29, జనవరి 2012, ఆదివారం

మిక్స్చ్‌ర్


లిక్కర్ వాంటెడ్

పుట్టన్న గేలం తీసుకుని చెరువుకెళ్లాడు. ఎక్కడ తవ్వినా ఒక్క ఎర కూడా కన్పించలేదు. దగ్గర్లో ఒక పిట్ట ఎరని చీలుస్తూ కన్పించింది. ఒడుపుగా పిట్టని పట్టి, ఎర లాగేసుకుని ప్రతిఫలంగా తన దగ్గరున్న బ్రాందీలోంచి 4 చుక్కలు పిట్ట నోట్లో పోసి గాల్లోకి వదిలేశాడు. తర్వాత గేలమేసి తాపీగా ఒడ్డున మందు కొడుతూ కూర్చున్నాడు.
గంట తర్వాత - ఎవరో వీపుని పొడుస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు .
పిట్ట మరో 3 ఎరలను తీసుకొచ్చింది.

కడదాకా రుణపడి ఉంటా
"డాక్టర్‌గారూ, చాలా పేదవాడిని. మీరు అడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. నాకొచ్చిన జబ్బు నయం చేస్తే జీవితాంతం పైసా తీసుకోకుండా మీ కుటుంబానికి పని చేసి పెడతా'' దీనంగా అన్నాడు ఏడుకొండలు.
"సర్లే! గాలి పీల్చు ... ఇంతకూ ఏం పనిచేస్తుంటావు?'' స్టెతస్కోప్ రోగి గుండెకు ఆనించి, నవ్వుతూ అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండి, శవాలు కాలుస్తుంటాను'' ఊపిరి వదులుతూ చెప్పేడు ఏడుకొండలు.

రాత్రుళ్లు కూడానా!
" ఏంటయ్యా? ఆఫీసుకు ఇంత ఆలస్యంగానా రావటం?'' కోపంగా అడిగాడు ఆఫీసరు.
"నిద్ర లేవడం ఆలస్యం అయింది సార్'' మెలికలు తిరిగేడు దైవాధీనం.
"వ్వాట్? నీవు ఇంటి దగ్గర కూడా నిద్రపోతావా?'' నోరు తెరిచాడు ఆఫీసరు.

నిజాయితీ వెల
"అడుక్కునే వాడికి ఒక్క రూపాయో, రెండు రూపాయలో వేస్తారు గానీ, ఏకంగా 20 రూపాయలు వేశావేం?'' అరిచాడు భర్త భాస్కర్రావు.
"ఉట్టినే వేశాననుకున్నారా? వాడి మాటల్లో నిజాయితీ కన్పించింది'' నెమ్మదిగా అంది కోమలి.
"ఏమిటో ఆ నిజాయితీ?'' వ్యంగ్యంగా అన్నాడు భాస్కర్రావు.
"అచ్చం రంభలా ఉన్నానన్నాడు. అది చాలదా?'' ఎదురు ప్రశ్నించింది కోమలి.

కష్టపడి కొట్టేశా మరి
"అయ్యో! పర్స్ పోయింది. అందులో పది వేలున్నాయి. ఇచ్చినవాళ్లకు వంద రూపాయలు ఇస్తాను'' లబోదిబో అన్నాడు చెంగల్రావు.
"నాకిస్తే ఐదు వందలిస్తా'' చెప్పేడు పక్క పాసింజరు.
"నాకిస్తే వెయ్యి రూపాయలిస్తా'' మరొకడన్నాడు.
"నాకిస్తే అందులో సగం, అంటే అయిదువేలూ ఇచ్చేస్తా'' అరిచేడు మరొకడు.
"అమ్మా? ఆశ, అప్పడం. ఎవరికీ ఇవ్వకపోతే పదివేలూ నావేగా?'' నోరుజారి దొరికిపోయాడు గంగులు.

బతికిపోయావు!
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తర్వాత తెలిసిందే, మా ఆయనకు నా మీద ప్రేమ పోయిందని'' కన్నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి.
"అందుకు సంతోషించు. ప్రేమ అలాగే ఉండి ఉంటే ఇంకెంతమంది పిల్లల్ని కనాల్సివచ్చేదో ఆలోచించు!'' ఓదార్చింది సుబ్బలక్ష్మి.

27, జనవరి 2012, శుక్రవారం

గుర్తుచేసుకుందాం... ఇప్పుడైనా!


వీరులు, ధీరుల త్యాగఫలం మన రిపబ్లిక్!
ఈ గణతంత్ర వ్యవస్థలో నియంతలుండరు... రాజులుండరు... ప్రజలే ప్రభువులు!
ఠాకూర్ రోషన్ సింగ్ లాంటి ఎందరో ప్రజాఉద్యమకారులు అధికారాన్ని దేవిడీలనుంచి చేజిక్కించుకునే క్రమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ వీరులను స్మరించుకోవడం మనందరి కనీస కర్తవ్యం...

18 నవంబర్ 1921.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరుగుతోంది. షాజహాన్‌పూర్ నుంచి బరేలీ వరకు 80 కిలోమీటర్ల మేర సాగుతున్న ఊరేగింపు అది. సుమారు వెయ్యిమంది స్వదేశీ వస్త్రధారులై సైనికుల్లా కదం తొక్కుతున్నారు. విదేశీ వస్తువుల్ని నడిరోడ్లపై కాల్చేస్తున్నారు. భారత్‌మాతా కీ జై అనే నినాదంతో భూమ్యాకాశాలు బద్దలైపోతున్నాయి. ఆ వందల మందినీ ఉత్తేజితుల్ని చేస్తూ, ముందుకు నడిపిస్తున్న నాయకుడు- 29 ఏళ్ల రోషన్‌సింగ్.

దేశం కోసం మరణించడానికే పుట్టానన్నట్లు ఉన్నాడు రోషన్. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత బలమైన ఠాకూర్ వంశంలో జన్మించాడు. చిన్నప్పటినుంచి భయం అంటే ఏమిటో తెలీకుండా పెరిగాడు. తుపాకీని గురిపెట్టి కాల్చడంలో అతడికి సాటి అతడే! కుస్తీ పట్టు పడితే భీమసేనుడైనా రోషన్ ముందు దిగదుడుపే!

ఎలాగైనా ఆ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలి. అదీ రోషన్ పట్టుదల. మార్గమధ్యంలో పదులమంది గ్రామస్థులు కూడా పదం కలిపేలా చేస్తున్నాడు రోషన్. ఎక్కడికక్కడ పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అయినా జనసంద్రం సాగుతూనే ఉంది. ర్యాలీ ఇంకో పది నిమిషాల్లో బరేలీ చేరుతుందనగా పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేశారు. రోషన్‌ని కోర్టులో హాజరుపరిచారు. బరేలీ జైలుకి తరలించారు- రెండేళ్ల కారాగారవాసానికి!

జైలు నుంచి విడుదలయ్యాక రోషన్‌లో మునుపటికన్నా ఆవేశం హెచ్చింది. నిరంతరం ఒకటే ధ్యాస- దేశానికి స్వతంత్రం రావాలి; బ్రిటిష్‌వారిని తరిమేయాలి. అంతే! కుంగిపోతున్న దేశమాతను తలచుకుని ఎన్ని కన్నీళ్లు కార్చాడో! గోమతీ నదీ తీరంలోనో, గోధుమ పంట చేలల్లోనో తిరుగుతూ మిత్రుడు హుకాంసింగ్‌కు తన ఆవేదన చెప్పుకునేవాడు. తల్లి భారతి కోసం ఉరికంబమైనా ఎక్కుతానని ఆవేశంగా అంటుండేవాడు. ‘‘పిచ్చిగా వాగకు. నీవొక్కడివి మరణిస్తే - స్వాతంత్య్రం వచ్చేస్తుందా?’’

విసుక్కునేవాడు హుకాం. ‘‘ఎవడికి వాడు ఇలాగే అనుకుంటే వస్తుందా?’’ ఎదురు ప్రశ్నించేవాడు రోషన్. ‘‘చూడు మిత్రమా! జంతువులు పుడతాయి కానీ తమకోసమే చస్తాయి. మనమూ అంతేనా?’’ సూటిగా అడిగేవాడు రోషన్. పెళ్లయి పిల్లలున్న రోషన్ కుటుంబం, ఆస్తిపాస్తులకోసం పడి చచ్చిపోకుండా దేశం కోసం చచ్చిపోవాలనుకోవడం హుకాంని కదిలించింది. ‘నీ కల నెరవేరాలంటే రాంప్రసాద్ బిస్మిల్‌ని కలవమని’ రోషన్‌కి సలహా ఇచ్చాడు హుకాం.

ఎవరీ బిస్మిల్?
5 ఏప్రిల్ 1924.
షాజహాన్ పూర్ ఆర్యసమాజ్.
రాంప్రసాద్ బిస్మిల్‌ని కలవడానికి వెళ్లాడు రోషన్‌సింగ్.

కండలు తిరిగిన దేహంతో మెలితిరిగిన మీసంతో యుద్ధ వీరుడిలా ఉన్నాడు బిస్మిల్. ఆ పక్కనే అష్ఫఖుల్లాఖాన్. ఇద్దరూ ప్రాణస్నేహితులు. అప్పటికి బిస్మిల్ వయసు 27, ఖాన్‌ది ఇరవై నాలుగే! సాధారణంగా అలాంటి నవయువకులు చేసే పని - అందమైన జీవితాన్ని స్వప్నించడం! కాని వారిద్దరూ దుర్మార్గుల చేతినుంచి దేశాన్ని ఎలా రక్షించాలా అని మధన పడుతున్నారు.

బిస్మిల్ చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. కాని ఆర్యసమాజ్‌లో చేరి స్వామి సోమ్‌దేవ్ శిష్యరికంతో గాడిలో పడ్డాడు. ఘోరమైన నియమాలతో బ్రహ్మచర్యం పాటించాడు. ఆవేశాన్ని రగిలించే దేశభక్తి కవితల్ని రచించాడు. అసలు బిస్మల్ అన్నది కలం పేరే! సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు అర్ధంతరంగా ఆపేశారంటూ ఏకంగా గాంధీనే నిలదీసిన ధీరుడు బిస్మిల్. అదీ పాతికేళ్ల వయసులో - బహిరంగంగా 1922 నాటి గయ కాంగ్రెస్ వేదికపై!

ఇక అష్ఫఖుల్లాఖాన్- అందగాడు. ఒడ్డూ పొడుగూ ఉన్నవాడు. బలిష్ఠంగా ఉండేవాడు. నరనరానా దేశభక్తి నింపుకున్నాడు. భారతదేశం బానిస ఖండం కావడం ఖాన్‌ని కలచి వేసింది. స్వరాజ్యం కోసం తానూ సమిధనవ్వాలనుకున్నాడు. బిస్మిల్‌తో స్నేహం చేస్తేనే ఇది సాకారమవుతుందని గ్రహించాడు. కానీ హైందవాన్ని బోధించే ఆర్యసమాజ సభ్యుడు... వేద సంస్కృతిని నిష్ఠతో పాటించే బ్రాహ్మణుడైన బిస్మిల్ తనను చేరదీస్తాడా అని తొలుత సందేహించాడు.

అది భ్రమ అని తర్వాత గ్రహించాడు. వారిద్దరిదీ ఎంత గాఢస్నేహమంటే- ఓసారి ఖాన్‌కి ఒళ్లు తెలీనంత జ్వరమొచ్చింది. రాత్రిళ్లు ‘‘రాం రాం’’ అంటూ పలవరించేవాడు. హిందువుల దైవాన్ని తమ బేటా కలవరించడంతో ఖాన్ తల్లిదండ్రులు పరేషానైపోయారు. కాని తర్వాత తెలిసింది అది ప్రాణమిత్రుడి పేరని!

అలాంటి ఆ ఇద్దరినీ కలిశాడు ఠాకూర్ రోషన్‌సింగ్.
‘‘ఏం కావాలి?’’ అడిగాడు బిస్మిల్.
‘‘భరతమాత కళ్లల్లో ఆనందం’’ అన్నాడు రోషన్.
‘‘ఏమిస్తావ్’’అడిగాడు అష్ఫఖుల్లాఖాన్.

‘‘నా రక్తాన్ని... ప్రాణాన్ని...’’ కసిగా పిడికిలిని ఛాతీపై గట్టిగా కొట్టుకుంటూ చెప్పాడు రోషన్.
అంతే! బలమైన కె రటం కొండను తాకినట్లు- ఒకేసారి రోషన్‌ని కౌగిలించుకున్నారు ఆ ఇద్దరూ!
కాని అప్పటికి ఆ ముగ్గురికీ తెలీదు- షాజహాన్‌పూర్‌లోనే 8 ఏళ్ల వ్యవధిలో పుట్టిన ఆ ముగ్గురూ సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఒకేరోజున ఒకేక్షణాన- వేర్వేరు జైళ్లల్లో- ఉరితీయబడతారని! తెలిసినా - వారు అలాగే తెగించి ఉండేవారు. ఎందుకంటే- వారు నేటికాలపు దొంగదేశభక్తులు కారు.
సంఘటిత శక్తిగా...

అక్టోబర్ 1924.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్.
స్వదేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే యువకులంతా సమావేశమయ్యారు. దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ బలిపీఠం ఎక్కడానికి తెగ ముచ్చటపడిపోతున్న యోధులు వారు. అలాంటి ఆ ఉడుకు రక్తధారల్ని సంఘటితం చేసి ‘హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’(హెచ్‌ఆర్‌ఏ) ని స్థాపించారు రాంప్రసాద్ బిస్మిల్, సచిన్ సన్యాల్, చంద్రశేఖర్ ఆజాద్. పూర్తి భారతీయ విప్లవకారులతో ఏర్పడిన తొలి సామ్యవాద సమాజమది. రోషన్‌సింగ్, అష్ఫఖుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అందులో సభ్యులయ్యారు.

బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్షదాడులకు దిగడం, సైనిక కుట్రలకు పాల్పడటం, విప్లవ సాహిత్య ప్రచారం, ఆయుధాల్ని, మందుగుండు సామగ్రిని సమకూర్చుకునేందుకు సర్కారు ఆయుధాగారాలపై, పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం... మరి ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి కదా... కాబట్టి బ్రిటిష్ బ్యాంకుల్ని, సంపన్నుల్ని, ప్రభుత్వ ఖజానాని లూఠీచేసి నిధుల్ని సమీకరించడం- ఇవీ హెచ్‌ఆర్‌ఏ లక్ష్యాలు.
అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిపోయారు బిస్మిల్ తదితరులు.
రైలుదోపిడీ!
9 ఆగస్టు 1925. రాత్రి ఏడయింది.

నవంబర్ 8 డౌన్ పేరుగల రైలు షాజన్‌పూర్ నుంచి లక్నోకి బయలుదేరింది. ఇంజిన్ వెనుక బోగీలో గార్డ్ ఉన్నాడు. ఆ వెనుక కళ్లు జిగేల్‌మనే నోట్ల కట్టలున్నాయి. ప్రజల్ని పీడించి పన్నుల రూపంలో వసూలు చేసిన సర్కారు సొమ్మది. పోలీసు పహారాలో ఉన్న ఆ డబ్బు మూటలకై మాటు వేసింది బిస్మిల్ సేన. ఏమీ ఎరుగని ప్రయాణికుల్లా రెలైక్కేశారు విప్లవకారులు.

రైలు కాకోరి స్టేషన్‌కి చేరింది. అంతే... ఒక్కసారిగా చెయిన్ లాగారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, కేశవ చక్రవర్తి తదితర వీరులు పోలీసుల్ని చుట్టుముట్టారు. జర్మనీలో తయారైన మాసర్ సి 96 ఆటోమాటిక్ పిస్టళ్లతో దాడి చేశారు. డబ్బుని కాజేసి క్షణంలో చీకట్లో కలిసిపోయారు.

ఇది చిన్న ఘటనే. కాని బ్రిటిష్‌వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దీన్ని ఉపేక్షిస్తే తెల్లారేసరికి ఇది వైరస్‌లా దేశమంతా పాకుతుందని తెల్లవారికి అర్థమైపోయింది. ఈ దోపిడీలో పాల్గొన్నది 10 మందే కాని సర్కారు ఏకంగా 40 మందిపై కేసు పెట్టింది. రెండునెలలు తిరక్కుండా దాదాపు అందర్నీ అరెస్టు చేసింది. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్‌ని మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.

వాస్తవానికి కేశవ్ చక్రవర్తిని కూడా పోలీసులు చేజిక్కించుకోలేకపోయారు. కాకపోతే- రోషన్‌సింగ్ అచ్చం కేశవ్ చక్రవర్తిలాగానే ఉండేవాడు. పైగా ఇద్దరి వయసూ దాదాపు ఒకటే. దాంతో రోషన్‌సింగ్‌ను కుట్రలో ఇరికించారు ఆంగ్లేయులు. వాస్తవానికి కాకోరి రైలు దోపిడీలో రోషన్ నేరుగా పాల్గొనలేదు. అయినా తనపై దొంగకేసు బనాయించినందుకు బాధపడలేదు. పైగా సంబరపడ్డాడు- మాతృదేశ రుణం తీర్చుకునే అవకాశం చిక్కినందుకు!

అలా అప్పుడు త్రుటిలో బయటపడ్డ కేశవ్ చక్రవర్తి అసలు పేరు- కేశవ్ బలిరాం హెగ్డేవార్. 1925లో నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ని స్థాపించింది ఈయనే! రోషన్‌సింగ్ బలిదానం పుణ్యంగా - జాతీయ స్పృహకు అంకితమైన ఓ సంస్థ ఆవిర్భవించిందన్నమాట!
కాకోరి కుట్రకేసు విచారణ ఏడాదిన్నర సాగింది. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రోషన్‌సింగ్, రాజేంద్రలాహిరి- ఈ నలుగురికీ మరణశిక్ష విధిస్తూ లక్నో కోర్టు తీర్పునిచ్చింది.

దీనిని వ్యతిరేకిస్తూ ఆసేతు హిమాచలం నిరసనలు వెల్లువెత్తాయి. మున్షీ ప్రేమ్‌చంద్‌లాంటి రచయితలు, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహ్మదాలీజిన్నా, మదన్ మోహన్ మాలవీయ లాంటి జాతీయ నాయకులు శిక్షను కనీసం యావజ్జీవంగానైనా మార్చమని బ్రిటిష్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయినా శంఖమే అయింది. ఉరిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిస్మిల్‌ను గోరఖ్‌పూర్ జైలుకి, రోషన్‌సింగ్‌ని అలహాబాద్ జైలుకి, అష్ఫఖుల్లాఖాన్‌ని ఫజియాబాద్ జైలుకి, రాజేంద్ర లాహిరిని గోండా జైలుకి తరలించారు.

మరణమంటే భయపడని వారుంటారా? ఉంటారు... ఇదిగో ఈ నలుగురే! మరో ఇరవై రోజుల్లో తమకు ఉరి ఖాయమని తెలుసు. అయినా వారిలో కించిత్ బాధ లేదు. దేశం కోసం, తరతరాల భారతీయుల స్వేచ్ఛకోసం ... బలిపీఠం ఎక్కుతుంటే శోకం దేనికి? ఇదీ వారి అంతరంగం. మరణానికి ముందు హుకాంకి రాసిన ఉత్తరంలో ‘‘నేను ఉదాత్త ఆశయం కోసం మరణిస్తున్నాను. వద్దు... కన్నీరు కార్చొద్దు’’ అని అంటాడు రోషన్ సింగ్.

రాజేంద్ర లాహిరి చివరి రోజుల్లో ఉపనిషత్తుల్నీ వివేకానంద సూక్తుల్ని చదువుకుంటూ ఉత్సాహంగా గడిపేవాడు. బిస్మిల్ జైల్లోనే ఉండి తన ఆత్మ కథ ‘సర్ఫరోషీ కీ తమన్నా’ (దేశభక్తుడి కోరిక) రచించాడు. ఉరికి ముందురోజు ఉరకలేసే ఉత్సాహంతో తల్లితో సంభాషించాడు. ఇక అష్ఫఖుల్లాఖాన్ అయితే జైల్లో ఖుషీగా గడిపాడు. చావుకి ముందురోజు ఖాన్‌ని భగత్‌సింగ్ కలిసినప్పుడు ‘రేపే నా పెళ్లి’ అంటూ తుళ్లుతూ మాట్లాడాడు.

17 డిసెంబర్ 1927న రాజేంద్ర లాహిరినీ, 19న మిగిలిన ముగ్గురినీ ఉరితీశారు. భగవద్గీత వల్లెవేస్తూ బిస్మిల్, ఓంకార ప్రార్థన చేస్తూ రోషన్, అల్లాను ప్రార్థిస్తూ ఖాన్ బలిపీఠమెక్కారు. వందేమాతరం అంటూ బిగ్గరగా అరుస్తూ ఉరితాడుని ముద్దుపెట్టుకుని తుదిశ్వాస విడిచారంటే ... తల్లి భారతి అంటే వారికెంత పిచ్చి ప్రేమో తెలుస్తుంది.
అందులో వందోవంతు కూడా మనకు లేకపోతే - వారి త్యాగాలు వృథా! మన బతుకులు వృథాకు మించిన వృథా!!

సరిగ్గా నేటికి 120 ఏళ్ల కిందట- 1892 జనవరి 22న - ఠాకూర్ రోషన్‌సింగ్; ఆపై అయిదేళ్లకు 1897 జూన్ 11న రాంప్రసాద్ బిస్మిల్, ఆపై మూడేళ్లకి 1900 అక్టోబర్ 22న అష్ఫఖుల్లాఖాన్ జన్మించారు. ఈ ముగ్గురూ పుట్టింది ఒకేచోట... మరణించిందీ ఒకేరోజున! వీరికి రాజకీయ లౌక్యాలు, సైద్ధాంతిక చర్చలూ తెలీవు. తెలిసిందల్లా ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టడమే!

ఆకెళ్ల రాఘవేంద్ర

21, జనవరి 2012, శనివారం

ఎవరు గొప్ప? ( చిట్టి కథ)


అనగనగా రెండు కాకులు. బోలు, గోలు వాటి పేర్లు. రెండూ మంచి మిత్రులు. ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని చిన్న వాదన మొదలైంది. చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్తా పెరిగి పెద్దై, ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది.చివరికి ఆ రెండూ ఓ పందెం వేసుకున్నాయి. రెండూ కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి. ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప. అయితే ఉట్టిగా ఎగరడం కాదు, ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట!

ఈ రెంటిలోనూ బోలు కొంచెం గడుసైనది. గోలు కాస్తంత అమాయకురాలు. బోలు ఏం చేసిందంటే - ఒక సంచిలో కొన్ని దూది ఉండలు, మరో సంచిలో ఉప్పురాళ్లు పెట్టి, వాటిని మూటల్లా కట్టింది. దూది సంచినేమో తను తీసుకుంది, ఉప్పుమూట కట్టిన సంచిని గోలు కిచ్చింది. 
సరే, రెండూ ఎగరడం ప్రారంభించాయి. బోలు ముక్కుకున్న సంచి తేలికగా ఉండటంతో అది సునాయాసంగా ఎగరసాగింది. చూస్తుండగానే గోలును మించిపోయింది. దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లిపోయింది. 

ఇంతలో వర్షం కురవడం మొదలైంది. బోలు ముక్కుకున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది. గోలు ముక్కుకున్నది ఉప్పుమూట కావడాన వానకు ఆ ఉప్పంతా కరిగి, తేలిగ్గా మారిపోయింది.

దాంతో బోలు ఆయాసంతో వెనకపడిపోతే, గోలు మాత్రం సులువుగా ఎగిరి పైపైకి వెళ్లిపోయింది. విజేతగా నిలిచింది. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయింది బోలు పరిస్థితి!
నీతి: మోసంతో తాత్కాలికంగా గెలవచ్చేమో కాని, అంతిమ విజయం మాత్రం న్యాయానిదే!

బాచి

చలి ఒకటి కాదు...


అనునాదం/ resonance
తెల్లవారుజామున ఇంటి ముందర పూసిన పసుపు మందార రేకులను నగ్నంగా వొణికించే చలి ఒకటి కాదు. ముగ్గు వేయడానికి వొంగి, నేల చెంపను నిమిరి, మునివేళ్ల కొసలతో ముత్యాలను కూర్చే గృహిణి చెంపలను కోసే చలి ఒకటి కాదు. మేజోళ్లు లేని పాదాలను గట్టిగా అదిమి పట్టి, పాఠాలకు కదిలిపోయే తలస్నానపు అమ్మాయి పెదాలను పిండే చలి ఒకటి కాదు. పేపరూ టీని అల్లాగే ఉంచి రగ్గు కప్పుకొని నిదురించే మొద్దుమనిషికి ఎడమై ఏం చేయాలో తోచక, ఎగాదిగా చూసే చలి ఒకటి కాదు. రాత్రంతా మేలుకొని అప్పుడే కునుకుపట్టి చెట్టు మొదలుకు చేరి కాళ్లు ముడుచుకుంటున్న కుక్క ప్రేవులలో దూరి కరుకుగా నమిలే చలి ఒకటి కాదు. మరికాసింతలో మొదలుకానున్న రొదలో చిల్లర

ఏరుకునేందుకు జోలె సర్దుకుంటున్న బిచ్చగాని పాత్రలో చిత్రంగా చుట్టలు చుట్టే చలి ఒకటి కాదు. ఆ రాత్రి ఏమవుతుందోనని తెల్లవార్లూ నలిగి ఆస్పత్రి బయట కన్నతండ్రి ఒకడు భయం భయంగా తాగే టీనీళ్ల పొగలను తేలిగ్గా తుంచే చలి ఒకటి కాదు. ఏ తల్లి బిడ్డో ఏ తండ్రి గుండెల మీద పెరిగిన కొడుకో నగరానికి చేరి అగచాట్లకు సోలి దారిపక్క పడుకుంటే కనికరం మరిచి ఛాతీ మీద చరిచి గజగజమని లేపే చలి ఒకటి కాదు. గూర్ఖాలు కాసే శ్రీమంతుల ప్రహరీ పక్కన విధిలేక ఓడించలేక లోనికి పోలేక నిస్సహాయంగా జారి బొరోమని ఏడ్చే చలి ఒకటి కాదు. మొగుడి ఆలింగనంలో మరోసారి కరుగుతున్న ముదిత కొనగోటిపై ముసిముసిగా నవ్వుతూ దుప్పటి సరిగా లాగే చలి ఒకటి కాదు.

కొనప్రాణాల పంట కళ్లు తెరిచిందేమోనని ఆశగా పరిగెత్తే రైతు కండువను- అయితే మంచుతో, కాకుంటే కన్నీళ్లతో- తడిపే చలి ఒకటి కాదు. అమ్మానాన్నలను ఒదిలి, ఆవలి దేశాలలో ఉండి, అప్పుడప్పుడు పలికే ఒక్కగానొక్క నలుసు ఇష్టమైన జ్ఞాపకాన్ని కష్టంగా మోసుకొచ్చే చలి ఒకటి కాదు. గిరిజనుడి గుడిసెలో దౌర్జన్యంగా దూరి తినడానికి దొరక్క పసిబిడ్డను కొరికే చలి ఒకటి కాదు. కాన్వెంటుకు వెళుతూ పిల్లలు చేతులు చాస్తే బస్సు పక్కన నుంచి జిల్లున పట్టుకు ఊపే చలి ఒకటి కాదు. తడిసిన ఇసుక వొడ్డుని, పచ్చగడ్డికి కూడా నోచని బీడు మైదానాన్ని, దట్టమైన అడవి మధ్యన గుట్టుచప్పుడు కాకుండా పారే సెలయేటి మువ్వల పాదాలని తాకి- తడిమి- నిమిత్తం లేనట్టుగా తరలిపోయే చలి ఒకటి కాదు.

