్మల్ని వెతుక్కుంటూ వొచ్చాడు. అతని వెనకాల పెద్ద గుంపు.
చుట్టుపక్కల వాళ్లందరూ ''ఇల్లు తెరుస్తారా? లేదా? లోపల నూరు కూనీలన్నా జరిగాయి. మరియాదస్తులనుకున్నాను. సత్రానికొస్తే దాగుతుందా?'' అని ఒకటే అరుపులు.
మునిసిపాలిటీ వారు ఇల్లు తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చెయ్యం. జబ్బు పిల్లల్నేసుకుని వెనకాలికెళ్లాము.
అర్థరాత్రి నేనూ, మా బావ మూతులకి గుడ్డలు కట్టుకుని ఒక సెంటు బుడ్డి మీద గుమ్మరించుకుని ఆ తప్పాల భుజాల మీద మోసుకుంటూ గోదావరివేపు బయలుదేరాం. నిద్దర్లో మనుషులు కలవరించారు. కేకలు పెట్టారు. తొందరగా వెళ్లి, శేషయ్య మెట్ట దగ్గర నావ తీసుకుని నీళ్ల మధ్యకు పోయి గిన్నె పళంగా గోదావరిలో పడేశాం. నీళ్లల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కానీ మూత తీస్తే, లోపలినుంచి ఏమొస్తుందో, ఏదన్నా విష జంతువు బయలుదేరుతుందేమో అని భయమేసింది. రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తిపోయింది. ఒక్కడూ నీళ్లు ముంచుకోలేదు. ఏదో చాలా ఉపద్రవం రాబోతుదని వూళ్లో పుకారు. రైలు బ్రిడ్జిమీద, రూల్సుకి వ్యతిరేకంగా ముప్పైమైళ్ల వేగంతో పోతోంది. పెద్ద పెద్ద చేపలు చచ్చి తేలుతున్నాయి. కాని ఒక్కరూ వాటిని ముట్టుకోరు. గోదావరి దాటే పిట్టలు గిరగిర తిరిగి నీళ్లల్లో పడుతున్నాయి. చివరికి పడవలూ, వలలూ వేసుకుని గోదావరి కెలికి, గిన్నెని పట్టి బయటికి తీశారు. యెట్టా కనుక్కున్నారో ఏమో. హాయిగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదికి అర్థరాత్రి హఠాత్తుగా వెళకువ వొచ్చింది. వూపిరి పీలవడం అసాధ్యమై తంటాలు పడ్డాం. వెంటనే లేచి లాంతర్లు వెలిగించి ఆ వుపద్రవం ఏమిటని వెడితే, అరుగు మీద ఆ గిన్నె వుంది. వెంటనే ఆ గిన్నెని తీసుకెళ్లి వూరి బయట దూరంగా శ్మశానంలో నడువు లోతున గుంట తీసి ిపాతి పెట్టించాం. మర్నాటికి కలెక్టరుకీ, ఛైర్మన్‌లకీ పెద్ద మాన్‌స్టరు అర్జీలు వెళ్లాయి. వాసనకి దెయ్యాలన్నీ లేచి శ్మశానంలోంచి ఊళ్లోకి బయలుదేరాయట. మునిసిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి ప్రాసిక్యూషన్‌ చేస్తామని బెదిరించి, ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము. అనంతపురంలో మేం ఒకరికి అయిదు వేలు బాకీ. ఆయన పేర దీన్ని బంగీకట్టి పోస్టాఫీసుకు తీసికెళ్లాం. యిరవయి రూపాయలు లంచమిస్తేగాని ఆ గుమస్తా బంగీ తీసుకోలా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకు సెలవు. ఆ సాయంత్రం రైలు గోదావరి స్టేషన్కి అరమైలు ముందే ఆగింది. మర తిప్పినా ఇంజన్‌ కదలలేదు. చివరికి యేం చేశారో తెలియదు. వార్తా పత్రికల్లో మాత్రం యెన్నడూ లేనిది అనంతపురంలో ప్లేగు మొదలుపెట్టిందని చదివాం. ఆయన ఇంతవరకూ అప్పుకోసం అడగలేదు. ఆయనకి ఆరుగురు కొడుకులూ, పదిమంది మనుమలూ ఉన్నారు. వాళ్లెవరూ ఇంత వరకు మాకు ఉత్తరం రాయలేదు.