ధ్వజస్తంభపు కలశాన్ని, ప్రాణం కొట్టకలాడే మసీదు పావురపు కంఠాన్ని, చర్చి గంట సృష్టించే కరుణాతరంగాల మృదు లయని చూసే- చూపే- చలి ఒకటి కాదు. ఒక పేట పెరడులోని జామచెట్టు ఆకుని, మరో అగ్రహారంలోని తులసిమొక్క గూటిని, ఇంకో వీధిలోని మర్యాదస్తుల నందివర్థనపు గేటుని పరామర్శించే చలి ఒకటి కాదు. నిన్నటి వరకూ బాగున్న మిత్రుడు ఈ పూట పోయాడని తెలిస్తే ఊరికూరికే ఉబికి వచ్చే కన్నీటి బిందువుల పై పోనీలెమ్మని మూగే చలి ఒకటి కాదు. వీధుల చివర, చీకటి మాటున, హొటేళ్లలో, నట్టింటికి కూడా పిలిస్తే వచ్చే పక్క మీదకు వచ్చే పైసల కోసం వచ్చే ఆడదొకత్తి ఎవరైనా చూసే లోపల నిద్రకళ్లతో హడావిడిగా వీధిలోకి అడుగుపెడుతుంటే వీపున సిగ్గుగా భయంగా అసహ్యంగా జుగుప్సగా హేళన చేస్తూ చరిచే చలి ఒకటి కాదు.

అవును కాదు.
చలి ఒకటి కాదు.
ఏ మనిషీ ఒకటి కానట్టే, ఏ మనిషి చెవి ముక్కు నోరూ నుదురు ఒకటి కానట్టే, ఏ మనిషి కులమూ మతము ప్రాంతమూ భాష యాస తినే తిండి అలంకరించుకునే గడప ఒకటి కానట్టే, ఏ మనిషి చదువు ఒకటి కానట్టే, ఏ మనిషి మోసే మోతల బరువు ఒకటి కానట్టే, ఏ మనిషి దాచుకున్న సంపద ఒకటి కానట్టే, ఏ మనిషి సంస్కారం ఒకటి కానట్టే, ఏ మనిషి రాక్షసత్వం ఒకటి కానట్టే, ఏ మనిషి నిదురించే మరుభూమి ఒకటి కానట్టే, ఏ మనిషి జోడించే చేతులు ఒకటి కానట్టే, మనుషులంతా ఒకటి కానట్టే, మనుషులంతా ఎప్పటికీ ఒకటి కానట్టే-
చలి ఒకటి కాదు.
కానే కాదు.

- ఖదీర్

20, జనవరి 2012, శుక్రవారం

ఖడ్గధారి ధీర నారి


రాలిన మొగ్గలు
'... అప్పుడు ఝాన్సీలక్ష్మీబాయి యుద్ధరంగంలో బ్రిటిష్ సేనలతో భీకరంగా పోరాడుతోంది. అంతలో అకస్మాత్తుగా ఓ ఆంగ్ల సైనికుడు కత్తి ఆమె ఛాతీకింద పొడిచాడు. రక్తం ధార కట్టింది. అయినా పులిలా రాని తిరగబడి అతణ్ణి చంపేసింది. మెరుపువేగంతో మరో బ్రిటిష్ సైనికుణ్ణి హతమార్చింది. అంతలో ఓ బుల్లెట్ ఆమె తొడలో దిగబడింది.

ఎడమచేత్తో ఆ గాయాన్ని అదిమి పట్టుకుని కుడిచేతి కరవాలంతో ఆ తెల్లవాడిని నరికింది. కానీ ఒకేసారి నలుగురు శత్రుసైనికులు ఆమెను చుట్టుముట్టారు. తలపై ఒకడు వేటు వేశాడు. ఆమె కుడికన్ను వెలికి వచ్చింది. అయినా రాణి ఊపిరి బిగపట్టి ఒకడి భుజాన్ని ఛిద్రం చేసింది. చివరకు వారంతా మూకుమ్మడిగా ఆమె దేహాన్ని తునాతునకలు చేశారు. విలవిల్లాడుతూ లక్ష్మీబాయి నేలకొరిగింది’’ఇదీ వీరనారి అంతిమ పోరాట దృశ్యం.


ఆమె బతికింది 23 ఏళ్లే. అయితేనేం... ఆమె జీవితం ఓ ఒరవడి, సాహసం, ఓ ఉదాహరణ. ఆమె ఝాన్సీకి మహారాణి... కానీ సదా అవరోధాలు, అవమానాలు ఆమెను వెంబడించాయి. అయినా ప్రాణం ఉన్నంతవరకు పోరాడిందామె. కష్టాలకు కుంగిపోకుండా రెట్టించిన పట్టుదలతో యుద్ధం చేయడమే జీవితమని నిరూపించిన ధీరనారి లక్ష్మీబాయి.

గాలిపటంలా...
అది వారణాసి. ప్రసిద్ధ శైవక్షేత్రం. అక్కడ రాజశ్రీ మోరోపంత్ తాంబే అనే మరాఠా బ్రాహ్మణుడు నివసిస్తూండేవాడు. అతని భార్య భాగీరథి. వారికి 1835 నవంబర్ 19న ఓ ఆడపిల్ల జన్మించింది. మణికర్ణిక అనే పేరు పెట్టారామెకు. కోలమొహం, కొనదేలిన ముక్కు, కట్టిపడేసే వెడల్పయిన కళ్లు, విశాలమైన నుదురు... చూడముచ్చటగా ఉండేదా పాప. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారంతా!

మనుకి నాలుగేళ్లు నిండకుండానే అమ్మ కన్నుమూసింది. తల్లిలేని పిల్లను ఎలా పెంచాలో తెలీలేదు మోరోపంత్‌కి. ఒంటరిగా కాశీలో ఉండడం కష్టమనిపించింది. కూతురితో కలిసి తమ బంధువులంతా ఉండే బిఠూర్ (ఉత్తరప్రదేశ్)కి మకాం మార్చాడు. పీష్వా రెండో బాజీరావు ఆశ్రయం పొందాడు. అక్కడి యాగశాలకు అధిపతిగా కొత్తజీవితం ప్రారంభించాడు.

మణికర్ణిక బాల్యమంతా గడిచింది బిఠూర్‌లోనే. రోజూ తనతో మనుని యాగశాలకు తీసుకెళ్లేవాడు మోరోపంత్. అక్కడ పదులకొద్దీ యువకులు ఉదయం పూట వేదాలు వల్లెవేసేవారు, సాయంవేళ శారీరక కసరత్తులు చేసేవారు. ఆ యాగశాలే ఆరేళ్ల మనుకి పాఠశాలయ్యింది. ఆ మగపిల్లలే ఆమెకు స్నేహితులు. వారితోనే కలిసి తిరగడం... తినడం.... ఆడడం! ఏ నిర్బంధాలూ లేకుండా గాలిలో గువ్వపిల్లలా ఎదిగింది. ఆ వేదనాదాలు, వ్యాయామాలూ ఆ చిన్నపిల్ల మనసుపై చెరగని ముద్ర వేశాయి.

ఆ చిన్నవయసులోనే తానూ యుద్ధవిద్యలు నేర్చుకోవాలని తహతహలాడిపోయేది మను. పీష్వాబాజీరావు పెంపుడు కొడుకు నానా సాహెబ్, అతడి అన్న కొడుకు రావుసాహెబ్- సాముగరిడీలు చేస్తుంటే- కళ్లు విప్పార్చుకుని చప్పట్లు చరుస్తూ ఎగిరి గంతులేస్తూ- హుషారెక్కి పోయేది మను.

ఓ రోజు రావుసాహెబ్ పట్టపుటేనుగు ఎక్కి దర్జాగా వెళ్తున్నాడు. తననూ ఎక్కించుకోమని బతిమాలింది మను. ‘‘నువ్వు చిన్నపిల్లవు, పైగా ఆడపిల్లవు’’ అంటూ ఎగతాళి చేశాడు రావుసాహెబ్. వెక్కిరింతగా నవ్వాడు పక్కనే ఉన్న నానాసాహెబ్. దాంతో రోషం తన్నుకొచ్చి భళ్లున ఏడ్చేసింది మణికర్ణిక. కానీ ఆ అవమానమే ఆమెలో పౌరుషాన్ని రగిలించింది. ఎప్పటికైనా అంబారీ ఎక్కాలని, గుర్రమెక్కి కరవాలాన్ని థళథళా మెరిపించాలని, సైనికవిద్యలు నేర్చుకోవాలని బలంగా అనుకుంది.

తనకు సామువిద్యలు నేర్పమంటూ ఓసారి ఏకంగా బాజీరావునే అడిగింది. ముద్దుగా ఉండే మణికర్ణిక అంటే ఆయనకు ప్రాణం. ఛబిలి( అందమైనది) అంటూ ప్రేమగా ఆ పాపను పిలుచుకునేవారాయన. అలాంటి మను ముచ్చటను ఆయనెందుకు కాదంటారు? అందుకే ఆమెకు - కర్ర, కత్తిసాము, విలువిద్య, గుర్రపుస్వారీలలో- ఆ వయసుకు తగ్గంత - తర్ఫీదు ఇవ్వడం మొదలెట్టారాయన!

పెళ్లితో కష్టాలు!
ఆరోజుల్లో ఝాన్సీ- ఉత్తరప్రదేశ్‌లోనే కాదు- దేశంలోనే పటిష్ఠమైన కోట. ఝాన్సీ మహారాజు గంగాధరరావుకు భార్య చనిపోయింది. పిల్లలు లేరు. రెండోపెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. పండితులకు మణికర్ణిక విషయం తెలిసింది. మంతనాలు చేశారు. జాతకాలు కుదిరాయి. అష్టవర్షాత్ భవేత్ కన్యా అంటూ ఆడపిల్లకు ఎనిమిదేళ్లకే పెళ్లి చేసేసే ఛాందసపు రోజులవి. అందుకే ఏడేళ్ల మనుకి 29 ఏళ్ల గంగాధరరావుతో 1842లో ఝాన్సీలో వివాహమైంది.

అత్తవారు మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మార్చారు. పేరుతోపాటు ఆమె తలరాత కూడా మారింది. అత్తింటి ఆరళ్లు లేవుకానీ పెళ్లంటేనే ఏమిటో తెలీని వయసులో బాధ్యతలు నెత్తిన పడటమే అసలు సమస్య! ఆ పసిపిల్లకు - నోములు, వ్రతాలు, పురాణ కాలక్షేపాలు, అధికారిక లాంఛనప్రాయ సేవలు, పతివ్రతాపూజలు..! రాజభవంతులు విశాలమే అయినా కట్టిపడేసే కట్టుబాట్లు... రాణివాసమే అయినా కారాగారవాసం లాంటి బతుకు...! దానికితోడు భర్త గంగాధరరావుది వింతప్రవృత్తి. మహారాజే అయినా ఒక్కోసారి ఆయన ఆడవారిలా ప్రవర్తించేవాడు. చీర కట్టుకునేవాడు. గాజులు వేసుకునేవాడు. లక్ష్మీబాయిని గదిలో ఉంచి తాళం వేసేవాడు. మహిళా సైనికుల్ని కాపలా పెట్టేవాడు. అన్నింటినీ మౌనంగా భరించింది లక్ష్మీబాయి.

అయితే లక్ష్మీబాయి యుక్తవయసుకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆమె మహారాణి హోదాను అనుభవించడం మొదలైంది. రోజూ ఉదయం పూట రెండుగంటలపాటు సుగంధద్రవ్యాలతో స్నానం... ఆపై తెల్లని చందేరీ పట్టుచీర... నడుముకు బంగారు సరిగంచు వస్త్రం, మెడలో పులుకడిగిన ముత్యాల వరుస, చేతివేళ్లకు వజ్రపుటుంగరాలు... దర్జాగా సాగిందామె జీవితం.

అడుగడుగునా అవమానాలు
అంతలో 16వ ఏట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మీబాయి. గంగాధరరావు తెగసంబరపడిపోయాడు. లేకలేక 38 ఏళ్ల వయసులో పుత్రుడు పుట్టాడన్న సంతోషమది. అంతేకాదు ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో అది మరీ ఉద్వేగం. ఎందుకంటే ఆ రోజుల్లో రాజుకి పుత్రసంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని కైవసం చేసుకునేవారు ఆంగ్లేయులు. రాజ్యసంక్రమణ సిద్ధాంతం అనే సాకుతో సదరు రాజ్యంపై సర్వహక్కుల్నీ బ్రిటిష్‌వారు తమకు తాము ధారాదత్తం చేసేసుకునేవారు. అంతఃపురాల్లోని వెండి, బంగారు సామగ్రిని, చీనీచీనాంబరాల్ని, నగల్ని లాక్కొనేవారు.

కొడుకు పుట్టడంతో ఆ ఆపద కూడా తొలగింది కదా అన్నది గంగాధరరావు సంబరానికి అసలు కారణం! కానీ ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. పుట్టిన మూడు నెలలకే ఆ బిడ్డ కన్నుమూశాడు. లక్ష్మీబాయి ఎంతలా ఏడ్చిందో అంతులేదు. గంగాధరరావు మానసికంగా కుంగిపోయి మంచాన పడ్డాడు. ఆయన బతికి బట్టకట్టాలంటే తగిన కుర్రాడిని దత్తత తీసుకోకతప్పదని అర్థమైంది. 1853 నవంబర్ 20న దామోదరరావు అనే అయిదేళ్ల బాలుడిని దత్తత స్వీకరించారు గంగాధరరావు. ఆ దత్తతను ఆమోదించమని అభ్యర్థిస్తూ బ్రిటిష్‌వారికి అర్జీపెట్టుకున్నారు. కాని వారి కబురు తెలిసేలోపు ఆయన మరణించారు.

భర్త మరణించాక ఝాన్సీలక్ష్మీబాయికి కష్టాల మీద కష్టాలొచ్చాయి. బ్రిటిషర్లు ఆమెను తీవ్రంగా బాధపెట్టారు. దత్తత చెల్లదన్నారు. ఝాన్సీపై ఆమెకు హక్కులేదన్నారు. భర్త వదిలి వెళ్లిన వ్యక్తిగత స్థిరచరాస్తులు ఆమెకు చెందవన్నారు. ఖజానా అప్పుల్ని మాత్రం ఆమే తీర్చాలన్నారు. అయిదు వేల రూపాయల భరణాన్ని బిచ్చంగా వేస్తామన్నారు. పరోలా జాగిర్దారు, ఓర్జా రాణి, దాంతియా రాజుల్ని లక్ష్మీబాయిపై ఉసిగొల్పారు. చివరకు ఝాన్సీనే ఆక్రమించుకుంటున్నట్లు ప్రకటించారు.

మొదట ‘మేరీ ఝాన్సీ దూంగీ నహీ’ అంటూ హూంకరించింది లక్ష్మీబాయి. కానీ బ్రిటిష్‌వారి దౌష్ట్యాలకు తలొగ్గక తప్పలేదు. ఝాన్సీ కోటపై తెల్లవారి కేతనం చూసేసరికి రాణి గుండె తరుక్కుపోయింది. రాజవంశానికి ఇలవేల్పయిన మహాలక్ష్మి దేవాలయాన్ని బ్రిటిషర్లు భ్రష్టుపట్టించారు. ప్రజల్ని హింసించడం మొదలుపెట్టారు. రానురాను ఆంగ్లేయుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తనను తెల్లవారు వెంటాడి, వేటాడి వేధించినా భరించింది కానీ రాజ్యానికి, ప్రజలకు, అంతకుమించి ధర్మానికి, సంఘానికి కష్టాలు దాపురించడంతో ఇక ఆమె ఉపేక్షించదలచుకోలేదు.

ఆఖరిపోరాటం...
అంతవరకూ ఆమెలోని అంతర్గత చైతన్యం, నిద్రాణమైన పౌరుషం, అచేతనంలోని మహాశక్తి మేల్కొన్నాయి. ఆడదాన్నని, వయసు, అనుభవం, ఆస్తి లేవని, నా అన్నవాళ్లు లేరని... ఇలా తనకు తానే వేసుకున్న శృంఖలాన్ని ఆమె ఛేదించింది. అప్పటికే 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశం అతలాకుతలమై పోతోంది. బ్రిటిష్‌వారిపై పోరాడుతున్న నానా సాహెబ్, రావు సాహెబ్, తాంతియా తోపే లాంటి వీరులతో చేతులు కలిపింది. ఆ ఉమ్మడిపోరుకి ఆమే సైనిక సలహాదారు, వ్యూహకర్త. చిన్నప్పుడు ఆడపిల్లవు అంటూ గేలి చేసిన అదే రావు సాహెబ్, నానా సాహెబ్ ఇప్పుడు లక్ష్మీబాయినే ఏరికోరి నాయకురాలిగా ఎన్నుకున్నారు. దటీజ్ ఝాన్సీ లక్ష్మీబాయి!

బ్రిటిష్‌వారితో అమీ తుమీ తేల్చుకోవాలని నిశ్చయించుకుంది. గ్వాలియర్ యుద్ధానికి సన్నద్ధమయ్యింది. చాన్నాళ్ల తర్వాత కసరత్తులు, కర్ర, కత్తిసాములు మొదలెట్టింది. ఉదయాన్నే కుస్తీ పట్టేది. బరువులు ఎత్తేది. గుర్రపుస్వారీ చేసేది. సామాన్యుల్ని సంఘటిత పరిచేది. ఫిరంగుల దళంలో మగవారితో పాటు మహిళలకూ శిక్షణనిచ్చేది. యుద్ధంలో మరణించినవారి కుటుంబాల్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చింది.
తుదిపోరుకు తెర లేచింది.

1858, ఏప్రిల్ 4. శుక్లపక్ష ఏకాదశి.. అర్ధరాత్రి. ఎర్ర కుర్తా, తెల్ల చుడీదార్, కుచ్చు తలపాగా, ఒళ్లంతా కవచం, శిరస్త్రాణం, ఒరలో రెండు పిస్టళ్లు, నడుముకు కత్తులు, వీపుకి పదేళ్ల దత్తపుత్రుడు దామోదర్, సంచిలో డబ్బు, కొడుకు పాలు తాగే వెండి లోటా, వెనుక 300మందికి పైగా అఫ్గాన్ రౌతులు, పార సైన్యం... ఇంత పకడ్బందీగా తనకిష్టమైన గుర్రం ‘సారంగి’ని ఎక్కి, సమరానికి బయల్దేరింది లక్ష్మి.
నూటరెండుమైళ్లు ఆగకుండా ఏకబిగిన ప్రయాణం చేసింది. మార్గమధ్యంలో వందలాది మందిని ఎదుర్కొంటూ, నరుక్కుంటూ కదనరంగానికి చే రుకుంది.

రెండు నెలలు భీకరంగా పోరాడింది. బ్రిటిష్‌వారి బలం, బలగం ముందు తాను సరిపోనని ఆమెకు తెలుసు. కొడుకును జాగ్రత్తగా చూసుకోమని తోటివారికి అప్పగించింది. ఇక తనకేమైనా ఫరవాలేదన్న తెగింపుతో యుద్ధం చేసింది. 1858, జూన్ 17న రోజు రోజంతా తెల్లసేనను చీల్చి చెండాడింది. బ్రిటిష్‌వారు కుయుక్తులు పన్నారు. వెన్నుపోటు పొడిచారు. చివరకు- అదేరోజు- చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడి... మరణించింది లక్ష్మీబాయి. విజయం అంటే గెలవడమే కాదు, పోరాడడం!

ఆకెళ్ల రాఘవేంద్ర

19, జనవరి 2012, గురువారం

మీరు ఏడవరా.. ప్లీజ్! మేం ఓదారుస్తాం..!

అపుడెప్పుడో మన సమాజం అంతా కలిసికట్టుగా వున్నప్పుడు మానవ సంబంధాలు మరీ ఇంతగా మట్టికొట్టుకుపోకమునుపు మనందరికీ ఓ అలవాటు వుండేది. ఎవరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ పాలుపంచుకోవాలి. సంతోషంలో పాలు పంచుకోకపోయినా ఫరవాలేదు కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా పాలుపంచుకోవాలి. ఎవరింట్లోనైనా ఎవరైనా పోతే విధిగా వెళ్లి వాళ్ళని పలకరించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పిరావడం అప్పట్లో ఆనవాయితీ. అలా వెళ్లి పలకరించకపోతే చాలా తప్పుగా భావించేవాళ్ళు.
దగ్గరి బంధువులు వెంటనే వెళ్లి వాలిపోయేవాళ్ళు. దూరం బంధువులు ఏ పదో రోజుకో వెళ్ళేవాళ్ళు. ఇంకాస్త దూరపు బంధువులు ఇంకాస్త ఆలస్యంగా ఆరునెలల తరువాత వెళ్ళేవాళ్ళు. ఇంకా మిగిలిపోయినవాళ్ళు ఏడాదికో రెండేళ్ళకో వెళ్ళేవాళ్ళు. ఎన్నాళ్ళకి వచ్చారు అన్నది కాదు కొచ్చను. అసలొచ్చారా లేదా అన్నది పాయంటు. ఆలస్యంగా వచ్చినా పట్టించుకునేవారు కాదు గానీ అసలు వెళ్ళకపోతే మాత్రం వాళ్ళని బ్లాక్ లిస్టులో పడేసేవాళ్ళు.. ఆ తరువాత ఆ పరామర్శించనివాళ్ళు పదిమందికీ సంజాయిషీ ఇచ్చుకోలేక సతమతం అయిపోయేవాళ్ళు.
ఒకవేళ వీలుగాక వెళ్ళలేకపోయిన వారి ఇంట్లో శుభ కార్యం కనక తలపెడితే అప్పుడుండేది అసలు తమాషా. అప్పుడు వాళ్ళకి కష్టం కలిగినప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మనింట్లో శుభానికి ఎలా పిలుస్తాం? అనుకుని అప్పుడు వెళ్ళి ఓదార్చి వచ్చి వారం రోజులయ్యాక అప్పుడు మళ్ళీ వెళ్లి శుభకార్యానికి ఆహ్వానించేవారు. అలా ఆలస్యంగా వెళ్లి ఓదార్చేవాళ్ళు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇలా తాము ఓదార్చడానికి వస్తున్నట్లు ముందే కబురు పెట్టేవాళ్ళు. వాళ్ళుకూడా సిద్ధంగా వుండేవాళ్ళు. వీళ్ళని చూడగానే ఎప్పుడో పోయిన మనిషి అప్పుడే పోయినట్టు ఇంట్లోని ఆడవాళ్ళు శోకాలు పెట్టేవాళ్ళు. వీళ్ళు ఊరుకో అమ్మా గుండె రాయి చేసుకో అని నిజాయితీగా ఓదార్చేవాళ్ళు. అక్కడితో ఒక పని లాంఛనంగా పూర్తి అయ్యేది. ఏడిచిన వాళ్ళూ ఖుష్.. ఓదార్చినవాళ్ళు ఖుష్.. వో పది నిముషాలు మొక్కుబడిగా ఏడుపులు ఓదార్పులు అయ్యాక మామూలుగా నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. ఇవన్నీ పాత పద్ధతులు ఆచారాలున్నూ.
ఎన్నో పాత ఫేషన్లు అలవాట్లు భూమి గుండ్రంగా వుంది అన్నట్లు ఓ రౌండ్ వేసి మళ్ళీ వచ్చాయి. అడ్డిగలు కాసుల పేర్లూ వంటి నగలు మళ్లీ ఫాషనైపోయాయి.
మధ్యలో మానేసిన వేడుకలు మళ్లీ వచ్చాయి. అందులో భాగంగా ఓదార్పులు కూడా యమ ఫాషనైపోయాయి. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ పద్ధతి కాస్త మారింది. కాస్తేం ఖర్మ బాగానే మారింది. పూర్తిగా ఉల్టా అయిపోయింది. అప్పుడు ఎవరికైనా కష్టం కలిగితే వాళ్ళింటికి మిగిలినవారంతా వెళ్లి ఓదార్చేవారు. ఇప్పుడేమో కష్టం వచ్చినవారే అందరినీ ఇంటింటికి వెళ్లి మరీ ఓదారుస్తున్నారు. అదీ ఏ వారమో పది రోజులో కాదు.. ఏళ్ళ తరబడీ ఓదారుస్తూనే ఉన్నారు. వూరూరా తిరుగుతూనే వున్నారు వోపిగ్గా.. కానీ ఏం లాభం?!
ఎక్కదలచుకున్న రైలు జీవితకాలం లేటు అన్నట్టు వుంది ఇదంతా. మహారాజుగారు సింహాసనం మీద వుండగా యువరాజా వారు ఊరూరా తిరిగి జనం కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటే అర్థంవుంది. వాళ్ళ సమస్యలు తండ్రిగారితో చెప్పి పరిష్కరిస్తే జనానికి ప్రయోజనం చేకూరేది. అప్పుడు ఊరుకుని రాజుగారు కాలధర్మం చెందాక సింహాసనం వేరొకరి పాలయ్యాక మాజీ యువరాజు పొజిషనుకి జారిపోయి ఎవరూ లెక్కపెట్టని స్థితికి వచ్చాక అప్పుడు జనంలోకి వెళ్లి వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ తలా చెంపలు వాచిపోయేలా నిమురుతూ ఓదారిస్తే ఏం వొరిగి పడుతుంది? తామే పీకల్లోతు సమస్యలలో కూరుకుపోయి వుంటే ఇక ఎదుటి వారిని ఎందుకు ఓదార్చటం?? అసలిది ఓదార్చటమా?! వోదార్పు పొందే ప్రయత్నమా?
ఇవన్నీ ఏం చెయ్యాలో తోచక చేసే పన్లు తప్పితే ఓదార్పులవల్ల దమ్మిడీ లాభం లేదు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి గానీ ఉత్తుత్తి మాటలు చెప్పి ఓదార్చేసాం అని గొప్పలు పోతే ఎట్లా? పోనీ తమ దగ్గర బోలెడంత డబ్బుంది కదా.. అందులోంచి దమ్మిడి బయటికి తియ్యరు ఎవరికీ పొరబాటున అయినా ఓ రూపాయి డబ్బు సాయం చెయ్యరు. మాటలు మాత్రం కోటలు దాటతాయి.. క్రియ శూన్యం.
కరువులో అధికమాసం అన్నట్లు ఆ యువరాజుగారి ఓదార్పు సభలకి బోలెడు మంది జనం వచ్చేస్తున్నారు అని కంగారు పడిపోయి మరో మాజీ గారుకూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్నట్లు మరో పక్కనించీ బయలుదేరారు. వీళ్ళ తాపత్రయం గానీ మంత్రాలకు చింతకాయలు రాలవు. జనం వచ్చినంత మాత్రాన భవిష్యత్తులో వోట్లు రాలవు.
ఇలాటి గొడవలు ఎన్ని చూడలేదు? సభల్లో జన సముద్రాన్నిచూసి ఏమిటో ఊహించేసుకుని తీరా సమయం వచ్చేసరికి అంచనాలన్నీ తారుమారు అయిపోయి శీర్షాసనం వేసినవారిని చూడలేదా? కాబట్టి ఓదార్చిన జనాన్ని ఆకర్షించేస్తున్నాం అని సంబరపడితే మాత్రం భంగపాటు తప్పదు. ఆకర్షణ కాదుకదా ఈ వ్యవహారం అంతా హాస్యాస్పదంగా తయారవుతోంది.
మన నాయకులకు ఏదొచ్చినా పట్టలేం. ఈ బాటలో మరో పదిమంది ఓదార్చడానికి బయలుదేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక అప్పుడు వుంటుంది అసలు తమాషా. అందరూ ఓదారుస్తాం ఓదారుస్తాం అని పోలోమంటూ బయలుదేరితే ఏడిచేవాళ్ళు దొరకద్దూ?
అసలిప్పటికే జనం తెలివిమీరారు. అదివరకులాగా వెర్రి గొర్రెల్లాగా వుండటంలేదు. మీటింగుల్లో ఆగ్రహంతో కుర్చీలు అవీ విసిరేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళినా అప్పుడెప్పుడో వచ్చి బోలెడన్ని మాటలు చెప్పావు వరాలు గుప్పించావు.. వాటి సంగతి తేల్చు అని నిలదీస్తున్నారు.
జనాలకి నాయకులకీ మధ్యన పాపం కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఏదో ఓ చోట సభ అయితే జనాన్ని పోగెయ్యటం వేరు ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగుతూ జనాన్ని ఓదారుస్తాం అంటే అందుకు రంగం సిద్ధం చెయ్యటం అంటే మాటలు కాదు. ఇంటింటికీ తిరిగి మేము ఫలానా రోజున వచ్చి మిమ్మల్ని ఓదారుస్తాం. ఇంటికొచ్చి ఓదారుస్తామా లేక వూళ్ళో కూడలి దగ్గర ఓదారుస్తామా అన్నది ఇంకా డిసైడు కాలేదు. ఎన్నింటికి వస్తామో కూడా డిసైడుకాలేదు. కానీ వస్తాం.. ఓదారుస్తాం.. మీరు ఆ వేల్టికి కాస్త ఏడిచి మా ఆబోరు దక్కించరా దయచేసి అని కాళ్ళా వేళ్ళా పడే రోజులొస్తాయి. తప్పదు గాక తప్పదు.