నాకు నచ్చిన గురజాడ కథ -శ్రీశ్రీ
కథారచనలో నన్ను మించిన వాళ్లెందరో తెలుగు రచయితల్లో వున్నారని ఏ దాపరికమూ లేకుండానే వొప్పుకుంటాను. అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావుగారంటే అందరూ ఒప్పుకుంటారనే నా నమ్మకం. ఆయన కవిగా, నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవాడు. సంఖ్యలో ఆయన కథలు తక్కువే గానీ గుణంలో మాత్రం ఒక్కొక్కటీ ఒక్కొక్క వజ్రపు తునక. అన్నిటిలోకి మిన్నగా నాకు నచ్చిన కథ ''మీ పేరేమిటి?'' అనేది.
దీని పూర్తిపేరు ''దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా మీ పేరేమిటి?'' అని. సుమారు వంద సంవత్సరాల క్రింద విజయనగరం దగ్గరలోని ఒక కుగ్రామం ఈ కథకి రంగస్థలం. అయినా దీన్ని చదువుతూ ఉంటే ఇందులోని సంఘటనలన్నీ నిన్న గాక మొన్న జరిగినట్లుంటాయి.
అన్ని గ్రామాల్లోలాగే ఇక్కడ కూడా రెండు పార్టీలుంటాయి. అయితే అవి మతానికి సంబంధించినవి. ఒక పార్టీ శైవులది. మరో పార్టీ వైష్ణవులది. శైవులది పేదవాళ్ల పార్టీ. వైష్ణవులది గొప్పవాళ్ల పార్టీ (ఇటువంటి రాజకీయ విశ్లేషణ ఆనాడే గురజాడ జరిపి ఉండడం ఒక విశేషమే!).
ద్వాదశి ద్వాదశికీ వైష్ణవులు పులిహోరా, చక్రపొంగలి ఆరగిస్తూ ఉంటారు. ఇటువంటి భోగాలు శైవులకి లభ్యంకావు. వాళ్ల దేవుడయిన శివుడి దగ్గర ఏముంటుంది బూడిద తప్ప!
జంగం శరభయ్య శైవాలయంలో పూజారి. వైష్ణవులకు కెప్తాను సాతాని మన వాళ్లయ్య. వీళ్లిద్దరి మధ్యా అగ్గివేస్తే గుగ్గిలంలా ద్వేషం మండుతుంది. శరభయ్య తాను నందికేశ్వరుడి అవతారమని చాటుకుంటాడు. మన వాళ్లయ్య తానయితే గరుడాళ్వార్‌ పూర్ణావతారం కాకపోయినా, అప్పుడప్పుడు గరుత్మంతుడి గోళ్లు ఖండన అయితే వాటి అంశలో తాను జన్మించినట్లు చెప్పుకుంటాడు. అయితే శైవుల్ని చీల్చి చెండాడుతున్నానని సగర్వంగా ప్రకటించుకుంటాడు.
ఇందులోని అనేకానేక మహద్గుణాలలో గురజాడ మహత్తర కథన కౌశలం ఎంతో ఆశ్చర్యకరమైనదని మాత్రం ఇక్కడ చెప్పదలచుకున్నాను. ''కన్యాశుల్కం''లోని నాటకీయత కూడా ఈ కథలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇందలి పాత్రలన్నీ ''కన్యాశుల్కం'' నాటకంలోని పాత్రల్లాగే సజీవమైనవి. ఇందలి సంఘటనలన్నీ కథ చదువుతున్నంతసేపూ మన కళ్లెదుట కట్టినట్టుగా కనిపిస్తాయి.
అక్కడే ఉంది గురజాడ గొప్పతనం.
(స్వాతి వార పత్రిక, 15-8-1986)