16, జనవరి 2012, సోమవారం

తెలుగు లో అతి సులబంగా టైపు చెయ్యడం ఎలా

చాల ఈజీ గా చెప్ప్పారు ఈ వీడియో చూడండి , ఇక మీరు తెలుగును ఆంగ్లం లో టైపు చెయ్యనవసరం లేదు ...



సాఫ్ట్  వేర్ కోసం
http://www.google.com/ime/transliteration/


15, జనవరి 2012, ఆదివారం

అమ్మా .. అవనీ..(రాజన్న)

చిత్రం : రాజన్న (2011) 
రచన : శివదత్త 
సంగీతం : ఎం. ఎం. కీరవాణి 
గానం : మాళవిక. 






మాళవిక


                                         
కీరవాణి





*******************
పల్లవి :  
అమ్మా .. అవనీ..
అమ్మా అవనీ నేలతల్లీ అని  - ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకనీ // అమ్మా //

అను పల్లవి :
కనిపించిన ఒడిలోనే కనుమూయనీ
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ // అమ్మా // 

చరణం 1 : 
తల్లీ నిను తాకితేనే - తనువు పులకరిస్తుంది.
నీ ఎదపై వాలితేనే - మేను పరవశిస్తుంది.
తేట తెలుగు జాణ - కోటి రతనాల వీణ
నీ పదమూలాన నువ్వే - నాకు స్వర్గం కన్న మిన్న // అమ్మా // 

చరణం 2 : 
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహాస గాథలు వింటే
నరనరాలలో రక్తం ఉప్పొంగుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస.. రిగగ రిపప గడదద పడదద..
సదసద.. సదసద పగపద
పద పద.. పద పద.. (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస.. రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా.. గరిసదపా
గాప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగారి సారీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగా పదస రిగ - పా
గప గారి సరిసద
వీరమాతవమ్మా - రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా
నువ్వు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన - కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది - నీకీగలదేదమ్మా // అమ్మా //  

ఉత్తమం స్వార్జితం విత్తం... స్త్రీవిత్తం అధమాధమమ్



మామగారు కన్యాదాత. అంటే దానం ఇచ్చే హోదాలో ఉన్నవారు. అల్లుడు దానం పుచ్చుకునే స్థితిలో ఉంటాడు. దాతగా మామగారికి ఆభిజాత్యం ఉండకూడదు. మామగారు తన కుమార్తెను ఆప్యాయంగా దానం చేయాలి. అల్లుడు మామగారిని తండ్రితో సమానంగా గౌరవించాలి. ఇక ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నవి మామా అల్లుళ్లను బట్టి ఉంటుంది. మనుచరిత్రలో స్వరోచి, మనోరమల వివాహ సమయంలో స్వరోచి మామగారు స్వరోచికి విమానాన్ని బహుమానంగా ఇచ్చాడు.

అంటే అతని స్థాయిని బట్టి ఇచ్చాడే కాని, అల్లుడి ఒత్తిళ్లకు తల ఒగ్గి కాదు. అల్లుడు ఎప్పుడూ మామను ఒత్తిడి పెట్టకూడదు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అల్లుళ్లు అడిగిమరీ కట్నకానుకలు తీసుకునే ఆచారం లేదు. ఆంధ్రదేశంలో సంక్రాంతిని పెద్ద పండుగ అంటాం. మనది వ్యవసాయప్రధానమైన రాష్ట్రం కాబట్టి, పంటలు ఇంటికి వచ్చే సమయం కాబట్టి, అల్లుళ్లు ఈ సమయంలో కానుకలు అడగడానికి, ఇవ్వడానికి ఈ పండుగ ఒక సందర్భం అయ్యింది అంతే తప్ప మరేమీ కాదు. ‘‘ఉత్తమం స్వార్జితం విత్తం... స్త్రీవిత్తం అధమాధమమ్’’ అనే నీతి వాక్యం ప్రకారం చూసినా స్త్రీ నుంచి ధనం రావాలని ఆశించకూడదు. స్త్రీనుంచి ధనం ఆశించడం అంటే పరోక్షంగా మామగారిపై ఒత్తిడి తేవడమే. అల్లుడికిది తగని పని.

శివకేశవులంతటి వాళ్లే అడగలేదు!
శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో ఉంటాడు. శివుడు హిమాలయాల మీద నివసిస్తాడు. ఒకరకంగా వీరిరువురూ ఇల్లరికపుటల్లుళ్లే. అయితే శివ కేశవులిద్దరూ మామగారింట్లోనే ఉన్నప్పటికీ, వారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు, వారి నుంచి ఏనాడూ ఏమీ ఆశించలేదు.

పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేయమని అడగడానికి ఋషులంతా కలిసి వెళ్లినప్పుడు మాత్రం, ఋషులలో ఒకరైన అంగీరసుడు, ‘‘శివుడికి ఇవ్వడం వలన కలిగే లాభాలు చెబుతూ... ఇంతవరకు ఈశ్వరుడు ఎవ్వరికీ నమస్కరించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన కంటె పెద్దవాళ్లు లేరు. ఇప్పుడు నీకు సమస్కరిస్తాడు. ఈ సృష్టిలో నువ్వొక్కడివే ఈశ్వరుడితో నమస్కరించబడేవాడివి అవుతావు. మామగారు తండ్రితో సమానం అవుతారు. అందువలన పూజనీయుడు. మామగారిని గౌరవించడమనేది మన సంప్రదాయం’’ అని దక్షప్రజాపతికి చెప్పినట్లు ‘కుమారసంభవం’ లో కాళిదాసు వర్ణించాడు.

- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

14, జనవరి 2012, శనివారం

పనిలో మెళకువలు!


చిట్టి కథ
అడ్డదిడ్డంగా చెట్లు, తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూలమొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటిని నరికి చదును చేయాలి కదా! అందుకోసం రాముడు, భీముడు అని ఇద్దరు పనివాళ్లని పెట్టుకున్నాడు. భీముడు పేరుకు తగ్గట్లుగా బలంగా, లావుగా ఉంటే, రాముడేమో సన్నగా, బక్కపల్చగా ఉన్నాడు.

ఇద్దరూ చెట్లు నరకడం మొదలు పెట్టారు. మొదటిరోజు ఇద్దరూ సమానంగానే నరికారు. రెండవరోజు భీముడి కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు. మూడవరోజూ, నాలుగవ రోజూ కూడా అంతే! రాముడికన్నా ఎక్కువ పని చేయాలన్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింతగా కష్టపడ్డాడు. కాని, అదేమి చిత్రమో రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసినా, అతనే ఎక్కువ చెట్లు నరికాడు. దాంతో భీముడికి తన శక్తిసామర్థ్యాల మీద అనుమానం వచ్చింది.
అదే విషయం రాముణ్ణడిగాడు.

రాముడు నవ్వేస్తూ ‘‘అన్నా, నువ్వు చెట్లు నరకడం పైనే దృష్టి పెట్టావు కానీ, విశ్రాంతి తీసుకోవడం, నీగొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు. దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు, నే నేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను. పైగా ఆ సమయంలో గొడ్డలికి పదును పెట్టుకునేవాడిని కాబట్టి నా పని మరింత సులువయింది’’ అని జ వాబిచ్చాడు. దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది.

నీతి: కష్టపడి పని చేయడమే ముఖ్యం కాదు, ఓ ప్రణాళిక ప్రకారం పని చేయడం కూడా అవసరం. అప్పుడా పని మరింత తేలికవుతుంది కూడా!
-బాచి

ప్రేమపూర్వకంగా ‘కనుమ’


ఇంక బొమ్మలనోమును కూడా పూర్వం ఇంటింటా చేసేవారు. ఈ విశ్వం అంతా దేవతామయంగా చూడడమూ, దానికి ప్రతిరూపంగా మన ఇంటిలోవారికి కొలువు చెయ్యడమూ, అందర్నీ చూడమని చెప్పి వారికి ప్రసాదాలు పంచిపెట్టడమూ చేసేవారు.

మన సంప్రదాయం... మనుష్యజాతినే కాక పశుపక్ష్యాదుల్ని కూడా ప్రేమించి, వాటికి కూడా ఉత్సవం చెయ్యమని చెబుతుంది. దాన్నే ‘కనుము’ పండుగగా సంక్రాంతి పండుగలో మూడవరోజును పేర్కొన్నారు మన పెద్దలు. నిజానికి ‘కనుము’ అన్నది ఒక పండుగను అనుసరించి వచ్చే పండుగ వంటి రోజు. మకరసంక్రాంతికీ, గ్రహణాలకీ, అమ్మవారి ఉత్సవానికీ, శవదహనానికీ మరుసటి రోజును కనుముగా పెద్దలు వ్యవహరించారు. కనుము అంటే ‘జాగ్రత్తగా చూడు’ అని అర్థం. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన రోజులు అని అర్థం. కానీ ఇందులో మార్పులు జరిగి, కేవలం మకరసంక్రాంతి జరిగిన మరునాడు వచ్చే పండుగను మాత్రమే ఈ పేరుతో ఉచ్చరించడం వాడుకలోకి వచ్చింది.

‘సంక్రాంతికి పంటలు చేతికి వచ్చి మానవుడు భాగ్యవంతుడు కావటానికి మూలమయిన వారిని జాగ్రత్తగా చూసుకో! వారికి పండగచెయ్యి’ అన్న అర్థంతో కనుము పండుగ ఏర్పడింది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. దేశ సౌభాగ్యానికి మూలం పశువుల మీదే పూర్వం వ్యవసాయం అంతా ఆధారపడి ఉండేది. అరక దున్నడం, పట్టి లాగడం, ధాన్యాన్ని ఎడ్లబండ్ల మీద ఇంటికి తేవడం... ఇవన్నీ ఎద్దులవల్లే జరిగేవి. మనకు రైతన్న ప్రాణం అయితే ఆ రైతన్నకి పశువులు ప్రాణం. అందుకే కనుమునాడు పశువుల్ని అలంకరించి, కొత్తబియ్యంతో పొంగలి వండి వాటికి నివేదనగా పెట్టేవారు రైతులు. పశువుల ద్వారా లభించిన ధాన్యసంపదను, మొదటి నైవేద్యంగా పశువులకి పెట్టి, కృతజ్ఞతను ప్రకటించడంగా కనుము పండుగ చెబుతోంది.

ఈ కనుమును తమిళులు ‘మాట్టు పొంగలి’ అంటారు. ‘మాట్టు’ అంటే ‘పశువు.’ కనుక కనుము... పశువులకి చేసే ముఖ్యమైన పండుగ. అంతేకాదు వరిధాన్యం వెన్నులు పక్షుల ఆహారంగా ఇంటిచూరుకు కడతారు. కొంత ధాన్యాన్ని పిచ్చుకల వంటి పక్షులు తినడానికి వీలుగా కళ్లంలోనే వదిలేస్తారు. అందువల్ల కనుమును పశుపక్ష్యాదుల పండుగగా చెప్పాలి.

వేదంలో... వృషభోత్సవం, అనడోత్సవం అన్న పేరుతో వ్యవహరించబడి ఉంది. కనుమునాడు గోపూజ చెయ్యడం ఆచారం. ఇప్పటికీ ఇది తమిళనాడులో కనిపిస్తోంది. అలంకరించిన పశువుల్ని సాయంకాలం మేళతాళాలతో ఊరేగిస్తారు.

తెలుగువారు ఈ పండుగల చివర... తమ రూపం తీసేసుకుని మంచిరూపం ఇవ్వమని కాకిని ప్రార్థించడం ఉంది. కనుక పశువులకీ, పక్షులకీ కూడా చేసే పండుగే ఈ కనుము. అందుకే అన్ని జీవులపట్ల ప్రేమను ‘కనుము.’ అప్పుడు నిన్ను నేను ప్రేమగా చూస్తానని చెప్పడమే అన్ని మతాల సారమూ, అందరి భగవత్తత్వమూ. అదే కనుమూ! కనుమూ! కనుమూ! అన్న శబ్దానికి అంతరార్థం.
- డా.ధూళిపాళ మహాదేవమణి

సంస్కృతి సంప్రదాయాల సంక్రాంతి



కాలానికి మూలకేంద్రమయిన సూర్యుడు నిరంతరం ప్రయాణిస్తుంటాడు. నిజానికి సూర్యుడు ఉన్నచోటే ఉన్నా, అతని చుట్టూ భూగోళం, ఖగోళం తిరుగుతూంటాయి. సూర్యుని చుట్టూ ఈ ప్రపంచం తిరుగుతున్నా సూర్యుడే కదులుతున్నట్లనిపిస్తుంది. అలా కదిలే సూర్యుడు నెలకొక రాశిలోకి మారుతుంటాడు.

సంవత్సరకాలాన్ని రెండు భాగాలుగా లెక్కించి, ఉత్తరాయణం, దక్షిణాయనం అన్నారు. కర్కాటకరాశిలోకి సూర్యుడు మారినప్పటి నుండి ఆరునెలల కాలాన్ని దక్షిణాయనం, మకరరాశిలోకి మారినది మొదలు ఆరునెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. నెలనెలా సూర్యుడు ఏదో ఒకరాశిలోకి సంక్రమణం చేస్తూనే ఉంటాడు, కనుక ప్రతిమాసం సంక్రాంతి వస్తుంది. అయితే దక్షిణాయన ఆరంభానికి మూలమైన కర్కాటక సంక్రమణానికీ, ఉత్తరాయణ ఆరంభానికి మూలమైన మకరసంక్రమణానికీ అధిక ప్రాధాన్యం ఏర్పడింది. అందులోనూ మకర సంక్రాంతికి ఉన్నంత విశేష ఆదరణ తెలుగునాట మరే పండుగకూ లేదేమో!

ఏడాదిలో ఎన్నో పండుగలు వస్తుంటాయి. ఏ పండుగైనా ఆ ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. కాని సంక్రాంతిని మాత్రం నెలరోజులు జరుపుకుంటారు. ముగ్గులు, హరిదాసులు, డూడూ బసవన్నలు, గంగిరెద్దు మేళాలతో పలెల్లలన్నీ కళకళలాడతాయి.

నిజానికి పితృదేవతలను అర్చించడమే ఈ పండుగ ప్రత్యేకత. పెద్దలు తరించే పండుగ కాబట్టి దీనిని పెద్దపండుగ అన్నారు. పితృదేవతలు దక్షిణాయనమంతా ప్రయాణించి, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తమలోకాలలోకి అడుగు పెడతారని పురాణాలు చెపుతున్నాయి. అందుకనే ఆరోజు వారిని విశేషంగా అర్చించి, వారి అనుగ్రహాన్ని పొందాలి.

ఏ పెద్దలు మనకు ఈ జన్మనిచ్చారో, ఎవరు కష్టపడి మన జీవికను తీర్చిదిద్దారో వారికి కృతజ్ఞతను చూపించేదే సంక్రాంతి. ‘మీరు మాకు ఇచ్చిన బతుకును మేము పవిత్రంగా, ఆనందంగా అనుభవిస్తున్నాము సుమా!’ అని వారికి తెలియజేయడానికే అభ్యంగనస్నానాలు చేసి, పట్టుబట్టలు కట్టుకుని దేవాలయాలకు వెళ్లడం, బంధుమిత్రులతో గడపడం, పిండివంటలతో భోజనాలు చేయడం. .. ఎన్నో సరదాలు కనిపించే గొప్ప పండుగ.

హరిదాసు కీర్తనలతో ఆధ్యాత్మికత పండించేది, తిండి పెట్టే బసవన్నను పూజించి, కృతజ్ఞతను చూపించేది, భారతీయ సంగీతానికి జంతువులు కూడా ఆనందిస్తాయని తెలియజేసేది, తెలుగునాట బావమరదళ్ళ సరస సంభాషణలను చూపేది ఈ పండుగే. గొబ్బెమ్మల పూజ ద్వారా అన్ని పదార్థాలలోనూ దైవాన్ని దర్శించగలిగే హృదయం భారతీయులకు ఉందని చూపించేది, అందాలకు పల్లెలే పట్టుకొమ్మలని చెప్పేది ఒక్క సంక్రాంతి పండుగే. పౌష్యలక్ష్మి , సంక్రాంతి లక్ష్మి, మకరలక్ష్మి పేర్లతో ఈ పండుగను లక్ష్మిగా భావిస్తారు.

ఏ పండుగైనా ఆయా దేవతలపై ఉన్న భక్తిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. కాని సంక్రాంతి మాత్రమే భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పండుగకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.
- డా.కడిమిళ్ల వరప్రసాద్

పిండివంటలు చేయించడం, అల్లుళ్ళు ఇళ్ళకు రావడం, బావమరదళ్ళ మధ్య చిలిపి సరసాలు. అబ్బో! ఇంతకాలం ఇంత పెద్ద హడావుడి కలిగించే పండుగ మరొకటి లేదన్నది వాస్తవం. అందుకేనేమో దీనిని మాత్రమే పెద్దపండుగ అన్నారు. 

అపూర్వం ‘భోగి’పర్వం


ఏడాది పొడుగునా ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ప్రతి పండుగకు ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. కాని భోగి అరుదైన స్వతంత్రత ఉన్న పండుగ. భోగి అనే పేరులోనే ఎంతో అంతరార్థం ఉంది. ఇది ఏ దేవుడినీ, దేవతనూ సూచించదు. ఎవరి పుట్టిన రోజూ కాదు. మరి భోగి అనే పేరు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వంటి విశేషాల సమాహారమే ఈ వ్యాసం.

సౌరమానం ప్రకారం సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించేనాడు జరుపుకునే మకరసంక్రాంతి పండుగలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘భోగి’. దీనిని పెద్ద పండుగ అయిన సంక్రాంతికి అనుబంధంగా, ఉపగ్రహంగా భావించకూడదు. ‘భోగి’ అరుదైన స్వతంత్ర పండుగ. దాని మరునాడు వచ్చే మరో పండుగే సంక్రాంతి అని తెలుసుకోవాలి. భోగి అనే పేరులోనే ఎంతో అంతరార్థం ఉంది. ఇది ఏ దేవుణ్నీ, దేవతనూ సూచించదు. ఎవరి పుట్టినరోజూ కాదు. మరి ‘భోగి’ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?

రాజభోగాలు... భోగములు అంటే సుఖాలను అనుభవించేవాడు ‘భోగి.’ తెలుగునేల వ్యవసాయ ప్రధానమైనది. ఏడాది పొడవునా కష్టపడిన రైతు, పండిన పంటతో ఆనందంగా ఇంటికి వచ్చి ఆలుబిడ్డలు, బంధుమిత్రులతో రాజభోగాలను అనుభవించే పండుగ కనుక దీనిని భోగి అంటారు.

దక్షిణాయనంలో చివరిరోజు ఇది. ఆనాడు ఐహికమైన, భౌతికమైన సుఖాలను, భోగాలను అందరితో పంచుకోవాలి. పండిన పంటలను పనివారికి, యాచకులకు, హరిదాసులకు, పశుపక్ష్యాదులకు వితరణ చేయటం రాజభోగం. ‘సంపదను పదిమందికీ త్యాగం చేయటం భోగం, తానొక్కడే తినటం రోగం’ అనే సత్యాన్ని తెలిపేదే భోగిపండుగ. మరునాటి ఉత్తరాయణంలో ఆధ్యాత్మిక పారమార్థిక చింతనలో ప్రధానమైన త్యాగగుణాన్ని భోగి అందిస్తుంది. అన్ని లోహాలను, బంగారంగా మార్చే పరుసవేదిని తయారుచెయ్యటానికి వేమన తన స్నేహితులతో చాలా ప్రయోగాలు చేసి, వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. చివరికి విజయం లభించి మేలిమి బంగారం తయారయ్యేసరికి వైరాగ్యం వచ్చి యోగి అయ్యాడు. అదే భోగిపండుగ రహస్యం.

పురుషులకు పండుగ భోగం... పాత బట్టలను పేదలకు పంచాలి. పాడైపోయిన పాతవస్తువులను తగులబెట్టి అందరూ చలికాచుకొంటుంటే ఆనందించాలి. వేడినీళ్లు పెట్టుకొని నువ్వులనూనెతో తలంటిపోసుకోవాలి. బంధాలే దుఃఖానికి కారణం అని తెలుసుకోవాలి. ఎండిపోయిన చెట్టుకొమ్మలను విరిస్తే రాబోయే వసంతానికి కొత్తకొమ్మలు వస్తాయి. గత వర్షకాలంలో మొలిచిన కలుపుమొక్కలను తగులబెడితే నేల శుభ్రం అవుతుంది. చలికి పెరిగిన దోమలు భోగిమంట పొగతో, మంటలతో తగ్గిపోతాయి. ఇలా ఇది పురుషుల భోగి.

గొబ్బెమ్మలను సాగనంపే భోగం... ఆవు విసర్జించిన పేడ మనకు ఎంతో పూజనీయంగా, ఆరోగ్యప్రదంగా ఉపయోగపడుతోంది. దానితో ధనుర్మాసం నెలరోజులు గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి పూజిస్తారు. పిడకలపై ఆవుపాలతో, కొత్తబియ్యంతో పొంగళ్లు వండుతారు. భోగిపండుగనాడు సాయంకాలం సందెగొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారు. కన్నెపిల్లలు పాటలు పాడి కోరికలు కోరుకుంటారు. పెద్ద ముత్తైవలకు వాయినాలు ఇస్తారు. గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తారు. తల్లికి ప్రత్యామ్నాయంగా గోమాత చెప్పబడింది. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే దిక్కు. భోగినాడు గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిగింది. ధనుర్మాసం నెలరోజులు ఆమె గోపికా భక్తితో పాటలు పాడింది. ఇల్లు పాడిపంటలతో వర్థిల్లటానికి గోపికల వలె ప్రార్థించి గొబ్బెమ్మలను సాగనంపటమే భోగిపండుగలో స్త్రీల పాత్ర.

పిల్లలకు ఆరోగ్య భోగం... భోగిపళ్లు, బొమ్మలకొలువు కూడా ఈ పండుగకు ప్రధానమైనవి. రేగుపండ్లు చిన్నపిల్లల తలపైపోసి పేరంటం జరుపుతారు. రేగుపండును అర్కఫలం అంటారు. సూర్యునికి ప్రతినిధిగా సౌరశక్తిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి రేగుపళ్లకు ఉంది. ఉత్తరాయణంలో రాబోతున్న మొదటి చాంద్రమాన మాసం మాఘమాసం. అది సూర్యారాధనకాలం. చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోయటం వలన వాటి స్పర్శ వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యుని ఆశీస్సులను అందించినట్లవుతుంది. భోగినాడు బొమ్మలకొలువుకు హారతి ఇస్తారు. పిల్లల్లో సృజనాత్మకతను, పరిసరాల విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నిర్మాణశాస్త్ర దృష్టిని పెంపొందించే బొమ్మలకొలువును ఈనాడే చేస్తారు. ఇది పిల్లల భోగిపండుగ.

దంపతులకు ఇంద్రభోగం... ఇంద్రభోగాలు అన్నిటికంటె గొప్పవి. దేవతల రాజుగా స్వర్గలోకంలోనే కాక యజ్ఞయాగాది కర్మలలోనూ పెద్దభాగాన్ని పొందుతాడు. భోగి అనే పదానికి ఇంద్రుడే సరిపోతాడు. తూర్పుదిక్కుకు, మేఘాలకు అధిపతిగా భూమికి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడే. భోగిపండుగ ఇంద్రపూజ కోసం ఏర్పడింది. ఉత్తరాయణం దేవయానకాలం కనుక ముందురోజు... దేవతల అధిపతియైన ఇంద్రుణ్ని పూజించి ప్రసన్నం చేసుకోవాలి. భోగిమంటలు... మంత్రరహితమైన హోమాలుగా ఇంద్రుణ్ని ఆరాధించి సంతోషపరుస్తాయి. ఆ మంటలతో నీరు, గాలిలో తేమ ఆవిరిగా మారి పొగతో నింగికి చేరి మేఘాలు ఏర్పడి అనుకూల పరిస్థితుల్లో వర్షాలు కురుస్తాయి. గోదాదేవి రంగనాథుని కోసం ధనుర్మాసమంతా చేసిన తపస్సుకు రంగనాథుడు ప్రత్యక్షమై పెండ్లి చేసుకున్నాడు. ఒకరినొకరు ఇష్టపడిన స్త్రీపురుషులు దంపతులైతే అప్పుడే భోగి అవుతారని ఈ పండుగ చెబుతోంది.
- డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్

భోగికి ముందు, తరువాత... చలిమంటలుగా పిలిచేవాటిని, ఈరోజు మాత్రం భోగిమంటలు అంటారు. దక్షిణాయనంలోని వర్షాలకు, చలికి దేహంలో పెరిగిన వాత లక్షణాలు, అనారోగ్యాలు నువ్వులనూనెతో, మూలికాగుణాలు గల క ట్టెలు, కంపలతో కాగిన నీళ్లతో అభ్యంగనస్నానంతో తొలగిపోతాయి. ఆరోగ్యం, నూతనోత్సాహం ఉత్తరాయణం వైపు నడిపిస్తాయి. భోగిమంటల్లో ఇంత అంతరార్థం ఉంది. దానిని బట్టి ఈ పండుగ ప్రాధాన్యాన్ని గ్రహించాలి. కాగిన ఆవుపాలు, కొత్తబెల్లంతో మెత్తగా ఉడికిన కొత్తబియ్యం నిండి పొంగి పొంగలిగా తయారుకావాలి. పొయ్యిలో పడకుండా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి.

9, జనవరి 2012, సోమవారం

ఉన్నదంతా ఒకటే కులం అదే మానవ కులం!!



వేదాల్లోగానీ.. ఉపనిషత్తుల్లో కానీ చతుర్వర్ణాల యొక్క ఆవిర్భావం, వాటి పరమార్థం వివరించడం జరిగింది. చతుర్వర్ణాలు అనగా నాలుగు కులాలు. ఈ కులాలన్నీ భగవత్ప్రసాదితాలు. సృష్టి క్రమం ప్రారంభమయ్యేందుకు ముందుగా సృష్టికర్త విరాట్‌ స్వరూపంలోని ముఖం నుండి బ్రాహ్మణుడు, భుజస్కంధాల నుంచి క్షత్రియుడు, ఉరువుల నుంచి వైశ్యుడు, పాదాల నుండి శూద్రుడు అనే నాలుగు వర్ణాలు ఉద్భవించాయని చెప్పడమే కాక ఆ కులాల ప్రాముఖ్యతను, వాటి విశిష్టతను వివరించడం జరిగింది. 

కులాల వ్యవస్థీకరణ అనేది భగవంతుడిచే సృజించబడిన సృష్టి అంతయూ సమస్థితిలో సజావుగా కొనసాగేందుకే వ్యవస్థీకరించబడింది. ఈ కులాల్లో దేనిది అగ్రస్థానం, దేనిది అథమ స్థానం అనేది వేదాల్లో ఎక్కడా వర్ణించలేదు. ఏ కులానికి ఉన్న పరమార్థం దానిదే అనేది అక్షర సత్యం. 

కానీ నేటి సమాజంలో తీవ్ర స్థాయిలో నెలకొన్న సమస్య కుల వర్గీకరణ సమస్య. కులాలు అనబడేవి ఏ వ్యక్తికీ పుట్టుకతో సంక్రమించినవి కావు. కానీ పుట్టిన బిడ్డ పెరిగే వాతావరణం, సామాజిక స్థితులు, పెద్దల పెంపకం మొదలైన వాటి క్రమంలో మనిషికి కులం అనేది ఏర్పడుతోంది. అశాశ్వతమైన జీవన క్రమంలో ఏ వ్యక్తి అయినా శాశ్వతమని భావించే కులవర్గ పోరాటాలు ఎందుకు. 

నీ కులం, నా కులం ఒక్కటే, మనం ఇద్దరం ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదనే భ్రమలు మనిషికి ఎందుకు. అసలు ఈ కుల వ్యవస్థ ఎప్పుడు ఎందుకు ఏర్పడింది, కులాలను లెక్కించే సంప్రదాయం ఎక్కడ మొదలైంది, ఆ కులాల పరమార్థం ఏమిటి అనేది గ్రహించాలని వేదాలు వల్లిస్తున్నాయి. వాస్తవానికి ఉన్నదంతా ఒకటే కులం అదే మానవ కులం, అదే మానవత్వమని చతుర్వర్ణాలు వెల్లడిస్తున్నాయి.

7, జనవరి 2012, శనివారం

రెండు హత్యలు


వెస్ట్ వర్జీనియా రోడ్‌లో కారు నడిపే సేమీకి అకస్మాత్తుగా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తే కుందేలు కనిపించడంతో, అనాలోచితంగా కారు బ్రేక్‌ని వేశాడు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. కారు దాని మీదికి ఎక్కిందని చప్పుడుని బట్టి సేమీ గ్రహించాడు. అప్పటికే అతని కారు వంద అడుగుల దూరం ప్రయాణించింది.
‘బావుంది. ఈ రోజు నేను చేసిన రెండో హత్య ఇది’ మనసులో అనుకున్నాడు.
సేమీ షికాగోలోని ఓ బ్యాంక్‌లో శని ఆదివారాలు మధ్యాహ్నం పనె్నండు నించి రాత్రి పనె్నండు గంటల దాకా పని చేస్తున్నాడు. రిపోర్టులని ప్రింటర్లలో ప్రింట్ చేసి, వాటిని అనేక బ్రాంచీలకి పోస్ట్ చేయడానికి కవర్లలో ఉంచి అతికించడం సేమీ పని. సేమీకి ఆ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వ్యక్తిగత కంప్యూటర్ పాస్‌వర్డ్ తెలిసి ఉండకపోతే, ఈ రాత్రి ఆ బ్యాంక్‌లోనే ఉండి పని చేస్తూండేవాడు.
పదిహేను రోజుల క్రితం ఓ రిపోర్ట్ మీద అతను తాగే డైట్ డ్రింక్ వొలికింది. దాన్ని శుభ్రం చేస్తూంటే ఆ పాస్‌వర్డ్ కనిపించింది. ఆ వైస్ ప్రెసిడెంట్ చాలా నిర్లక్ష్యంగా తన పాస్‌వర్డ్‌ని ఆ రిపోర్టులో రాశాడు.
సేమీ ఆ తర్వాత తన పనంతా ఎంతో తేలికగా చేయగలిగాడు. డెసిమల్ పాయింట్‌ని రెండు స్థానాలకి మారిస్తే వంద కాస్తా పది వేలుగా మారింది. చిరునామాని కూడా మారిస్తే అతని అడ్రస్‌కి చెక్కులు రాసాగాయి. దొంగ కంపెనీ లెటర్ హెడ్‌లని ఇందుకోసం ముద్రించి లోన్ అప్లికేషన్‌ని పెట్టాడు. వాటిని తనే ఆ వైస్ ప్రెసిడెంట్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి శాంక్షన్ చేసి చెక్కులని సంపాదించాడు. బ్యాంక్‌కి వచ్చిన ఆ ఆదాయాన్ని తన అకౌంట్‌లో జమ అయ్యేలా ఏర్పాటు చేశాడు. ప్రతీ రాత్రి ఓ గంటన్నర పనిచేస్తే చాలు. అనేక మంది అకౌంట్ల నించి తన అక్కౌంట్‌కి బదిలీనో లేదా తన అడ్రస్‌కి బ్యాంక్ నించి చెక్కు రాసాగింది. రెండు వారాల తర్వాత సేమీ లక్షాధికారి అయ్యాడు.
ఈ ఆటని మరో రెండు వారాలు కొనసాగించి ఆ తర్వాత మధ్యధరా సముద్రంలోని ఏదో ఓ దీవికి వెళ్లి కొన్నాళ్లు అక్కడ గడిపి, పోలీసులు తన కోసం వెదకడం ఆగిపోయాక తిరిగి వద్దామని అనుకున్నాడు. ఐతే బ్యాంక్‌కి కళ్లు, చెవులు అధికం అని సేమీకి తెలీదు. మేటిజ్ అనే అకౌంట్ హోల్డర్ తన అకౌంట్‌కి రావాల్సిన అద్దె ఆ నెల తన అకౌంట్‌లో పడలేదని, అద్దెని వారు కట్టారని ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌లో లోపం ఉండదు. దాంతో ఓ రాత్రంతా ఇద్దరు ఆడిటర్స్ తనిఖీలు చేస్తే జరిగేది వారు చూచాయగా అర్థం అయ్యింది.
ఆ రాత్రి వైస్ ప్రెసిడెంట్ సేమీ దగ్గరకు వచ్చాడు. కంప్యూటర్ నించి ప్రింట్ అవుట్స్ తీసే సామాన్య పార్ట్‌టైం ఉద్యోగి దగ్గర పిస్తోలు ఉండచ్చని వైస్ ప్రెసిడెంట్ భావిస్తే పోలీసులతో వచ్చి ఉండేవాడు.
ఆలోచనల్లో ఉన్న సేమీ కారుకి ఓ హైవే పోలీస్ పెట్రోల్ కారు ఎదురొచ్చింది. డిక్కీలో శవంతో పోలీసులకి పట్టుబడటం మూర్ఖత్వం కాబట్టి సేమీ పరిమితిని మించిన వేగంతో కారుని నడపడం లేదు. దాంతో వారు అతని కారుని ఆపలేదు.
సేమీ వెస్ట్ వర్జీనియాలోని తన ఇంటికి వెళ్తున్నాడు. అతనికి తన ఇంటి ప్రాంతం అంటే రోత. ముఖ్యంగా ఏడాదిన్నరగా షికాగో లాంటి మెట్రోపాలిటన్ నగరంలో గడిపాక, చుట్టూ ఖాళీ అయిన గనులు, పర్వతాలు, లోయలు గల చిన్న గ్రామంలోని తన ఇంట్లో తనకి ఏం తోస్తుంది? కాలక్షేపానికి అక్కడ ఏం ఉండదు. ఐతే తను దాక్కోడానికి అదే భద్రమైన చోటని సేమీకి తెలుసు. తన స్వగ్రామం గురించి ఎక్కడా రికార్డుల్లో లేదు. ఇలాంటిదేదో చేసే ఉద్దేశంతోనే షికాగోకి చేరుకున్న సేమీ తన స్వగ్రామంగా కాలిఫోర్నియాలోని సేక్రిమెంటోని అన్ని చోట్లా పేర్కొన్నాడు. షికాగోలో తల పూర్తిగా పైకెత్తితే తప్ప ఆఖరి అంతస్థు కనపడని ఎతె్తైన బిల్డింగ్‌లోని తన అపార్ట్‌మెంట్ ఎక్కడ? తన స్వగ్రామంలోని చెక్కలతో నిర్మించబడ్డ, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఎక్కడ?
వైస్ ప్రెసిడెంట్ మాయం అయ్యాడని తెలీగానే పోలీసులు తన కోసం వెదుకుతారు కాబట్టి అంతర్జాతీయ విమాన ప్రయాణం మంచిది కాదు. అంటే మధ్యధరా సముద్రంలోని దీవులకి తను ఇప్పుడు వెళ్లలేడు. తన తల్లితో తన ఇంట్లో ఎటూ గడపలేడు. అక్కడ పని పూర్తి చేసుకొని పోలీసులు తను వెళ్తాడని ఊహించని ఊటా లేదా నెబ్రెస్కా రాష్ట్రాలకి వెళ్లాలి. వాళ్లు తన కోసం ఫ్లోరిడా, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలలోని లగ్జరీ స్పాట్‌లలో వెదుకుతారు.
ప్రతీ సోమవారం తను అన్యాయంగా సంపాదించిన సొమ్ముని తన బ్యాంక్ అకౌంట్‌లోంచి డ్రా చేయడం మంచిదైంది. ఆ సొమ్మంతా కారు డిక్కీలోని ఓ సంచీలో ఆ వైస్‌ప్రెసిడెంట్ శవం పక్కనే ఉంది. ఇంక తన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం ఆ రాత్రి బదిలీ చేసిన సొమ్ము మాత్రమే ఉంది. ఏటియంలోంచి ఐదు వందల డాలర్లు మాత్రమే తను ఐదుచోట్ల షికాగోలో డ్రా చేయగలిగాడు. ఇరవై నాలుగు గంటలలోగా డ్రా చేసే పరిమితి అది.
* * *
క్రమేపీ దూరంగా కొండలు కనిపించాయి. మర్నాడు ఉదయం దాకా వైస్ ప్రెసిడెంట్ మాయం అయ్యాడని ఎవరికీ తెలీకపోవచ్చు. అది తెలిసేసరికి తను అతని శవాన్ని ఇంకెవరూ తెలుసుకోలేని చోట దాస్తాడు. నిజానికి ఇంత దూరం రావడానికి గల కారణాల్లో అదొకటి.
క్రమేపి కారు కొండ పైకి ఎక్కసాగింది. సేమీ మలుపుల దగ్గర జాగ్రత్తగా ఉండసాగాడు. అతను మలుపుల్లో లెక్కలేనన్నిసార్లు కారుని డ్రైవ్ చేశాడు. కొత్త వాళ్లయితే భయపడచ్చు. సేమీ తన కారుని షార్ప్‌గా ఉన్న మలుపుల్లో లాఘవంగా తిప్పుతూ పోనిస్తున్నాడు. ‘ఈ రోడ్డు ఎక్కాక ఇంక పోలీసుల భయం ఉండదు’ అనుకున్నాడు. తన గ్రామానికి దారి తీసే ఈ చిన్న రోడ్డు మీద పెట్రోలింగ్ ఉండదు. కేవలం హైవే మీదే పెట్రోలింగ్ ఉంటుంది. ఈ రోడ్డు మీంచి కారు లోయలో పడటం గురించి సేమీ ఎన్నోసార్లు విన్నాడు. ఆ కారు డ్రైవర్లంతా ఆ రోడ్డు మీదకి మొదటిసారి వచ్చినవారే. తన గ్రామానికి చెందిన ఇద్దరు మాత్రమే ఈ రోడ్డు మీద మరణించారు. వారు తాగి ఉన్నారు. ఒకరు తన తండ్రి.. మరొకరు ఓ టీనేజ్ యువకుడు. వాళ్లని నిజానికి చంపింది ఆల్కహాల్ తప్ప ఆ రోడ్డు కాదు.
తన రాష్ట్రం మోటో ‘ఆల్మోస్ట్ హెవెన్’. తను ఆల్మోస్ట్ హెల్‌కి - అంటే తన ఇంటికి వచ్చేసినట్లే. ఇంకో పావుగంటే. మర్నాడు తన గ్రామం నించి ఎక్కడికి వెళ్లాలి? ఊటానా? నెబ్రెస్కానా? చెరకు, మొక్కజొన్నల పంట పొలాలు సేమీకి వెనె్నల్లో కొండ మీంచి కింద కనపడ్డాయి. ఆ రెండూ పండే పొలాలు పిల్లల్ని ఆకర్షిస్తాయి. కారణం గోధుమ, ఇతర ధాన్యాల్లా కావవి. వాటిని కోసుకుని తక్షణ తినచ్చు. చిన్నతనం గుర్తుకి రావడంతో మర్నాడు ఏదైనా పొలానికి వెళ్లాలనుకున్నాడు. తన ఊరిలోని సగం మంది టీనేజర్స్ తనలా దొంగలు అవడానికి కారణం బహుశా చిన్నతనం నించే పొలాల్లో దొంగతనం చేయడానికి అలవాటు పడటం కావచ్చు. తన గ్రామానికి చెందిన ఎంతోమంది యువకులు జైళ్లల్లో గడుపుతున్నారు.
రోడ్డుకి అటు ఇటు గల మట్టి రోడ్లలోకి వెళ్తే, కొద్ది దూరంలో ఖాళీ గనులు కనిపిస్తాయి. షికాగోలోనే
తను పార, గునపాలు కొని ఉండాల్సింది. రోడ్డు కిందకి దిగసాగింది. సేమీ అప్రమత్తంగా కాలుని బ్రేక్‌కి ఆనించి డ్రైవ్ చేయసాగాడు. మరో అరగంటలో కారుకి అటు, ఇటు ఇళ్లు కనిపించాయి. చిట్టచివరికి తను ఎక్కడ్నించి షికాగోకి బయలుదేరాడో అక్కడకి తిరిగి వచ్చాడు - ధనవంతుడిగా.
సేమీ కారుని ఇంటి ముందు డ్రైవ్ వేలో ఆపి కారు దిగి వెళ్లి తలుపు తోశాడు. లోపల బోల్ట్ పెట్టి ఉంది. అర్ధరాత్రి ఒకటిన్నరకి ఎందుకు తీసి ఉంటుంది? డోర్ బెల్ నొక్కాడు. కళ్లు నులుముకుంటూ తలుపు తీసిన సేమీ తల్లి అతన్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది.
‘్ఫన్ అయినా చేయకుండా వచ్చావే?’
‘అనుకోకుండా రావల్సి వచ్చింది. ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉందా?’
‘ఓ అరగంటలో డిన్నర్ సిద్ధం చేస్తాను’
‘మంచిది. ఈలోగా నేను స్నానం చేస్తాను’
తల్లి వంట గదిలోకి వెళ్లగానే ఇంటి బేస్‌మెంట్‌లోని పార, పలుగులని రహస్యంగా బయటకి తెచ్చి, డికీ తెరచి శవం పక్కన పెట్టాడు. తల్లి కంఠం విని, డిక్కీ తలుపు మూసి ఇంటి గుమ్మం దాకా వచ్చాక డబ్బు సంచీని లోపలకి తేవడం మరిచానని గుర్తుకు వచ్చింది.
‘నీ ఉద్యోగం పోయిందా?’ అడిగింది సేమీ తల్లి.
‘పోలేదు. నాకు ఇంకో ఉద్యోగం వచ్చింది. ఎక్కువ జీతం. రెండు రోజుల తర్వాత చేరాలి. నిన్ను చూసి చాలా రోజులైంది కాబట్టి అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాను. ఎల్లుండి మళ్లీ వెళ్లిపోవాలి’
‘మంచిది’
ఏభై వేల డాలర్లు తీసుకుని మిగిలింది తను వెళ్లేలోగా తల్లికి తెలీకుండా బేస్‌మెంట్‌లో ఎక్కడైనా దాచాలి. మర్నాడు ఉదయం ఆవిడ చర్చికి వెళ్లినప్పుడు ఆ పని చేయాలి అనుకున్నాడు. స్నానం చేస్తూ ఈలపాట పాడాడు.
‘డిన్నర్ టేబుల్ మీద సిద్ధం. నేను పడుకుంటాను. రేపు మాట్లాడుదాం’ తల్లి అరిచి చెప్పింది.
‘సరే’
స్నానం చేసి వేరే దుస్తులు ధరించి ఇంటి తాళం చెవి తీసుకుని, బయటకి వచ్చి తలుపు మూశాడు. అటూ ఇటూ చూసి తల్లికి ఆ కారు స్టార్టయిన శబ్దం వినపడకూడదని దాన్ని స్టార్ట్ చేయకుండా కొంత దూరం తీసుకెళ్లాడు. తర్వాత దాన్ని స్టార్ట్ చేసి గనుల వైపు పోనించాడు. కారుని రోడ్డు మీంచి ఓ మట్టి రోడ్డు మీదకి తిప్పాడు. ఓ గని ముందు కారుని ఆపి కారు దిగి డిక్కీ తెరిచాక వైస్ ప్రెసిడెంట్ శరీరం ఇంకా ఎక్స్‌పైరీ డేట్‌కి దగ్గరగా రాలేదనుకున్నాడు. వాసన మొదలవలేదు.
‘హలో మిత్రమా?’
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు సేమీ.
‘ఏం చేస్తున్నావ్?’ తన పక్కింటి మిత్రుడు గోల్డ్‌బెర్గ్!
‘ఎవరి శవం అది?’ అడిగాడు.
‘నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ?’
అతను పిస్తోలుని సేమీకి గురి పెట్టి చెప్పాడు.
‘నీ కారు శబ్దానికి మెలకువ వచ్చింది. నువ్వు పార, గునపం డిక్కీలో పెట్టడం చూసి ఏదో విశేషం ఉందనుకున్నాను. నీ కారు వెనక సీట్లో దాక్కున్నాను. నేను ఊహించినట్లుగానే నువ్వు కొద్దిసేపట్లో వచ్చి కారు స్టార్ట్ చేశావు. నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలని ఆసక్తితో వచ్చాను. అది ఏదైనా సరే. నేరమే అయి ఉంటుందని నాకు తెలుసు’
‘షికాగోలో ఒకర్ని చంపాను. ఆ శవం పూడ్చడానికి వచ్చాను. కాస్త నాకు సాయం చేయి’
‘ఆ డబ్బు సంచీ గురించి చెప్పవే?’ నవ్వుతూ అడిగాడు గోల్డ్‌బెర్గ్.
‘చూశావా?’ సేమీ మొహం పాలిపోయింది.
‘ఆహా! నువ్వు పని చేసే బ్యాంకులో కొట్టేశావా?’
‘అవును’
‘నా కోసం ఆ సాహసం చేసినందుకు థాంక్స్’
మరుక్షణం గోల్డ్‌బెర్గ్ చేతిలోని పిస్తోలు రెండుసార్లు పేలింది. రెండు గుళ్లు సేమీ ఛాతిలో దిగాయి. అచేతనంగా నేల మీద పడ్డ అతని తలకి గురి పెట్టి మూడోసారి కాల్చాడు గోల్డ్‌బెర్గ్. అతను మరణించడానికి అది ఇన్‌సూరెన్స్ బుల్లెట్.
తర్వాత పార, పలుగు అందుకున్నాడు. రెండు శవాలని ఓ ఖాళీ గని అంతర్భాగంలో పుడ్చాక ఆ కారు డిక్కీలోంచి డబ్బు సంచీని తీసి తెరచి తృప్తిగా చూసి వాటిని కారు వెనుక సీట్లో పడేశాడు. తర్వాత సేమీ కారుని ఓ గని అంతర్భాగంలోకి డ్రైవ్ చేసి తీసుకెళ్లి దాచాడు. తర్వాత బయటకి వచ్చి తన ఇంటికి కాలి నడకన బయలుదేరాడు.
మర్నాడు ఉదయం గోల్డ్‌బెర్గ్ సేమీ తల్లికి అబద్ధం చెప్పాడు.
‘మెలకువ వచ్చి నిన్న రాత్రి నేను సిగరెట్ తాగడానికి బయటకు వస్తే సేమీ హడావిడిగా కనిపించాడు. అర్జెంట్ ఫోన్ వచ్చిందని, తను షికాగోకి వెళ్లిపోతున్నానని మీకు చెప్పమని సేమీ నాకు చెప్పాడు.’ *
(్ఫ్లప్ జారెట్ కథకి స్వేచ్ఛానువాదం)

భద్రం బి కేర్‌ఫుల్ (కెసినోలు... కలియుగ మయసభలు)


ఈ పచ్చి నిజం చదివే ముందు, మొన్ననే నా స్నేహితుడు సతీష్ (ఇల్లందు , ఖమ్మం జిల్లా) ఇలా నే  కేసినోల వెంట తిరిగి జనాలకు నెత్తిన టోపీ పెట్టీ, పెళ్ళాం, పిల్లాడిని మరియు తల్లి తండ్రులను గాలికి వొదిలి వాడు గాల్లో కలిసాడు.... సో బికేరుఫుల్ బ్రదర్స్........

కెసినోలు... కలియుగ మయసభలు

షేర్ మార్కెట్లు, కెసినోల్లోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరూ కచ్చితంగా డబ్బులతో తిరిగి వస్తామనుకుంటారు. అయితే, సర్వే రిపోర్టులు మాత్రం దానికి ప్రతికూలంగా వస్తున్నాయి. ఏం, కేసినోల్లో డబ్బు రాదా అంటే వస్తుంది. అయితే, సగటు లెక్కల ప్రకారం చూస్తే మాత్రం డబ్బు పోతుంది. అదెలా అంటే అందులో ఓడిపోయిన వాడు ఎలాగూ ఓడిపోతాడు. సరే, గెలిచిన వాడు కాన్ఫిడెన్సు పెరిగి ‘ఇప్పుడు వచ్చిన డబ్బు మళ్లీ రాదా’ అని గెలిచిన డబ్బును మళ్లీ అందులోనే పెట్టి ఆడతాడు. చివరకు ఖాళీ జేబులతో తిరిగొస్తారు. అందుకే కెసినోలను ‘కలియుగ మయసభలు’ అంటారు.

మనదేశంలో కెసినోలు ఇంకా విస్తృతంగా రాకపోయినా పర్యాటక కేంద్రాల్లో, ముఖ్యంగా గోవాలో బాగా ఎక్కువ. వీటిలో ప్రవేశించడానికి నిర్దేశిత రుసుము చెల్లించాలి. చాలా వాటిలో మందు, భోజనం ఉచితం. ఇది లోకాన్ని మరిచిపోవడానికి వారి ట్రిక్స్ ఒకటి. అంతేకాదు, టైం తెలియకుండా ఉండడానికి అక్కడ కిటీకీలు గాని, వాచీలు గాని ఉండనివ్వరు. పగలేదో, రాత్రేదో అర్థం కాదు. తిన్నంత తినొచ్చు. డబ్బులున్నంతసేపు ఆడొచ్చు.

లాజిక్‌లకు కూడా అంత సులువుగా అందని ఈ ఆటల వెనుక మర్మాలు అర్థం కావు, అర్థమయ్యే సమయానికి మనవద్ద డబ్బులుండవు. హై లాజిక్‌తో ఏర్పాటుచేసిన ఆ గేములన్నీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుంటాయి. అందుకే ఏదో ఒకటి ఆడి వద్దాంలే అనుకున్నవాళ్లు ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆడుకుంటూ పోతారు. జేబు పూర్తిగా ఖాళీ అయితే గాని సత్యం బోధపడదు. డబ్బులు వస్తూ పోతూ ఉండటం వల్ల పూర్తిగా డబ్బులు అయిపోయే దాకా మనం లూజర్స్ అన్న విషయాన్ని మనసు అంగీకరించదు. ఎందుకంటే చివరి క్షణంలో అయినా మన డబ్బు మనకు రావచ్చన్న ఆశే.

కెసినోల్లో వాడే కొన్ని ట్రిక్స్

డబ్బు రూపంలో కాకుండా పందాలు చిప్స్ రూపంలో మాత్రమే వాడతారు. దానివల్ల మనకు డబ్బు ఎంత పోతుందీ, వస్తుందీ వెంటనే తెలిసిరాదు.

గ్యాంబ్లర్స్, గేమింగ్ మెషిన్లు అన్నీ ఫాస్టే. విపరీతమైన హడావుడి. ఇదంతా కనీసం ఆలోచించే టైమ్‌ను కూడా ఇవ్వదు.

కెసినోల్లో మందు, భోజనం ఉచితం. ఎందుకంటే మీకు ఆకలిని తెలియనివ్వరు. బుధ్దిని పనిచేయనివ్వరు. అప్పుడే కదా మీరు బాగా ఆడగలరు.



మనీమాన్వితం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికావు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

చిట్టి కథ


అపాయంలో ఉపాయం
పులి, నక్క, గాడిద మంచిమిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి.
ఓసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటుకి చేరింది.

ఆ రోజు పులి మాంచి ఆకలిమీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వాటాలెయ్యమని అడిగింది.
‘‘వయస్సులో పెద్దది గాడిద. కనుక ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బాగుంటుంది...’’ అని నక్క తెలివిగా తప్పుకుంది.

నక్క మాటలతో గాడిద ‘‘అబ్బో మనకింత పెద్దరికం ఇస్తున్నారే...’’ అనుకుని ఉప్పొంగిపోయింది.
జింక మాంసాన్ని గాడిద మూడు వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది.

‘‘ఏంటీ గాడిదా, నీకూ నాకూ సమానా వాటానా?’’ అని పులి అమాంతం గాడిదమీద పడి చంపేసింది.
తర్వాత నక్క వంక చూసింది పులి.
‘‘నక్కా నక్కా ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి?’’ అడిగింది పులి.

అప్పుడు నక్కేమందో తెలుసా?
‘‘మిత్రమా, నువ్వు నీక్కావలసిందంతా తినగా మిగిలినదేమైనా ఉంటే అది చాల్లే నాకు. అదే నా భాగ్యమనుకుంటాను’’ అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించింది. ‘‘అన్నట్టు స్నేహితుడా...నీకింతటి తెలివి ఎలా వచ్చింది?’’ అని పులి అడిగింది.

‘‘ఏం చెప్పమంటావు? ఈ గాడిద నుంచే నాకంత తెలివొచ్చింది’’ అని నక్క వినయంగా చెప్పి అటూ ఇటూ చూసింది.
నీతి: అపాయం నుంచి బయటపడటానికి దేహబలం సరిపోదనుకుంటే బుద్ధిబలాన్ని ఉపయోగించాలి!

-యామిజాల జగదీశ్